గోరంట్ల మాధవ్ మళ్లీ మెదలెట్టేశారు!

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ  ఎంపీ గోరంట్ల మాధవ్ తీరు. ఎంపీగా ఉండగా ఆయన తన పనితీరు కంటే న్యూడ్ వీడియోద్వారానే ఎక్కువ మందికి తెలిశారు. అంతకు ముందు పోలీసు అధికారిగా ఉండగా తెలుగుదేశం నాయకులపై తొడకొట్టి సవాల్ చేసి జగన్ దృష్టిలో పడి ఎంపీ టికెట్ కొట్టేసి గెలిచేసిన గోరంట్ల మాధవ్.. ఆ తరువాత కూడా తరచూ వివాదాలతోనే జనం నోళ్లలోనానారు. 

ఒక యూట్యూబ్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో వైఎస్‌ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును  ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడనుంచి గుంటూరుకు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకున్న పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్శించారు. దీంతో పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ నెల 10 నుంచీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల మాధవ్ బెయిలుపై విడుదలయ్యారు. విడుదలైన గంటల వ్యవధిలోనే తన నోటికి పని చెప్పారు. గతంలో పోలీసు అధికారిగా పని చేసిన గోరంట్ల మాధవ్ పోలీసుల విధులను అడ్డుకోవడం, వారిపై దాడికి పాల్పడడం నేరాలని తెలియంది కాదు. కానీ ఆ పనే చేసి అరెస్టయ్యారు. కానీ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు ప్రతీకార రాజకీయాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  

కటకటాలు లెక్కపెట్టినా ఆయన తీరులో మార్పు రాలేదు. వాస్తవానికి వైసీపీ నేతలలో అత్యధికులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బూతులతోనే ఎక్కువగా గుర్తింపు పొందారు. అలా ఒక నెగటివ్ ఇమేజ్ తో పాపులర్ అయిన వైసీపీ నేతలలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు. తాజాగా ఆయన జైలు నుంచి షరతులతో కూడిన బెయిలుపై విడుదలయ్యారు.  

మాజీ పోలీసు అధికారి అయిన మాధవ్.. ఇప్పుడు గుంటూరు పోలీసు స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాలి. కోర్టు విధించిన షరతులలో ఇది ఒకటి. అయినా గోరంట్ల మాధవ్ తీరు మారలేదు. ఇలా జైలు నుంచి బయటకు వచ్చారో లేదో అలా చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు. 

చంద్రబాబు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించిన గోరంట్ల మాధవ్ అన్నిటినీ గుర్తుపెట్టుకుంటాం. మా పిక్క మీద వెంట్రక కూడా పీకలేరంటూ ఇష్టారీతిగా మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు చంద్రబాబుకు, ఆయన మనుషులకు గట్టి గుణపాఠం చెబుతామంటూ హెచ్చరిక జారీ చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు సంగతి చూస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ లో చ ర్చనీయాంశంగా మారింది. చింత చచ్చినా పులుపు చావలేదంటూ నెటిజన్లు గోరంట్ల మాధవ్ పై సెటైర్లు పేలుస్తున్నారు.