రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు మృతి

మాజీ ఐఏఎస్ అధికారి గోపిశెట్టి నాగేశ్వరరావు (జీఎన్ రావు) బుధవారం (మే 21) కన్నుమూశారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. హైదరాబాద్ కుందన్ బాగ్ లోని తన స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించారు.  రిటైర్ అయిన తరువాత ఈయన ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆరంభించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల కమిటీని జగన్ 2020లో ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి జీఎన్ రావును చైర్మన్ గా నియమించారు.

జీఎన్ రావు నేతృత్వంలోని మూడు రాజధానుల కమిటీ   మూడు రాజధానులే రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని  నివేదిక సమర్పించింది. అలా నివేదిక సమర్పించి ఊరుకోకుండా.. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్ ని విశాఖలో ఏర్పాటు చేయాలేని కూడా జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. అలాగే రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా నియమించాలనీ జీఎన్ రావు కమిటీ సిఫారసు చేసింది. ఈ నివేదికపై అప్పట్లో  చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావుపై తీవ్ర విమర్శలు సైతం చేశారు.  

1988 బ్యాచ్ కు చెందిన జీఎన్ రావు ఉద్యోగ ప్రస్థానం గుంటూరు కలెక్టరుగా ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పలు కీలక పోస్టులలో పని చేశారు.  పదవీ విరమణ చేసిన తరువాత  అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆయన్ని శిల్పరామం స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు.  జీఎస్ రావు అంత్యక్రియలు శుక్రవారం  (మే 23) జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరుగుతాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu