సొంత ఇంట్లో అడుగుపెట్టలేకపోతున్న తాడిపత్రి పెద్దారెడ్డి
posted on Jul 2, 2025 12:51PM
.webp)
అధికారం శాశ్వతమన్నట్లు వ్యహరించిన అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరు ఇప్పుడాయపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది . అప్పట్లో అలా చెలరేగడమే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఒక పొలిటికల్ లీడర్కు లేని ఆంక్షలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆఖరికి తాడిపత్రిలో సొంత ఇంటికి వెళ్లేందుకు కూడా ఆ మాజీ ఎమ్మెల్యేకు అనుమతి లభించడం లేదు. హైకోర్టు ఆయనకు తాడిపత్రి వెళ్లడానికి అనుమతించినా.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఎప్పటికప్పుడు ఆయన తాడిపత్రి ఎంట్రీకి బ్రేకులు వేస్తున్నారు.
అటు జేసీ ప్రభాకర్రెడ్డి..ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరికీ ఆరుపదులు వయసు దాటింది.ఇంకా చెప్పాలంటే ఇద్దరికీ మనవళ్ళు, మనవరాళ్లు ఉన్నారు. వయస్సు పైబడుతున్నా ఆ ఇద్దరూ మాత్రం సినీ స్టైల్లో తొడలు కొడుతునే ఉన్నారు. తాడిపత్రిలో రాజకీయ ఆధిపత్యం కోసం ఇరువురూ నువ్వానేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన హవా నడిపించారు.
ఏకంగా జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటికి వెళ్లిన పెద్దారెడ్డి ఆయన ఇంట్లో కూర్చుని సవాల్ విసిరారు. ఆ విషయం అప్పట్లో సంచలనం రేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా జేసీ ప్రభాకర్రెడ్డిని తాడిపత్రి రాకుండా అనేక సార్లు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పొజిషన్స్ చేంజ్ అయ్యాయి. కేతిరెడ్డి అపోజిషన్లోకి వచ్చారు. తన కుమారుడ్ని తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న జేసీ పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు.
ఎన్నికల రిజల్ట్ రాకమునుపే అక్కడ ఆధిపత్య రాజకీయం మొదలైపోయింది. ఇప్పుడు జేసీ ప్రభాకర్రెడ్డి అధికార పక్షంలో ఉన్నారు. దీంతో రిజల్స్ట్ వచ్చిన మరుక్షణం నుంచే తాడిపత్రి పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. అప్పట్లో జరిగిన ఘర్షణ పెద్ద దుమారం లేపింది. ఆ గొడవలతో జేసీ, కేతిరెడ్డిలను తాడిపత్రికి రావడానికి వీళ్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. జేసీ ప్రభాకర్రెడ్డి కోర్టుకెళ్లి అనుమతులు తెచ్చుకుని తాడిపత్రి లో ఉంటున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం కోర్టు నుంచి ఆంక్షలతో కూడిన అనుమతులు తెచ్చుకున్నారు.
కోర్టు అనుమతి ఇచ్చినా సరే .. కేతిరెడ్డి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు జేసీ ప్రభాకర్రెడ్డి. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అనుమతించాలంటూ ఇప్పటికే రెండు మూడుసార్లు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి ప్రయత్నించినా.. జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులు కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ అనుమతివ్వలేదు. ఒకసారి ఎంపీపీ ఎన్నికలు, మరోసారి మహానాడు, ఇంకోసారి ప్రైమ్ మినిస్టర్ విశాఖపట్నం బందోబస్తు కార్యక్రమాలు అంటూ జిల్లా ఎస్పీ ఆయనకు అనుమతి నిరాకరించారు. పెద్దారెడ్డి జిల్లా ఎస్పీపై కంటెంట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో తాడిపత్రిలోని పెద్దారెడ్డి నివాసంతో పాటు మరో 14 ఇళ్ళకు సంబంధించి అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు కొలతలు వేయడం ప్రారంభించారు. కొలతలు వేసిన మరుసటి రోజు తెల్లవారుజామునే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల కళ్ళు గప్పి ఎలాగోలా తాడిపత్రిలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున గుమిగూడి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు .
దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ శాంతి భద్రతల సమస్య తలత్తెక మునుపే కేతిరెడ్డిని అనంతపురం తరలించారు. ఆ క్రమంలో అక్కడ హైడ్రామా నడిచింది. కేతిరెడ్డి ఇంట్లో ఉండగా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తరలించారు. ఆ సందర్భంగా పోలీసులు కేతిరెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘింస్తున్నారని హెచ్చరించారు. ఆయన హైకోర్ట్ ఆదేశాలను ఉల్లంఘించారని , బెయిల్ రద్దు చేయాలని కోర్టుకి వెళ్ళే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆ తరువాతి రోజు జిల్లా వైసీపీ నేతలు ఎస్పీని కలసి తాడిపత్రి కి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పట్లో కేతిరెడ్డి అనవసర దూకుడే ఇప్పుడు ఇన్ని చిక్కులు తెచ్చిపెడుతుందని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మరి కేతిరెడ్డి తాడిపత్రిలో ఎప్పటికి అడుగు పెట్టగలుగుతారో.. స్వేచ్ఛగా తిరగగలుగుతారో?