ఏపీలో మినీ ఎమర్జెన్సీ ?

ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరుగుతోంది ? తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్  వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటి? ఎన్నికలకు ఇక ఏడెనిమిది నెలలు మాత్రమే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ‘నిప్పు’తో చెలగాట మాడే భయంకర నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అందుకు ఆయనలో ప్రవహించే ఫ్యాక్యనిస్ట్  బ్లడ్ మాత్రమే కారణమా? కేవలం కక్ష సాధింపు లక్ష్యంతోనే జగన్ రెడ్డి ఈ వినాశకర నిర్ణయం తీసుకున్నారా? అంటే,  అందులో కొంత నిజం ఉన్నప్పటికీ అదే పూర్తి సత్యం కాదంటున్నారు. 

ఒక్క మాటలో చెప్పాలంటే, 1975 జూన్ 26 ఉదయం సూర్యోదయం వేళ,  తనను అరెస్ట్ చేసేందుకు తలుపు తట్టిన, పోలీసులతో  జేపీ (సర్వోదయ ఉద్యమ నేత) అన్న మూడే మూడు ముక్కల మాట ... గుర్తుకు తెచ్చుకుంటే చంద్రాబాబును జగన్ రెడ్డి ఎందుకు, అరెస్ట్ చేశారు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆరోజు జేపీ... అన్నఆ మూడు ముక్కలూ  ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న మాటలు. ఇంచుమించుగా 48 ఏళ్ల  క్రితం.. అలహాబాద్ హై కోర్ట్  తన ఎన్నికల చెల్లదని తీర్పు ఇచ్చిన నేపధ్యంలో  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ  1977 జూన్  25 అర్థరాత్రి దేశంలో    ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించారు. జూన్ 26 తెల్లవారే సరికి  ఇందిరమ్మ పోలీసులు అప్పటికే ఇందిరా గాంధీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, సంపూర్ణ క్రాంతి ఉద్యమం పేరిట దేశవ్యాప్త ఆందోళనకు  పిలుపు ఇచ్చిన సోషలిస్ట్ నేత  జయప్రకాశ్ నారాయణ సహా వందల సఖ్యలో  ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. 

అలాగే  ఇప్పడు వైసీపీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా  తెలుగు దేశం, జనసేన పార్టీలు సాగిస్తున్న పోరాటం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి  ఓటమి భయంతో, రాష్ట్రంలో అప్రకటిత  మినీ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే, జగన్ రెడ్డి పోలీసులు   2023 సెప్టెంబర్ 9వ తేదీ, ఉదయం 6 గంటలకు నద్యాలలో చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్ట్  చేశారు. ఇందిరమ్మ పోలీసులు చేసిన జేపీ, అరెస్ట్’,జగన్ రెడ్డి పోలీసులు చేసిన చంద్రబాబు అరెస్ట్ కు మధ్య కొన్ని సిమిలారిటీస్  ఉన్నాయి. అప్పుడు ఇందిరమ్మ పోలీసులు తెల్లవారుజామునే వచ్చి తపులులు తట్టారు, ఇప్పడు జగన్ రెడ్డి పోలీసులుఇంచుమించుగా అదే చేశారు. అయితే అర్ధరాత్రి చంద్రబాబు బస చేసిన బస్సు తలుపు తట్టారు.  అప్పుడు ఇందిరమ్మ పోలీసులు జేపీని ఎందుకు,ఏ నేరానికి, ఏ చట్టం, ఏ సెక్షన్  పరిధిలో  అరెస్ట్ చేశారో చెప్పలేదు.

ఇప్పడు జగన్ రెడ్డి పోలీసులూ అంతే  నేరం ఏమిటో, విచారణ ఏమిటో  చెప్పకుండానే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును, బస్సులోంచి దించి  ఎలాంటి కారణాలు చూపకుండానే అరెస్ట్ చేశారు. అలా అరెస్టు చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో జరిగినట్లు చెపుతున్న అవకతవకలు,అవినీతికి చంద్రబాబుకు సంబంధం ఏమిటో చెప్ప కుండానే, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగ , విచారణ పేరుతొ వేధింపులకు గురి చేస్తోంది. అందుకే  చంద్రబాబు అరెస్ట్ విషయంలో  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు  ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నిజానికి అక్రమ అరెస్ట్ విషయంలోనే కాదు, అరెస్ట్ తరువాత తెలుగు దేశం నేతలు, కార్యకర్తలను ఎక్కడి కక్కడ అరెస్టులు చేయడం, నిరసన తెలిపేందుకు లేకుండా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం.  అదే విధంగా  చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయడం,  దీక్షలను భగ్నం చేయడం చూస్తుంటే, ఏపీలో మినీ ఎమర్జెన్సీ అమలులో వుందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.