ఆర్సీబీ జెర్సీలో కర్నాటక డిప్యూటీ సీఎం.. ఎందుకంటే?

ఐపీఎల్ 2025 ముగింపు దశకు వచ్చింది. మంగళవారం (జూన్ 3)  సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ తో ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది. ఈ సారి ఫైనల్స్ లో ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచినా, అటు పంజాబ్ కింగ్స్ విజయం సాధించినా.. చరిత్రే. ఎందుకంటే.. ఇప్పటి వరకూ 17 సార్లు   జరిగిన ఐపీఎల్ లో ఈ రెండు జట్లూ విజేతగా నిలిచింది లేదు. అందుకే ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా తొలి సారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న జట్టుగా నిలుస్తుంది. 

అదంతా పక్కన పెడితే.. ఐపీఎల్ జట్లన్నిటిలోనూ అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న జట్లు బెంగళూరు మాత్రమే. అందులోనూ ఆ జట్టు కీలక ఆటగాడు కింగ్ కోహ్లీ జెర్సీ నంబర్ 18.. అలాగే ఇప్పుడు జరుగుతున్నది కూడా 18వ ఎడిషన్ కావడంతో ఈ సారి బెంగళూరు జట్టు ట్రోఫీ ముద్దాడటం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దేశంలోనే అత్యంత పెద్ద ఫ్యాన్ బేస్‌ ఉన్న ఆర్సీబీ ఐపీఎల్‌లో 18 సీజన్లలో ఏకంగా పది సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నప్పటికీ, టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది.  దీంతో ఫ్యాన్స్ ఈ సారి ఎలాగైనా ఆర్సీబీయే కప్ సాధిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఇందు కోసం పూజలు చేస్తున్నారు. 'ఈ సాల కప్ నమ్దే!' అంటూ ఉత్సాహంతో రెచ్చిపోతున్నారు.

ఆర్సీబీ ఫ్యాన్ బేస్ లో దిగ్గజ మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. లిటిల్ మాస్టర్, లెజండరీ సునీల్ గావస్కర్ ఈ సారి ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిస్తే.. దేశంలో ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని స్థాయిలో సంబరాలు అదే సెలిబ్రేషన్స్ చూస్తామని వ్యాఖ్యానించారు. మరో దిగ్గజ మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అయితే.. తాను పంజాబ్ కింగ్స్ కే సపోర్ట్ చేస్తానని ట్వీట్ చేశాడు. అలా ట్వీట్ చేసి ఊరుకోలేదు.. తాను మద్దతు పలికిన జట్టు గెలవదు అంటూ ముక్తాయించాడు. అంటే తాను ఎంత గట్టిగా ఆర్సీబీ విజయాన్ని కోరుకుంటున్నానన్నది సెహ్వాగ్ అలా వ్యక్తం చేశాడు.

ఇక పొలిటీషియన్స్ లో కూడా ఆర్సీబీకి బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అయితే ఏకంగా ఆర్సీబీ జెర్సీ ధరించి ఈ సాల కప్ నమ్దే అంటూ వీడియో రిలీజ్ చేశారు.  ఇది ఒక మ్యాచ్ మాత్రమే కాదు. మన క్షణం. మన కప్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆర్‌సీబీ..  కర్ణాటక ప్ర‌జ‌లందరూ మీకే మద్దతు ఇస్తూ మీ వెంటనే ఉన్నారంటూ డీకే శివకుమార్ పేర్కొన్నారు.  చూద్దాం మరి అశేష అభిమానుల కలను ఆర్సీబీ ఈ సారి నెరవేరుస్తుందేమో.