వైఎస్ వివేకా హత్యతో నాకు సంబంధం లేదు
posted on Mar 18, 2019 1:35PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని పరమేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న పరమేశ్వరరెడ్డి.. వివేకా హత్య జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఇటీవల ఓ వివాదంలో పరమేశ్వర్తో వివేకా గొడవపడ్డారని, ఈ హత్యకు పది రోజుల ముందు త్వరలో ఓ సంచలనం చూస్తారంటూ పరమేశ్వర్ కొందరి వద్ద మాట్లాడారని, వివేకా హత్య తర్వాత పరమేశ్వర్రెడ్డి కుటుంబంతో సహా పరారయ్యారని వార్తలొచ్చాయి. అయితే తనకు ఆరోగ్యం బాగాలేనందున తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని పరమేశ్వరరెడ్డి మీడియాకు తెలిపారు. వివేకానందరెడ్డి కుటుంబంతో తనకు 20 ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని అన్నారు. తాను ప్రాణాలిచ్చేవాడినేగానీ, ప్రాణాలు తీసేవాడిని కాదని పరమేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు పరమేశ్వరరెడ్డి తిరుపతిలో ఉన్నారని తెలిసి.. సిట్ బృందం అతన్ని విచారించడానికి అక్కడికి వెళ్లినట్లు సమాచారం.