బాబు పార్టీపై శ్రద్ద పెట్టలేదు.. జూ.ఎన్టీఆర్ మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం: జేసీ

 

జగన్ పాలన ఎలా ఉంటుందో  చూడాలనే ఆసక్తి కారణంగానే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందని అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జగన్ పాలనపై ఇప్పుడే విమర్శలు చేయకూడదని తాను చంద్రబాబుకు సూచించినట్టుగా జేసీ చెప్పారు. రాష్ట్రంలో పాలన మారాలని ప్రజలు కోరుకొన్నారని.. చంద్రబాబుపై వ్యతిరేకత లేదన్నారు. కానీ, అదే సమయంలో ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని జేసీ అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను తాను బాబు దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడ తమను వైసీపీ, బీజేపీలో చేరాలని కూడ ఆహ్వానాలు అందినట్టుగా జేసీ చెప్పారు. రాష్ట్రంలో ఆయా పార్టీలను బలోపేతం చేసేందుకు నాయకత్వాలు పనిచేస్తున్నాయని ఈ క్రమంలోనే తమను ఆయా పార్టీలు సంప్రదించినట్టుగా జేసీ చెప్పారు. అయితే తాను ఇంకా టీడీపీలోనే ఉన్నానని పార్టీ మార్పుపై ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు. 

చంద్రబాబు పరిపాలనపై పెట్టిన శ్రద్ద పార్టీపై పెట్టలేదని జేసీ చెప్పారు. ఇదే విషయాన్ని తాను పలుమార్లు బాబు దృష్టికి తీసుకొచ్చానని తెలిపారు. జన్మభూమి కమిటీలతో పాటు పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై పబ్లిక్ మీటింగ్‌లలో కూడ నిర్భయంగానే తాను చెప్పానన్నారు. పార్టీ నేతలు చాలా మంది ఇబ్బంది పడ్డారని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు. కేశినేని నానే కాదు... చాలా మంది నేతలు పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలతో కష్టాలు అనుభవించారని ఆయన చెప్పారు.

సినిమా హీరోలకు ఉన్న పాపులారిటీ కారణంగా వారి సభలకు జనం వచ్చే అవకాశం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పరిస్థితి ఏమిటో అర్ధమైందన్నారు. జనసేనలో చేరాలని తనకు కూడ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పంపారని.. కానీ, ఆనాడే తన అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్‌కు కుండబద్దలు కొట్టినట్టు చెప్పినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి నుండి రాజకీయాల్లో చేరితే కొంత కాలానికి మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందన్నారు. కానీ, టీడీపీకి చంద్రబాబు పెద్ద దిక్కు అని ఆయన అన్నారు. చంద్రబాబుకు దూరదృష్టి ఉంది. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యం కూడ ఉందని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.