జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలి...కాంగ్రెస్ నేతల డిమాండ్
posted on Jul 28, 2025 3:53PM

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు కోరారు. జైపాల్రెడ్డి వర్ధంతి సందర్బంగా హైదరాబాద్ నెక్లస్ రోడ్డులోని స్మారక ఘాట్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీనియర్ నేత కె కేశవరావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ, పలువురు ఎమ్మెల్యేలు, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జైపాల్ రెడ్డి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు.
హైదరాబాద్కు మెట్రో జైపాల్ రెడ్డి కృషి వల్లే వచ్చిందని చెప్పారు. దేశం మొత్తం మీద నిజాయితీగా పని చేసిన వ్యక్తి అని, ఆయనను తెలంగాణ మరువదని చెప్పుకొచ్చారు. అచ్చంపేట శాసన సభ్యుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఉత్తమ పార్లమెంటరీ అవార్డు గ్రహీత అయిన జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని, అలాగే నాగర్ కర్నూల్ జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, జైపాల్రెడ్డి వర్దంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి, ఆయన కూతురు నైమిష రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.