భారత్‌లో కరోనా తీవ్రరూపం.. ఒక్క రోజులో 6 వేలకు పైగా కేసులు

భారత్‌లో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత కొద్దిరోజులుగా రోజుకి ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్న కరోనా.. ఇప్పుడేకంగా ఆరు వేలలోకి అడుగుపెట్టింది. ఒక్కరోజులో తొలిసారిగా ఆరువేల కంటే అధికంగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 6,088 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 118,447కు చేరింది. గత 24 గంటల్లో 148 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో.. భారత్‌‌లో కరోనా మృతుల సంఖ్య 3,583కి చేరింది. ఇప్పటివరకూ 48,533 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 66,330 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.