ప్ర‌భాక‌ర్ రావు రాక‌తో ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వ‌చ్చేనా?

ఎట్ట‌కేల‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడి విచార‌ణ చేయ‌డానికి సిట్ కి దారులు బార్లా తెరుచుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ అంటే గ‌త 14 నెల‌లుగా అమెరికాలో ఉన్న ప్ర‌భాక‌ర్ రావు వ్య‌వ‌హారం, ఎన్నో మ‌లుపుల మీద మ‌లుపులు తిరిగి,  ఆయ‌న ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ వ‌చ్చే  వ‌ర‌కూ సాగింది. త‌న‌కు ముంద‌స్తు బెయిలు ఇస్తేనే హైద‌రాబాద్ వ‌స్తానంటూ ఆయ‌న హైకోర్టుకెక్కారు. హైకోర్టు స‌మ్మ‌తించ‌లేదు. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు.. అక్క‌డ ఊర‌ట ల‌భించింది. మేము చెప్పే వ‌ర‌కూ ఆయ‌న్ను అరెస్టు చేయ‌వ‌ద్దంటూ సుప్రీం కోర్టు  తీర్పునివ్వ‌డంతో.. ఆయ‌న హైద‌రాబాద్ రిట‌ర్న్ అయ్యారు. సీట్ ఆయనను గురువారం (జూన్ 5)న విచారించనుంది. 

అయితే గ‌తంలో ప్ర‌భాక‌ర్ రావు పాస్ పోర్టును  కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఆయ‌న పాస్ పోర్టును పున‌రుద్ద‌రించాల‌ని సుప్రీం ఆదేశించ‌డంతో ఆయ‌న అమెరిక‌న్ ఎంబ‌సీని క‌ల‌సి త‌న సింగిల్ విజిట్ పాస్ పోర్టును తీసుకుని హైద‌రాబాద్ వ‌స్తున్నారు. తానేమీ త‌ప్పు చేయ‌లేదు. అన్నీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లంటారు ప్ర‌భాక‌ర్ రావు. అలాంటి ప్ర‌భాక‌ర్ రావు గురువారం (జూన్ 5) జ‌రిగే విచార‌ణ‌లో నిజాలు చెబుతారా? ఇప్పటికే ఎస్ఐబీ చీఫ్ ప్ర‌ణీత్ రావు.. ఆయ‌న కింద ప‌ని చేసిన రాధాకిష‌న్ రావు, భుజం గ‌రావు, వేణుగోపాల రావు, భూప‌తి..  వీరంతా అరెస్ట‌య్యారు. క‌ న్ఫెష‌న్ లో..  నిజాలు ఒప్పుకున్నారు. త‌మ ఉన్న‌తాధికారి చెప్ప‌డం వ‌ల్ల మాత్ర‌మే తామిలా చేశామ‌ని అన్నారు. ఆ ఉన్న‌తాధికారి మ‌రెవ‌రో కాదు ప్ర‌భాక‌ర్ రావే. మ‌రి ప్ర‌భాక‌ర్ రావు ఈ నింద‌ను ఎవ‌రిపై కి నెడతారంటే..  మిగిలింది గ‌త పాల‌క వ‌ర్గం. అంటే బీఆర్ఎస్ అధినాయకుడైన కేసీఆర్. మ‌రి ప్ర‌భాక‌ర్ రావు..  కేసీఆర్ త‌దిత‌రుల పేర్లు బ‌య‌ట పెడ‌తారా? అన్న స‌స్పెన్స్ న‌డుస్తోంది.

ప్ర‌భాక‌ర్ రావు అనే ఈ వెల‌మ రిటైర్డ్ ఐపీఎస్  తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసింది నాటి బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో. ఆయ‌న కింద  సిరిసిల్ల డీఎస్పీగా ఉన్న ప్ర‌ణీత రావును ఎస్ఐబీ చీఫ్ గా నియ‌మించారు. ప్ర‌ణీత్ కింద రాధాకిష‌న్ వంటి అధికారులు గ్రౌండ్ లెవ‌ల్లో వ‌ర్క్  చేసేలా ఒక ఆర్డ‌ర్ సెట్ చేశారు. ప్ర‌భుత్వం మారాక ప్ర‌ణీత్ త‌న  ఆఫీసులో ఈ ఫోన్ ట్యాపింగ్ మెటీరియ‌ల్ మొత్తం ధ్వంసం చేసేయ‌త్నం చేయ‌డంతో మొద‌లైందీ కేసు. 2023 డిసెంబ‌ర్ 4 న ఆయ‌నీ ప‌నులు చేయ‌గా.. 2024 మార్చిలో పంజాగుట్ట‌లో కేసు న‌మో ద‌య్యింది. అలా ఈ కేసు బ‌య‌ట ప‌డింది.  

వీరంతా క‌ల‌సి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేయాల్సిందేంటంటే.. ఆనాటి ప్ర‌త్య‌ర్ది వ‌ర్గాల వారైన రాజ‌కీయ సినీ వ్యాపార  ప్ర‌ముఖులు మాట్లాడే మాట‌ల‌ను విన‌డం. ఆ స‌మాచారం ద్వారా వారి ఆర్ధిక మూలాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం. అలా రేవంత్ రెడ్డి ఇంటి ముందు 200 మీ. ప‌రిధిలో.. తిరుగుతూ ఆయ‌న మాట్లాడిన ప్ర‌తి  మాట‌నూ విన్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ ప‌రిక‌రాల‌ను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ పేరిట తెప్పించారు. బేసిగ్గా వీటిని.. తీవ్ర‌వాదుల‌ను అరిక‌ట్ట‌డానికి మాత్ర‌మే వాడుతారు భార‌త్ లో. అలాంటి ట్యాపింగ్ మిష‌న్ల‌ను మ‌రెక్క‌డా వాడ్డానికి వీల్లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రసాదించిన గోప్య‌త హ‌క్కును హ‌రిస్తుంది. ఈ హ‌క్కును కాల‌రాసే అధికారం ఎవ‌రికీ లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త్ లో ఎవ‌రి మీదా ఈ త‌ర‌హా కేసు పెట్ట‌లేదు. అయితే 1988లో క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి రామ‌కృష్ణ హెగ్డే ఈ ఆరోప‌ణ‌ల  కార‌ణంగా త‌న ప‌ద‌వి నుంచి దిగిపోవ‌ల్సి వ‌చ్చింది. 

ఇప్పుడీ కేసు లో ఏవ‌న్ గా ఉన్న ప్ర‌భాక‌ర్ రావు త‌న‌పై స్థాయిలో ఉన్న ఆనాటి సీఎం ప్ర‌భుత్వాధినేత కేసీఆర్ చెప్ప‌డం వ‌ల్లే ఇలా చేశాన‌ని చెబితే.. కేసు అటు ట‌ర్న్ తీసుకుంటుంది. దీంతో  ఇటు కాళేశ్వ‌రం దెబ్బ అటు  ఫోన్ ట్యాపింగ్ దెబ్బ ఒకే సారి గులాబీ బాస్ గూబగుయ్యిమ‌నిపించ‌డం ఖాయం.  మ‌రి ఆ దిశ‌గా ప్ర‌భాక‌ర్ రావు చెప్పే అవ‌కాశ‌ముందా? లేక త‌న ఐపీఎస్ బుర్రంతా వాడి త‌ప్పించుకుంటారా? ఈ ప‌ద‌నాలుగు నెల‌ల పాటు ఆయ‌న అమెరికాలో క్యాన్స‌ర్ చికిత్స చేయించుకునే నెపంతో వెళ్లి అక్క‌డ‌ ఏం ప్లాన్ చేసి ఉంటారు? అన్న‌ది తేలాల్సి ఉంది.