మేడిగడ్డలో కాంగ్రెస్ నేతలే బాంబులు పెట్టారు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

 

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. మేడిగడ్డ పగుళ్లకు బహుశా కాంగ్రెస్ నాయకులు బాంబులు పెట్టారని అనుమానం వస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం సుప్రీంకోర్టుకు అర్ధమైంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి అర్థం కావట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని ఆయన అన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నోటీసులు. కాంగ్రెస్ పార్టీ కమిషన్లు బయటపడుతున్నాయని తెలిశాకే.. ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యాఖ్యానించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 

జస్టిస్ గోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందన్నారు. అయితే కమిషన్‌ గడువు మళ్లీ ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలి. కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్టు సమాచారం లేదు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాంమని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గ్లామర్ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి ప్రమాదకరమైన మానసిక స్థితి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. 

అందుకే ఒకే అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్నారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 580 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వర్షాలకు వరి ధాన్యం కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇలాంటి సమయంలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి, రేవంత్ రెడ్డి నాలుగుసార్లు మిస్ వరల్డ్ కార్యక్రమాలకు హాజరయ్యారు. తెలంగాణకు ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా?" అని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతూనే, అందాల పోటీల కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. "సీపీఐ నేత నారాయణ చెప్పినట్లుగా, మంత్రులు అందాల రాణులకు టూర్ గైడ్‌లుగా మారారు. ఇది పాలనా లేక ఫ్యాషన్ షోనా?" అని కేటీఆర్ నిలదీశారు.