ముగ్గురు పిల్లల్ని చంపిన తండ్రి

 

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలను కరెంట్ షాక్‌తో చంపేశాడు. భార్య మీద కోపంతోనే అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. నల్గొండ జిల్లా వలిగొండ మండలం వెలువర్తిలో ఈ ఘోరం జరిగింది. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంగా ఈ దారుణ సంఘటన జరిగింది. తన ముగ్గురు పిల్లల్ని చంపిన వ్యక్తి పేరు రమేష్. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యతో గొడవ జరగడంతో ఆమె రమేష్‌ని విడిచి పుట్టింటికి వెళ్ళిపోయింది. రమేష్ మరో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. రెండో భార్య కూడా రమేష్‌తో సరిపడక పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రమేష్ నిద్రిస్తున్న తన ముగ్గురు పిల్లల నిరోషా (8), రక్షిత (6) యశ్వంత్ (5)కి కరెంట్ షాక్ ఇచ్చాడు. దాంతో ఆ పిల్లలు గిలగిలలాడుతూ మరణించారు. వారిని చంపేసిన అనంతరం రమేష్ పరారయ్యాడు. అయితే పిల్లల మరణవార్త తెలిసినప్పటికీ ఆ తల్లి పిల్లల దగ్గరకి రాలేదు. దాంతో పిల్లలు అనాథశవాల్లాగా ఆస్పత్రిలో పడి వున్నారు. వీరికోసం బంధువులు కూడా ఇంతవరకు ఎవరూ రాలేదు. రమేష్ భార్య ఆస్తికోసమే ఈ దారుణానికి ఒడిగట్టి వుంటాడని స్థానికులు భావిస్తున్నారు.