కేసీఆర్‌ కు నేనేంటో చూపిస్తా - జగ్గారెడ్డి

 

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి 2004 లో నకిలీ పాస్ పోర్టులతో గుజరాత్ కి చెందిన వారిని కుటుంబసభ్యులుగా పేర్కొని.. వారిని అమెరికాలో వదిలి వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ కూడా చేసారు. అయితే తాజాగా ఆయన బెయిల్ పై విడులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడమే తాను చేసిన నేరమని జగ్గారెడ్డి అన్నారు. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం నాటి కేసును కేసీఆర్ తిరగదోడారని ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతోంది కనుకనే తనను కేసీఆర్ కుటుంబం టార్గెట్ చేసిందని మండిపడ్డారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పైందని.. ప్రశ్నిస్తే వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని.. లేకుంటే పాత కేసులను తిరగదోడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఇకపై తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు. ఎన్నికలకు నెలరోజుల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా లేదా నియంత పాలనైన కేసీఆర్ ప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకుని తీర్పు ఇవ్వాలన్నారు. కేసీఆర్ జీవితంలో ఏ తప్పూ చేయాలేదా? అని ప్రశ్నించారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న జగ్గారెడ్డి తను నిర్దోషిగా బయటపడతానన్నారు.