ఐరాస సదస్సులో చంద్రబాబు కీలక ప్రసంగం

 

ఐక్యరాజ్యసమితి వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పురోగతిని వివరించారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావం’ సదస్సులో బాబు తన తొలిపలుకులు తెలుగులో మాట్లాడటంతో సభికుల నుంచి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారిందని, ఇది ప్రపంచానికే ఆదర్శం అని అన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అమలుతీరును వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు. ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరించారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేసిన తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం.