ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత
posted on May 23, 2020 4:34PM
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్(57) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. 1963 మే 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు హరికిషన్ జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు మిమిక్రీ అంటే ఆసక్తి. స్కూల్ టైం నుంచే గొంతులను అనుకరిస్తూ ఉండేవారు. దివంగత మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో మిమిక్రీ రంగంలోకి వచ్చిన హరికిషన్..1971లో విజయవాడలో తొలి మిమిక్రీ ప్రదర్శన చేశారు. ఆ తరువాత దేశ విదేశాల్లో 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. అనేక చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించి నటుడిగానూ అలరించారు. 12 ఏళ్ల పాటు టీచర్గా పనిచేసిన హరికిషన్.. హైదరాబాద్లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్గానూ పనిచేశారు.