మోడీ ఐదు దేశాల యాత్ర.. పదేళ్ల తర్వాత లాంగ్ టూర్
posted on Jul 2, 2025 1:12PM

5 దేశాలు, 8 రోజులు.. ఒక మోడీ లాంగ్ ట్రిప్. జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు మోడీ. తర్వాత 3, 4 తేదీల్లో ట్రినిడాబ్ టుబాగో, 4, 5 తేదీల్లో అర్జెంటీనా పర్యటన తర్వాత.. 5 నుంచి 8వ తేదీ వరకూ బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ 17వ సమావేశాలకు హాజరవుతారు. ఇక 9న నమీబియా దేశ పర్యటన. అక్కడ భారతీయులకున్న వజ్రాల వ్యాపారం కేంద్రంగా ఒప్పందాలు. ఆపై యురేనియం సరఫరా మీద కూడా చర్చలు.
ఒకే సారి 5 దేశాలకు వెళ్లడం ఇది రెండో సారి. గతంలో అంటే 2016లో ఇలాగే.. మోడీ అమెరిక, మెక్సికో.. వంటి ఐదు దేశాలను పర్యటించారు. అలాగని ఇదే అతి పెద్ద టూర్ కాదు. 2015లో ఏకంగా ఆరు దేశాలను పర్యటించారు మోడీ.
ప్రస్తుత దేశాల పర్యటనలో ప్రధానమైనది గ్లోబ్ సౌత్ గురించి బ్రిక్స్ లో మాట్లాడ్డమే కాదు.. ఆయా దేశాలకు రక్షణాత్మక భరోసానిచ్చి.. తగిన నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ సంకేతాలనివ్వనున్నారు మోడీ.
ఇక ఘనా, ట్రినిడాబ్- టుబాగో, నమీబియా దేశాల పర్యటన.. ఎంతో కీలకంగా మారనుంది. గత మూడు దశకాలుగా ఈ దేశాల్లో ఒక భారత ప్రధాని వెళ్లడం.. ఆయా పార్లమెంట్లలో ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ దేశాలకు ఇటు విద్యా- వైద్యం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి పుచ్చుకోవడం.. చౌకగా వీరికి మన ఆయుధ సంపత్తిని అమ్మడం. తద్వారా వీరికంటూ ఒక రక్షణాత్మక సాయం చేయడం వంటి చర్యల ద్వారా మోడీ ఈ దేశాలతో సత్సంబంధాలు నెరపనున్నారు. తద్వారా గ్లోబల్ లీడర్షిప్ లో ఈ ఫ్రెండ్షిప్ కీలకంగా మారనుంది.
దానికి తోడు ట్రినిడాడ్ టుబాగో దేశాల విషయానికి వస్తే ఇక్కడ 2011 లెక్కల ప్రకారం రెండున్నర లక్షల మంది హిందువులున్నారు. అంతే కాదు ఇక్కడ మన హైందవ సంప్రదాయానికి సంబంధించిన ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. దీంతో ఇండియా డయాస్పోరాకు ఈ పర్యటన మరింత ఊతమిచ్చినట్టు అవుతుంది.
ఇక నమీబియా ఎంత ప్రత్యేకమంటే ఇక్కడ ఏకంగా మన వజ్రాల ప్రాసెసింగ్ యూనిట్లు 800 మిలియన్ డాలర్ల విలువైనవి ఉన్నాయి. భారత కరెన్సీలో చెబితే ఈ మొత్తం ఏకంగా 70 వేల కోట్ల వరకూ ఉంటుంది. ఇక నమీబియాలో యురేనియం నిల్వలు పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఈ సరఫరా విషయంలోనూ కొన్ని ఒప్పందాలు చేసుకోనున్నారు మోడీ.
ఇలా ఐదు దేశాలలో మోడీ చేయనున్న ఈ లాంగ్ టూర్ ద్వారా ఏక కాలంలో రెండు ఖండాలు చుట్టిరావడం మాత్రమే కాదు.. ఎన్నో ఒప్పందాలను సైతం చేసుకుని.. గ్లోబల్ లీడర్షిప్ లో భారత్ ను ముందు వరసలో నిలపనున్నారు. వచ్చే సారి జరిగే బ్రిక్స్ సమావేశాలకు భారతే అధ్యక్షత వహించనుండటంతో ఈ ట్రిప్ ఎంతో కీలకం కానుంది.