సి.రాజగోపాలాచారి సృష్టి.. టెరిటోరియల్ ఆర్మీ

గ్రౌండ్‌లో బ్యాటింగ్‌లో ఇరగదీసిన సచిన్, ధోని.. బార్డర్‌లో రైఫిల్ పట్టుకుని పాక్‌ను రఫ్పాడిస్తారా..? సూపర్ యాక్షన్‌తో ప్రేక్షకుల చేత సీటిలు కొట్టించుకున్న మోహన్ లాల్‌, నానా పటేకర్.. సరిహద్దుల్లోనూ శత్రుదేశంపై బుల్లెట్ల వర్షం కురిపిస్తూ.. దేశాభిమానాన్ని దక్కించుకుంటారా? బ్యాట్లతో పాకిస్థాన్‌ ను ఉతికారేసిన సచిన్, ధోని.. త్వరలో అదే పాకిస్థాన్‌ను ఏకే 47తో చిత్తు చేయడానికి సిద్దం అంటున్నారు. ఇన్నాళ్లు షూటింగ్‌లతో బిజీగా ఉన్న మోహన్ లాల్, నానా పటేకర్‌లు.. పాక్‌ సైన్యంపై గన్నులతో షూటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది..  త్వరలో బార్డర్‌లో ఈ సెలబ్రిటీలను.. ఆర్మీ డ్రెస్సులో  చూడబోతున్నామంటున్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి కీలక అనుమతినిచ్చింది. 

పాకిస్థాన్, భారత్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పటిస్తున్న భారత ఆర్మీ.. శత్రుదేశం కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అయితే ఈ క్రమంలో దాయాదిపై దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు  కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దింపాలని అనుకుంటోంది. రెగ్యూలర్ ఆర్మీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని టెరిటోరియల్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. 

అయితే టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి రిజర్వ్ ఫోర్స్.  ఇది భారత సైన్యానికి సేవలందించే పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన ఒక వ్యవస్థ. ఇందులో సిబ్బంది, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే స్వచ్చందంగా ఆర్మీతో పని చేస్తుంటారు. టెరిటోరియల్ ఆర్మీలో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, భారత సైన్యంలో ఉన్నవారికి సమానమైన ర్యాంకులను కలిగి ఉన్న ఇతర సిబ్బంది ఉంటారు. ఈ ఆర్మీ ప్రధానంగా సాధారణ సైన్యాన్ని స్థిర విధుల నుండి ఉపశమనం కలిగించడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌర పరిపాలనలో సహాయం చేయడానికి ఉపయోగించబడుతుంది. దేశ ప్రజలు ప్రభావితమైనప్పుడు..దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు అవసరమైన సేవలను నిర్వహిస్తుంది. అలాగే అవసరమైనప్పుడల్లా రెగ్యులర్ ఆర్మీతో కలిసి పని చేస్తుంది.  

1948లో టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదించారు. మొదటి భారత గవర్నర్ జనరల్ సి.రాజ గోపాలాచారి అక్టోబర్ 9, 1949న టెరిటోరియల్ ఆర్మీని అధికారికంగా ప్రారంభించారు. టెరిటోరియల్ ఆర్మీ యూనిట్లు 1962లో ఇండియా-చైనా యుద్ధం, 1965లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధం, 1971లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో చురుకుగా పాల్గొన్నాయి. శ్రీలంకలో ఆపరేషన్ పవన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో ఆపరేషన్ రక్షక్, ఈశాన్య భారతదేశంలో ఆపరేషన్ రైనో, ఆపరేషన్ బజరాంగ్‌లలో సైన్యం పాల్గొంది. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో దాదాపు 50 వేల మంది సిబ్బంది ఉన్నారు. 

టెరిటోరియల్ ఆర్మీలో అనేక మంది క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీరిలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, షూటర్ అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్, యాక్టర్లు  మోహన్ లాల్, నానా పటేకర్ వంటి ప్రముఖులు దేశం కోసం పోరాటానికి సిద్దంగా ఉన్నారు. భారత్‌-పాక్ యుద్ధం నేపథ్యంలో ధోని, సచిన్ వంటి క్రికెటర్లు, మోహన్‌లాల్, నానా పటేకర్‌లను యుద్దరంగంలో దిగితే సైనికులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu