మోడీ వచ్చిన తరువాత మత గొడవలు.. అమెరికా
posted on May 3, 2016 11:39AM

యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం (యూఎస్సీఐఆర్ఎఫ్) అనే సంస్ధ మన దేశంలోని మతపరమైన సంఘర్షణలపై నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై కూడా పరోక్షంగా విమర్శలు చేసినట్టుగానే కనిపిస్తోంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్పీకరించిన తరువాతే ఇండియాలో మత స్వాతంత్ర్యం ప్రమాదకరంగా మారిందని, కొన్ని మతాల వారు స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ, ఇతర మతాలపై దాడులు జరుపుతున్నారని, ప్రజల్లో అసహనం పెరిగిందని తన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న వారిని నిలువరించడంలో పోలీసులు సైతం మిన్నకుంటున్నారని పేర్కొంది. తదుపరి భారత్ తో జరిపే చర్చల్లో మతపరమైన అంశాన్నీ జోడించాలని.. ఇండియాలో పరిస్థితి మారేందుకు అమెరికా ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేయాలని కోరింది. కాగా త్వరలో నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న వేళ, ఆ దేశం ఈ తరహాలో ఆరోపణలు చేయడం గమనార్హం.