తెరాసకు ఓటేస్తే.. భాజపాకు ఓటేసినట్లే
posted on Oct 9, 2018 2:30PM
హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్.. మోదీ, కేసీఆర్ది ఫెవికాల్ బంధమని వ్యాఖ్యానించారు.భాజపా సహకారంతోనే కేసీఆర్ తొమ్మిది నెలల ముందే ఎన్నికలకు తెరదీశారని పొన్నం ఆరోపించారు.విభజన హామీలు అమలు కాకున్నా బీజేపీకి టీఆర్ఎస్ సహకరించిందని,తెరాసకు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనని ఆరోపించారు. కేసీఆర్కు ధైర్యం ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చినవారు కాకుండా తెరాస నేతలకు మాత్రమే 119 నియోజకవర్గాల్లో టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.భాజపా నేతలు కరీంనగర్లో సభ పెట్టి ప్రజలకు ఏం చెబుతారని పొన్నం ప్రశ్నించారు. ప్రజలకు నెరవేర్చని హామీల గురించి, తెరాసతో స్నేహం గురించి చెబుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు భాజపా ఏం చేసిందని ఆ పార్టీ నేతలు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు.భాజపా ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోయిందని పొన్నం ఆరోపించారు. ఈ నాలుగేన్నరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనమేంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.కేసీఆర్, మోదీ కలిసి కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో భాజపా తెలంగాణలో 119 స్థానాల్లో పోటీచేస్తే 100 చోట్ల డిపాజిట్ కూడా రాదని పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు.బీజేపీ అభ్యర్థుల లిస్ట్ కూడా కేసీఆర్ రెడీ చేసి అమిత్షాకు ఇచ్చారని విమర్శించారు.