హరీష్ రావు నివాసానికి కేటీఆర్.. తెరవెనుక కథేంటి?

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్నదే. అసలు పార్టీ కర్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు ఏం చర్చించారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. పార్టీలో కీలక నాయకులూ, అందునా దగ్గరి బంధువులు అయిన వారిరువురూ భేటీ కావడం వాస్తవానికి పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు తెలంగాణలో వారిరువురి భేటీయే అత్యంత ప్రధాన వార్తగా మారిపోయింది. మిగిలిన విషయాలన్నీ మరుగున పడిపోయి.. ఇప్పుడు చర్చంతా వారిద్దరి రెండు గంటల భేటీపైనే కేంద్రీకృతమై ఉంది. 

ఇందుకు కారణం లేకపోలేదు. కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించకపోవడం, త్వరలో పార్టీ పగ్గాలు తన తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అప్పగించనున్నారన ప్రచారం నేపథ్యంలో హరీష్ రావు ఒకింత అసంతృప్తిగా ఉన్నారని పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తోంది. అదీ కాకుండా ఒక ప్రణాళిక మేరకు పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. 

ఇటీవల బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ సందర్భంగా వరంగల్ లో జరిగిన  భారీ సభ సందర్భంగా హరీష్ రావుకు ఇసుమంతైనా ప్రాధాన్యత లభించకపోవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఉంది. అదే సమయంలో హరీష్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేయనున్నారనీ, టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న ప్రచారం మొదలైంది. ఇదంతా అవాస్తవ ప్రచారం అంటూ హరీష్ రావు ఇచ్చిన వివరణ కూడా ఆ ప్రచారం మరింత జోరందుకోవడానికి దోహదపడిందే తప్ప మరో ప్రయోజనం సిద్ధించలేదు. హరీష్ రావు కారు దిగి, వేరే పార్టీలో చేరబోతున్నారని గతంలో కూడా వార్తలొచ్చాయి. అయితే అప్పట్లో వాటిని పార్టీయే కాదు.. ప్రజలు కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అందుకు కారణం కేసీఆర్. కేసీఆర్ ను కాదని హరీష్ రావు పక్క చూపులు చూస్తారంటే ఎవరూ నమ్మలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కేసీఆర్  పోలిటికల్ గా యాక్టివ్ గా లేరు. పార్టీ వర్గాలే ఆయన ఇక పార్టీ పగ్గాలను తన రాజకీయవారసుడికి అప్పగించేసి విశ్రాంతి తీసుకునే యోచనలో ఉన్నారంటున్నారు.

సరిగ్గా అలాంటి సమయంలో  జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల పోస్టర్లలో హరీష్ ఫొటోనే కనిపించలేదు. దీంతో కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం ఖారరైపోయిందన్న భావనే సర్వత్రా వ్యక్తం అయ్యింది. 
ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా  వెలుగొందని హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించి, ఆయన స్థాయికి తగ్గ గౌరవం కూడా ఇవ్వడం లేదన్న భావన పార్టీ కార్యకర్తలలో వ్యక్తం అయ్యింది. అలాగే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అంగీకరించని పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏకంగా ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించేస్తుంటే మౌనంగా ఉంటారా అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. అదే సమయంలో కేసీఆర్ తనయ, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మాటేంటంటూ గొంతెత్తడం మొదలెట్టారు. పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడటంతో పార్టీలో లుకలుకలు ఉన్నాయనీ, అవి కూడా కేసీఆర్ కుటుంబం నుంచే మొదలయ్యాయన్న భావన అందరిలో వ్యక్తం అయ్యింది. 

ఈ తరుణంలో కేటీఆర్ స్వయంగా హరీష్ రావు నివాసానికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు ఆయనతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అ భేటీలో  ఏం మాట్లాడుకున్నారన్న విషయాన్ని అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ వెల్లడించలేదు. అయినా భేటీ చుట్టూ ఊహాగాన సభలు మాత్రం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి. 

అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇటీవల అనారోగ్యానికి గురైన హరీష్ రావు తండ్రిని పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లారని చెబుతున్నప్పటికీ.. హరీష్ రావు, కేటీఆర్ ల భేటీపై రాజకీయ చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకు కారణం మళ్లీ పార్టీలో ఇటీవలి కాలంలో హరీష్ రావుకు తగ్గుతున్న ప్రాధాన్యతే అనడంలో సందేహం లేదు. 

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో హరీష్ కు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోవడం, పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా ఎక్కడా హరీష్ రావు పేరు వినిపించకపోవడం, ఫొటో కనిపించకపోవడంపై కేటీఆర్ హరీష్ కు ఎక్స్ ప్లనేషన్ ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారనీ, విభేదాలను పక్కన పెట్టి కలిసి పని చేయాలన్న ప్రతిపాదన చేశారనీ అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురి మధ్యా విభేదాల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిన తరువాతే పార్టీ పగ్గాల అప్పగింత ఉంటుందన్న కేసీఆర్ విస్పష్టంగా చెప్పి కే టీఆర్ ను హరీష్ నివాసానికి పంపారని కూడా అంటున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత కేసీఆర్ ఈ ముగ్గురితోనూ భేటీ  అయ్యే అవకాశాలు ఉన్నాయి.  మొత్తం మీద పార్టీలో లుకలుకలు, చీలిక వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారని చెబుతున్నారు.