కొత్త పెట్టుబడులు రావు.. ఉన్నవి నిలవవు!
posted on Sep 26, 2023 1:45PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రుణచక్రబంధంలో ఇరుక్కుపోయిందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిబంధనలకు విరుద్ధంగా పరిమితులకు మించి అప్పులు ఎలా పొందగలుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పొరుగునే ఉన్న సంపన్న రాష్ట్రం తెలంగాణకు అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు ఎదరౌతుంటే.. ఏపీకి మాత్రం ఎలాంటి పరిమితులూ లేకుండా అప్పులు ఎలా దక్కుతున్నాయి? ఈ ప్రశ్నలు సహజంగానే అన్నివర్గాలలోనూ వ్యక్తం అవుతున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్నది మోడీ నాయకత్వంలోని ఇంకా చెప్పాలంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్. ఆ సర్కార్ రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో రాష్ట్రానికి ఒక్క తీరుగా వ్యవహరించడం వెనుక రహస్యం ఏమిటి అన్న ప్రశ్నకు ఇందులో రహస్యం ఏముంది అంటూ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ సర్కార్ మోడీని చాలెంజ్ చేస్తున్నది. ఆ సర్కార్ విధానాలను తప్పుపడుతున్నది. అదే సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ మోడీ అడుగులకు మడుగులొత్తుతోంది. మోడీ సర్కార్ విధానాలను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను మించి మరీ సమర్ధిస్తున్నది. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నది. ఈ కారణంగానే ఏపీ విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో మరోలా బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ సర్కార్ కేంద్రంలోని మోడీ సర్కార్ అండ చూసుకుని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నది. అడ్డగోలు పన్నులు, ఇష్టారీతిన అప్పులు, పాలన అంటే పంచడం, వెనకేసుకోవడం అన్న చందంగా జగన్ తీరు మారిపోయింది. సర్కార్ తీరును ప్రశ్నించినా, విధానాలను వ్యతిరేకించినా జైళ్లు నోళ్లు తెరిచే సీమలా ఏపీ మారిపోయింది.
కర్నాటకలో బీజేపీ సర్కార్ పరాజయానికి ఆ సర్కార్ కమిషన్ల సర్కార్ గా మారిపోయిందన్న ఆరోపణలను జనం నమ్మడం ఒక ముఖ్య కారణంగా చెబుతారు. అలాగే జగన్ సర్కార్ కూడా ఏపీ వైపు పారిశ్రామికవేత్తలు చూడాలంటేనే భయపడేలా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తతున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు అరెస్టు కారణంగా ఏపీ సర్కార్ అంటేనే ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులు పారిపోయే పరిస్థితి ఏర్పడిదనడంలో సందేహం లేదు. అయితే అంతకంటే ముందు నుంచీ కూడా జగన్ సర్కార్ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రంలోకి పెట్టుబడులు, పరిశ్రమల సంగతి అటుంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోతున్న పరిస్థితి. ఇక కొత్తగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. అయినా కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 నుంచి 2022 వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 5751 కోట్లు .. అంటే, దేశం మొత్తం పెట్టుబడులలో 0.4 శాతం. ఇంత తక్కువగా పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదని అంటున్నారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా.. గత మార్చిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఘనంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించింది. ఆ విషయం జగన్ కు కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వంలోని వారికి కానీ గుర్తుందో లేదో కానీ... అదే గ్లోబల్ ఇన్ వెస్టర్ల సదస్సు వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తున్నదని గొప్పగా ప్రకటించారు.
అలాగే ఉద్యోగాలు కూడా కుప్పతెప్పలుగా వస్తాయని సీఎం జగన్ అప్పట్లో సెలవిచ్చారు. ఇక ఆ గ్లోబల్ సమ్మిట్ లో 20 రంగాలకు సంబంధించి 340 ఎంవోయూ(అవగాహన ఒప్పందాలు)లు కుదుర్చుకున్నామని, వాటి ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు, ఓ ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, తమ ట్రేడ్ మార్క్ అయిన షిక్కటి చిరునవ్వుతో సెలవిచ్చారు. సరే అవి వచ్చాయా? వస్తే వాటి వివరాలేంటి? అన్న ప్రశ్నకు మాత్రం బదులుండదు. పైపెచ్చు ఆ ప్రశ్న అడిగితే అదేదో మహాపాపమన్నట్లు మాట్లాడే పరిస్థితి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ కేసులు, ఆరెస్టులతో చెలరేగుతున్నారు. అయితే వాస్తవమేమిటంటే.. విశాఖ సమ్మిట్ తర్వత కాదు, జగన్ రెడ్డి నాలుగేళ్ళ పై చిలుకు పాలనలో రాష్టానికి కొత్తగా వచ్చిన పెట్టుబడుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని పరిశీలకులు అంటున్నారు. జగన్ రెడ్డి పాలనలో పెట్టుబడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అధోగతికి చేరింది. అట్టడుగు నుంచి ప్రథమ స్థాయిలో ఉంది.
అయితే ఈ మాటలు ఎవరో జగన్ రెడ్డి వ్యతిరేకులో, విపక్షాలో చెబుతున్నవి కాదు.. జగన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న కేంద్రం వెల్లడించిన వివరాలు. సరే జగన్ రెడ్డి పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యారని సరిపెట్టుకుందాం? కానీ గత ప్రభుత్వ అంటే చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు పలువురు జగన్ రెడ్డి అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయారు. నిజానికి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోనికి పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు వెల్లువలా తరలి వచ్చారు. విభజిత ఏపీలో చంద్రబాబు హయంలో అంటే 2014 నుంచి 2019 వరకూ ఆరులక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. జగన్ పాలనలో వచ్చిన ఇన్వెస్ట్ మెంట్లు కేవలం 5751 కోట్ల రూపాయలు మాత్రమే.
రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు నాయుడు హయాంలో ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురంకు వచ్చింది. చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి, విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. జగన్ రెడ్డి పాలనలో సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పాటుగా ఇప్పుడున్న పరిస్థితిలో అంటే జగన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏపీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని కుండబద్దలు కొట్టేసింది.
చిత్తూరు జిల్లాకు చెందిన అమర రాజా కంపెనీ జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించేసింది. ఇలా చెప్పాలంటే చాలా చాలా ఉంది అదే ఒక్క మాటలో ముగించాలంటే ... జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు రావు ..ఉన్న పెట్టుబడులు నిలవవు అని చెప్పాలి. పెట్టుబడులు రానిదే రాష్ట్రం ముందుకు సాగదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు ... అప్పులు మాత్రమే మిగులుతాయి.. వాటిని అంటే అప్పులను ఎలా పెంచాలో, ఎలా రాబట్టాలో జగన్ రెడ్డికి బాగా తెలుసు. మరి రాష్ట్ర భవిష్యత్ మాటేమిటి అంటారా? ప్రజలే నిర్ణయించుకోవాలి. ఓటు ఆయుధం ఉన్నది వారి చేతుల్లోనే మరి.