వైసీపీకి మాజీ మంత్రి రావెల్ కిషోర్ రాజీనామా
posted on Jun 7, 2024 2:11PM
సార్వత్రిక ఎన్నికల ముందు వివిధ పార్టీల నుంచి వైసీపీ లీడర్లు పెద్ద సంఖ్యలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి క్లీన్ స్వీప్ చేయడంతో తెలుగు దేశంలో చేరే వారి సంఖ్య ఎక్కువవుతుంది.
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి గుడ్బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. తాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి పనిచేశానని.. 2014లో తనకు చంద్రబాబు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. 2014లో ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన టీడీపీ బాస్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు మంద కృష్ణమాదిగ 40 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని, ఇప్పుడు ఆ అంశం ముగింపునకు వచ్చిందని భావిస్తున్నానని రావెల అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరూ వర్గీకరణకు మద్దతు తెలిపారని, అందుకే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. సామాజిక సేవ చేస్తూనే.. వర్గీకరణ అంశం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. దానికి అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని తెలిపారు.
ఇదిలాఉంటే.. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిశోర్బాబు.. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కొంత కాలం తర్వాత బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి.. వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రావెల కిషోర్బాబు రాజీనామా చేశారు.