ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు : హరీశ్రావు
posted on May 25, 2025 3:45PM

రాష్ట్ర నీటి అవసరాలు కాపాడటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీ తరలించుకుపోయే కుట్ర జరుగుతుంది. తెలంగాణకు ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు. గోదావరి – బనకచర్లకు ఒక్క అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుంది.
కేంద్రం జుట్టు తన చేతిలో ఉందని చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన జలదోపిడీ.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు చంద్రబాబు మోకాలు అడ్డుపెట్టారు. తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలని కేంద్రానికి లేఖలు రాశారు. తెలంగాణ ప్రాజెక్టులు నిలిపివేయాలని ఏపీకి 20కి పైగా లేఖలు రాసింది. పాలమూరు, భక్తరామదాసు, డిండిపై చంద్రబాబు లేఖలు రాశారు అని హరీశ్రావు గుర్తు చేశారు.