దేశంలో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
posted on Oct 8, 2025 5:58PM

దేశంలోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.19,650 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వ-ప్త్రెవేటు భాగస్వామ్యం కింద ఈ గ్రీన్ఫీల్డ్ విమానశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఒక టెర్మినల్తో ఏటా 20 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగల సామర్థ్యం దీని సోంతం. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతు 2014లో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు ఉంటే. ప్రస్తుతం ఆ సంఖ్య 160కి పైగా పెరిగియని తెలిపారు. నవీ ముంబై ఎయిర్పోర్టు ఆసియాలో బిగ్గెస్ట్ కనెక్టివిటీ హబ్గా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు.
ఇప్పుడు బహుళ విమానాశ్రయాలు కలిగిన ప్రపంచ నగరాల జాబితాలో ముంబైకి ప్రత్యేక స్థానం లభించింది. 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మితమైన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. ఈ సౌకర్యం పూర్తిస్థాయిలో పనిచేసిన తర్వాత సంవత్సరానికి తొమ్మిది కోట్ల ప్రయాణికులను, 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రారంభ దశలో సంవత్సరానికి రెండు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించనుంది.
అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) ప్రకారం, ఈ కొత్త విమానాశ్రయం ముంబై ప్రాంతపు విమాన రవాణా ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, కనెక్టివిటీని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన లాభాలను చేకూర్చనుంది. ఇదే సమయంలో, విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) సెప్టెంబర్ 30న ఈ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరు చేసింది.
నవీ ముంబై విమానాశ్రయం అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంది. ఇందులో 66 చెక్-ఇన్ పాయింట్లు, 22 స్వీయ-సేవ సామాను డ్రాప్ స్టేషన్లు, 29 బోర్డింగ్ వంతెనలు, బస్సు బోర్డింగ్ కోసం 10 గేట్లు ఉన్నాయి. 5జీ నెట్వర్క్లు, అధునాతన సెన్సార్లు, ఆటోమేటెడ్ లగేజ్ సిస్టమ్లు, అలాగే డీజీ యాత్ర ద్వారా కాంటాక్ట్లెస్ ప్రాసెసింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
కార్గో విభాగం పూర్తిగా ఆటోమేషన్ ఆధారంగా పనిచేస్తుంది. డిజిటల్ కన్సైన్మెంట్ ట్రాకింగ్, ఆన్లైన్ లావాదేవీలు, అలాగే మందులు, పాడైపోయే వస్తువుల కోసం ప్రత్యేక ఉష్ణ నియంత్రిత విభాగాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సౌకర్యాలతో నవీ ముంబై విమానాశ్రయం దేశంలోనే అత్యాధునిక విమాన కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది.