మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశం
posted on Aug 2, 2025 8:30PM
.webp)
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వేసిన పరువునష్టం దావా కేసులో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది.
ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు భావించింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఈ నెల 21 లోపు నిందితురాలికి నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. కొండా సరేఖ తరుపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది.