శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద
posted on Aug 14, 2025 10:32AM

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వస్తున్న వరద నీటి కారణంగా అధికారులు జలాశయం 7 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్ల ఎత్తి లక్షా 87 వేల 208 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టుకు జూరాల నుంచి 70 వేల 802 క్యూసెక్కుల నీరు, సుంకేసుల నుంచి 42 వేల 669, హంద్రీ నుంచి 3,750 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.2737 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.