కర్నాటకంలో కులకలం

మీరు కొట్టుకుంటే.. మోదీ కూల్చేస్తారు  
ముఖ్య నేతలకు ఖర్గే హెచ్చరిక  

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  కుల గణనకు ఇచ్చే ప్రాధాన్యత గురించ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కులగణనతో దేశాన్ని ఎక్స్- రే తీసి.. అసమానతలను తొలగిస్తామనీ, దేశ సంపదను అన్ని వర్గాలకూ సమానంగా పంచుతామనీ, రాహుల్ గాంధీ  2024 ఎన్నికల్లోనే దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.  ఇక అక్కడి నుంచీ రాహుల్ గాంధీ కులగణన గురించి ఎక్కడంటే అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. పార్లమెంట్  ప్రసంగమే అయినా.. పార్టీ లేదా పబ్లిక్ మీటింగే అయినా..  కులగణన ప్రస్తావన లేని రాహుల్ గాందీ ప్రసంగం ఇటీవల కాలంలో ఒక్కటీ  లేదంటే అతిశయోక్తి కాదు.ఇది ఆయనకు ఈ అంశం పట్ల ఉన్న నిబద్దతకు నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

దేశంలో అసమానతలు తొలిగి పోయేందుకు కులగణనను మించిన దివ్య ఔషథం మరొకటి లేదనే విశ్వాసం ఆయన ప్రతి మాటలో వ్యక్తమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కులగణనకు రాహుల్ గాంధీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని  అంటున్నారు. కులగణనలో ఆయన భవిష్యత్ భారతాన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను చూస్తున్నారు. అందుకే ఆయన  దేశం అంతటా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే  కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్షణం కులగణన చేపట్టి ఆదర్శంగా నిలవాలని కాంగ్రస్ పాలిత మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాహుల్ గాంధీ ఆదేశించారు.    

రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాలపై కులగణనను చేపట్టింది.   దిగ్విజయంగా పూర్తిచేసింది. అంతే కాదు  తదను గుణంగా రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మంత్రులు ఢిల్లీ వరకూ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. రాహుల్ గాంధీ మెప్పు పొందారు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఏఐసీసీ వేదిక నుంచి  రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిన కులగణనను ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుతాన్నిడిమాండ్ చేశారు. 

అయితే ఇప్పడు అదే కులగణన కర్ణాటక మంత్రి వర్గంలో కుంపట్లు రాజేసింది. అసలే ఉప్పు నిప్పులా ఉండే ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  మధ్యన మరో కుంపటి వెలిగించింది.  నిజానికి  రాహుల్ గాంధీ మదిలో కులగణన మెరుపు మెరవక ముందు ఎప్పుడో దశాబ్దం క్రితం 2015లోనే.. ఇదే ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  సామాజిక ,ఆర్థిక, విద్యా సర్వే పేరిట  కులగణన చేపట్టింది.  ప్రాథమిక   నివేదిక 2018 నాటికే సిద్దమైంది. అయితే అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆ నివేదికను ముట్టుకోలేదు. పక్కన పెట్టింది. 

అయితే.. 2023లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. మళ్ళీ సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత కులగణన మరోమారు తెర పైకి వచ్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కులగణన జెండా పట్టిన తర్వాత  పాత సర్వే అంశం  పై కొచ్చింది. అయితే  ఓ వంక రాహుల్ గాంధీ,దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా.. సిద్ధంగా ఉన్న కులగణన నివేదికను బయట పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం నిన్న మొన్నటి వరకూ మీన మేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో  కాంగ్రెస్ అధిష్టానం కూడా వేలు పెట్టే ప్రయత్నం చేయలేదు.

అయితే.. తాజాగా గత శుక్రవారం (ఏప్రిల్ 11) నివేదిక రాష్ట్ర మంత్రి వర్గం ముందు కొచ్చింది. నివేదిక కాపీలు మంత్రుల చేతుల్లోకి వచ్చాయి. అందులోని అంశాలు లీక్ అయ్యాయి.  సహజంగానే దుమారం చెలరేగింది. నివేదిక ప్రకారం కర్ణాటకలో వెనుకబడిన కులాల జనాభా 69.60 శాతానికి చేరింది. ముస్లిములు సహా, మిగిలిన సామాజిక వర్గాల శాతం ఇంచు మించుగా రెట్టింపు అయింది. మరోవంక రాష్ట్రంలో రాజకీయంగా బలమైన సామాజికవర్గం వీరశైవలింగాయతలలోని, లింగాయతులు, వక్క లింగాయతుల శాతం మాత్రం తగ్గింది.  దీంతో, నివేదిక విశ్వసనీయతను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా పలువురు తప్పు పడుతున్నారు. కులగణన నివేదికను వీరశైవలింగాయతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నివేదికను చెత్తబుట్టలో పడేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 17) న కులగణన నివేదికపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ  ప్రత్యేక సమావేశం  తీవ్ర వాదోపవాదాల నడుమ రసాభాసగా ముగిసినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న లింగాయత్, వక్క లింగాయత్ కులాల మంత్రులు నివేదికను పూర్తిగా వ్యతిరేకిచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు అసంపూర్తిగా ముగిసాయి, తిరిగి మే 2న జరిగే మంత్రివర్గ ప్రత్యేక సమవేశంలోమరో సారి  మరింత లోతుగా చర్చిస్తామని చెప్పారు.

అయితే.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సింగల్ పాయింట్ ఎజెండాగా ముదుకు తీసుకుపోతున్న కులగణనకు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోనే ఎదురుదెబ్బ తగలడం  కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని పరిశీలకులు అంటున్నారు.  మరోవంక  కులగణన వివాదం నేపథ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్టుకోకండని, కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి సూచించారు. మీ మధ్య విభేదాలు మోడీకి అవకాశమవుతున్నాయని ఖర్గే హెచ్చరిం చారు. ప్రధాని ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు అప్ర మత్తంగా ఉండాలన్నారు. కాగా  ఖర్గే చేసిన బహిరంగ హెచ్చరిక ప్రమాద స్థాయిని సూచిస్తోందని పరిశీలకులు అంటున్నారు.