ఆరుగురు యూకే ప్రయాణికులకు కరోనా? ఇండియాకు కొత్త వైరస్ వచ్చేసిందా?
posted on Dec 22, 2020 4:12PM
యునైటెడ్ కింగ్ డమ్ ను వణికిస్తున్న కరోనా కొత్త వైరస్ ఇండియాను హడలెత్తిస్తోంది. యూకే నుంచి సోమవారం రాత్రి ఇండియాకు వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరికి రూపాంతరం చెందిన వైరస్ సోకిందా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. యూకే నుంచి ఎయిర్ ఇండియా విమానం సోమవారం రాత్రి 10.40గంటలకు న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ ఆరుగురు ప్రయాణికుల్లో ఒకరు చెన్నైకి కనెక్టింగ్ విమానం ద్వారా వచ్చారు. అక్కడి విమానాశ్రయంలో అతనికి కరోనా పాజిటివ్గా తేలింది.
ఆ విమానంలో క్రూ సిబ్బందితో సహా మొత్తం 266 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారికి సోకింది కొత్త వైరస్ అనే విషయమై ఇంకా స్పష్టత లేదని ప్రభుత్వ అధికారి అవనీశ్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల శాంపిల్స్ను పుణె వైరాలజీ ల్యాప్ పంపించామని.. పరీక్షల ఫలితాలు వచ్చాకే కరోనా సోకింది లేనిది తెలుస్తుందని చెప్పారు.
యూకే నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా నిర్దారణ కావడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానంలో భారత్కు వచ్చిన ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. యూకేలో రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా ఆ దేశం నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి యూకే నుంచి వచ్చే అన్నిరకాల విమానాల రాకపోకలపై భారత్ కూడా నిషేధం విధించింది. ఈ నిషేధ డిసెంబర్ 31వరకు అమలులో ఉంది. ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.