ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ ఛైర్మన్
posted on Aug 3, 2025 5:20PM

తిరుమల శ్రీవారి దర్శన విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగంపై మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. తిరుమల దర్శన విషయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఉచితంగా గూగుల్, టీసీఎస్లతో పాటు ఇతర సంస్థల సహకారంతో ఆధునాతన ఏఐ టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. భక్తులకు 2 గంటలలోపు భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి ముందుకు వెళ్తున్న సమయంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.
గంటలు, రోజులు తరబడి షెడ్ల, కంపార్డ్మెంట్లలో భక్తులు పడిగాపులు కాయడం మంచిదా ఉచితంగా చేస్తున్నా అలా అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. భక్తుల్లో గందరగోళం సృష్టించేలా తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ప్రపంచం మొత్తం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్న తరుణంలో తిరుమల్లో కూడా వాడటంలో ఎలాంటి తప్పులేదు.’’ అని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.