లోక్‌సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం..విపక్షాల నిరసన

 

భారత పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఆపరేషన్ సింధూర్ నిలిపివేత, ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే రెండు సార్లు సభను వాయిదా వేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల, తాజాగా సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మరో పక్క రాజ్య సభలోను ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంతో ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభ వాయిదా పడింది. 

లోక్ సభ, రాజ్య సభ రెండింటిలోను పహల్గాం ఉగ్రదాడి, పహల్గాం టెర్రర్ ఎటాక్ విషయంలో చర్చకు విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ట్రంప్ మధ్యవర్తిత్వం వివాదంపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.గత నెల గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని, దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 

తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. అయితే, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపట్టాం. అంతర్జాతీయ ప్రొటోకాల్‌ ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోంది. ప్ర‌మాదంపై ఏఏఐబీ (ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్విస్టిగేష‌న్ బ్యూరో) పార‌ద‌ర్శ‌కంగా ద‌ర్యాప్తు జ‌రుపుతోందని పేర్కొన్నారు. 

కానీ, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక వచ్చింది. తుది నివేదికలో మరిన్ని వివరాలు తెలుస్తాయి. బ్లాక్‌బాక్స్‌ దెబ్బతిన్నా డేటాను రిట్రీవ్‌ చేశాం. బ్లాక్‌బాక్స్‌ను తొలిసారి డీకోడ్‌ చేయగలిగాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరకుండా చర్యలు తీసుకుంటున్నాం. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు చర్యలు చేపట్టాం" అని రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.