ప్రగల్బాలు పలికిన పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్?

ప్రగల్బాలు పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్  దేనికైనా రెడీ అంటూ బీరాలు..భారత్‌లో రక్తంపారిస్తామంటూ కారుకూతలు... కన్నుకి కన్ను..పన్నుకు పన్ను అంటూ డైలాగులు...తీరా కట్ చేస్తే పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్‌ ... అవును మీరు వింటున్నది నిజమే. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్ కన్పించడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత...రెచ్చిపోయి మాట్లాడిన మునీర్‌... అదృశ్యమయ్యాడు. రెండ్రోజులుగా ఎవరికీ కన్పించడం లేదు. ఇప్పటికే ఆయన ఫ్యామిలీ దేశం విడిచి వెళ్లిపోగా...తాజాగా పాక్ ఆర్మీ చీఫ్‌ మిస్స్‌ అవ్వడం సంచలనంగా మారింది. అతడు రావల్పండిలోని బంకర్‌లో దాక్కున్నట్లు వార్తలు వస్తున్నాయ్‌. రెండ్రోజుల క్రితం పాక్‌ ప్రధాన మంత్రి  ఓ ఫొటో షేర్ చేసింది.

అందులో ప్రధాని పక్కన ఆర్మీ చీఫ్‌ ఉన్నట్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ పోస్టు అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది. పహల్గామ్‌ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పాక్ ఆర్మీకి పట్టుకుంది. దేనికైనా సిద్ధం, యుద్ధానికి రెడీ అంటూ పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నా.. లోలోపల గజగజ వణికిపోతుంది. ఇండియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో పాక్‌కు బాగా తెలుసు. గతంలో జరిగిన అనుభవాలు కళ్లముందే ఉన్నాయ్‌. సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఎయిర్‌ స్ట్రైక్స్‌ను ఇంకా మరిచిపోలేదు. ఈసారి  భారత్ నుంచి అంతకు మించి రియాక్షన్ ఉంటుందని భావిస్తోంది పాక్‌.  ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు నుంచే...సరిహద్దు సమీపంలోకి ఆయుధాలను తరలిస్తోంది దయాది దేశం. LOC వెంబడి భారత వైమానిక దాడులను పసిగట్టడానికి చర్యలు చేపట్టింది. సియాల్‌కోట్‌ ప్రాంతానికి పాకిస్థాన్‌ సైన్యం తన రాడార్‌ వ్యవస్థలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

సరిహద్దుకు 58 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖోర్‌ కంటోన్‌మెంట్ వద్ద టీపీఎస్‌-77 రాడార్ సైట్‌ను ఏర్పాటు చేసింది. టీపీఎస్‌-77 మల్టీ-రోల్ రాడార్ అనేది అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు, ఎయిర్‌ ట్రాఫిక్‌ పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు.  ఇటు పీవోకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించింది. పీఓకే ప్రాంతం అంతటా చాలా లాంచ్ ప్యాడ్‌లు ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించిన కొంతసేపటికే.. పాకిస్తాన్ ఈ చర్య తీసుకుంది. కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లి, ఖుయిరట్టా, మంధర్, నికైల్, చమన్‌కోట్, జంకోట్ నుండి ఉగ్రవాదులను తరలించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాక్ చర్యలను ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు పసిగడుతోంది. ఇప్పటికే LOC వెంబడి నిఘా పెంచింది.

ఫ్రంట్‌లైన్‌ ఫైటర్‌ జెట్స్‌తో విన్యాసాలు  చేపట్టింది. గతవారం రఫేల్ సహా ఫైటర్ జెట్లు పెద్దఎత్తున సైనిక విన్యాసంలో పాల్గొన్నాయి. ఇటు నేవీ కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. దాంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.