హిమాచల్ లో క్లౌడ్ బరస్ట్.. జల ప్రళయం
posted on Aug 2, 2025 3:35PM
.webp)
హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి ప్రళయం సృష్టించింది. కులు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తడంతో శుక్రవారం (ఆగస్టు 1) పెను విషాదం చోటు చేసుకుంది. కుండపోత వర్షం కారణంగా మహోగ్రఉగ్రరూపం దాల్చిన మలానా నది గట్లు తెంచుకు ప్రవహించింది. మలానా వరద ధాటికి మలానా-I హైడ్రోపవర్ ప్రాజెక్టుకు చెందిన కాఫర్డ్యామ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. స్థానిక నివేదికల ప్రకారం, ఈ జలప్రళయంలో మలానా బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైంది. ఆకస్మిక వరద ఉధృతికి కార్లు, వంతెనలు, ఇళ్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. ఈ భారీ వరదలలో దాదాపు 30 మంది గల్లంతైనట్లు చెబుతున్నారు.పలువురు వరద ముంపులో చిక్కుకున్నారు. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
ఆహారం, నీరు లేక నానాయాతనా పడుతున్నారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు స్పందన దళం రంగంలోకి దిగింది. పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కులులో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం అధికారికంగా నమోదు కాలేదని, అయితే పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగుతున్నందున మరింత ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం ఔతున్నది.