హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
posted on Jul 15, 2025 9:40AM

హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. మలక్ పేట శాలివాహన్ నగర్ పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. మృతుడిని చందూ రాథోడ్ గా గుర్తించారు. సీపీఐ నాయకుడైన చంద్ర రాథోడ్ మంగళవారం (జులై 15) ఉదయం మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని తన నివాసానికి వెడుతుండగా అప్పటికే కారులో వచ్చి చందూ రాథోడ్ వెళ్లే మార్గంలో కాపు కాచిన నలుగురు దుండగులు ఆయన కంట్లో కారం చల్లి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి కారులో పరారయ్యారు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చందు రాథోడ్ అక్కడికక్కడే మరణించారు. పాతకక్షల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.కాగా చందు రాథోడ్ పై కాల్పులు జరిపిన వారు కూడా వామపక్ష భావాలున్న నాయకులేనని చెబుతున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి సీపీఐఎంఎల్ కు చెందిన రాజేష్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.