తల్లిదండ్రులు చేసే ఈ తప్పు పిల్లలను పిరికివాళ్లుగా, మొండివాళ్లుగా మారుస్తుంది.!

పిల్లలను పెంచడం పిల్లల ఆట కాదు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. దానికి తగినట్టే అన్నీ వారికి అందించాలని అనుకుంటారు. కానీ చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండా తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తారు. అవి పిల్లలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని పరిస్థితులలో పిల్లలను తిట్టడం వారి మెదడు,  మానసిక పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. పిల్లలను  ఎప్పుడు తిట్టకూడదో,  దీని వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుంటే..

పిల్లలు భయంలో ఉన్నప్పుడు..

తప్పు చేసిన తర్వాత పిల్లలు కొన్నిసార్లు భయపడతారు. ఇలా  భయపడితే లేదా ఇప్పటికే ఏదైనా విషయం గురించి ఒత్తిడిలో ఉంటే, ఈ సమయంలో పిల్లలను తిట్టడం సరైనది కాదు. అలాంటి పరిస్థితిలో, పిల్లల మనస్సు మరింత భయపడవచ్చు. దీని ఫలితంగా పిల్లలు తను చేసిన పనులను,  విషయాలను తల్లిదండ్రులతో  పంచుకోవడం మానేస్తాడు. అటువంటి పరిస్థితిలో పిల్లవాడు ఇప్పటికే సున్నితంగా ఉంటే అతన్ని తిట్టడానికి బదులుగా ప్రేమతో జరిగిన తప్పు గురించి   వివరించడం మంచిది.

కొత్తగా ఏదైనా చేసేటప్పుడు చేసే తప్పులు..

పిల్లలు ఏదైనా విషయం గురించి  ఆసక్తిగా ఉండి, ప్రతి క్షణం కొత్తగా ఏదైనా చేయాలని లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటే, అలాంటి పరిస్థితిలో, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టకూడదు. పిల్లలు నేర్చుకునేటప్పుడు తరచుగా తప్పులు చేస్తారు. ఈ తప్పులు వారు మంచిగా మారడానికి,  వారికి గొప్ప అనుభవాలుగా సహాయపడతాయి. అందువల్ల, ప్రతి చిన్న తప్పుకు వారిని తిట్టడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని కారణంగా పిల్లలు కొత్తగా ఏదైనా చేసే ముందు భయపడతారు.
 
పిల్లలు అలసిపోయినప్పుడు..

పిల్లలు బాగా అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, వారు ఏదైనా తినేటప్పుడు  పిల్లలను  తిట్టకూడదు. పెద్దల మాదిరిగానే పిల్లలు కూడా  అలసిపోయినా లేదా ఆకలిగా ఉన్నా వారి మానసిక స్థితి సరిగా ఉండదు. అలాంటి సమయంలో పిల్లలను తిడితే  ఇది పిల్లలకు మరింత  చిరాకు తెప్పిస్తుంది. ఆ సమయంలో పిల్లలను  తిట్టడం ప్రారంభిస్తే, విషయం మరింత దిగజారిపోతుంది.అందుకే పిల్లలను మందలించాలన్నా మొదట వారి పరిస్థితి  సాధారణ స్థితికి వచ్చాక ఆ తరువాత  తప్పు గురించి వివరించి చెప్పాలి.

                                        *రూపశ్రీ.