తెలంగాణలో మోడీ, బాబు, పవన్
posted on Apr 22, 2014 11:12AM
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, మరో ప్రధాన ఆకర్షణగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ముగ్గురు నేతలు ఒకవేదికపై నుంచి ప్రసగించనున్నారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణలో మోడీ ఈరోజు నాలుగు బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగా తొలి సభ మధ్యాహ్నం 1-45కు నిజామాబాద్లో, 3-15కు కరీనంగర్లో, సాయంత్రం 5 గంటలకు మహబూబ్నగర్లో, 6-15కు హైదరాబాద్లో జరుగనున్నాయి.
మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మోదీ, బాబు, పవన్ ఈ ముగ్గురు నేతలు ప్రసంగిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే ఎన్డీఏ సభకు బీజేపీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదికతో పాటు పక్కన కళాకారుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కిషన్రెడ్డితోపాటు లోక్సభ స్థానాలకు పోటీ చేసే బీజేపీ, టీడీపీ అభ్యర్థులు ఉంటారు. మరో వేదికపై ఎమ్మెల్యే అభ్యర్థులను కూర్చోబెట్టే అవకాశముంది. సభా వేదికపై దృశ్యాలను వీక్షించేందుకు 10 భారీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. మోదీ సభ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.