బలూచ్ కి స్వేచ్ఛ లభిస్తే.. చైనా కూడా పాక్ కి హ్యాండిస్తుందా?
posted on May 9, 2025 12:33PM

పాక్ చేజారిన క్వెట్టా?..
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం?
క్వెట్టా నుంచి పాక్ సైనికుల పరార్ పాక్ సైనికులు?
అసలేంటీ బలూచిస్తాన్ గొడవ?
బలూచిస్తాన్ పాక్ చేజారితే.. చైనా సపోర్టు హుళక్కేనా?
బలూచిస్తాన్ పాకిస్థాన్ మధ్య గొడవ ఈ నాటిది కాదు దాదాపు ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ పోరాటం. బలూచిస్థాన్ తొలుత స్వతంత్రంగా ఉండేది. భారత్ నుంచి పాక్ 1947 ఆగస్ట్ 15న విడిపోయినప్పటి నుంచి.. బలూచిస్తాన్ స్వేచ్ఛగా ఉండేది. ఖాన్ ఆఫ్ కలాత్ అనే రాజు పాలనలో ఈ ప్రాంతం ప్రజలు హాయిగా జీవించేవారు. కానీ 1948 మార్చిలో పాక్ ప్రభుత్వం సైనిక చర్య ద్వారా బలూచిస్తాన్ ని తమ దేశంలో విలీనం చేసుకుంది. పాకిస్థాన్ విస్తీర్ణంలో బలూచిస్తాన్ వాటా 44 శాతం. అయితే పాక్ జనాభాలో బలూచ్ ప్రజల శాతం మాత్రం కేవలం 7 నుంచి 8 శాతమే.
పాక్ దురాక్రమణ నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. తమ దేశంలో తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండలేక పోతున్నామన్నది వీరి ఆవేదన. వీరికి అక్కడి పౌరులకున్నంత స్వేచ్ఛ లేదు. కనీసం విద్యా, వైద్య సదుపాయాలు అందని దుస్థితి. ఒకరకంగా చూస్తే పాక్ తమను బానిసలను చూసినట్టు చూస్తోందన్నది వారి ఆరోపణ. అందుకే వీరి నినాదం బలూచిస్తాన్ ఈజ్ నాట్ పాకిస్తాన్. ఆ నినాదంతో బలూచిస్థానీయులు తరచూ రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తుంటారు.
దానికి తోడు ఈ ప్రాంత వనరులను చైనాతో కలసి దోచుకుంటోంది పాకిస్థాన్. మరో విచిత్రమైన సమస్య ఏంటంటే.. ఈ ప్రాంతానికి చెందిన యువకులను పాక్ సైన్యం అపహరిస్తోంది. అలా అదృశ్యమయిన వారి జాడ ఇప్పటికీ తెలియడం లేదంటే ఇక్కడి పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇదీ బలూచీల దుర్బర గాథ.
బలూచిస్తాన్లో విస్తారమైన ఖనిజ వనరులున్నాయి. గ్యాస్, యురేనియం, బంగారం, రాగి వంటి వనరులు ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలకు అందుతోన్న అభివృద్ధి అంతంత మాత్రమే. గ్వాదర్ పోర్ట్ చైనాకు కీలకం కావడంతో, సీపెక్ ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉద్ధృతంగా పోరాడుతోంది చేసింది.
హైబ్రిడ్ రోడ్లు, రైల్వే మార్గాలు దాడులకు గురవుతుండటంతో చైనా ఓ ఎయిర్పోర్ట్ నిర్మించింది. చైనా ఇంజినీర్లు, పెట్టుబడిదారులపై వరుసగా దాడులు చేస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచ్ ప్రజలు సైతం తమ వనరుల దోపిడిని నిరసిస్తూ చైనా పైనా విరుచుకుపడుతున్నారు. 2025 మార్చి 11న.. క్వెట్టా-పెషావర్ మధ్య జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. 214 మంది పాకిస్తాన్ మిలిటరీ సిబ్బందిని హత్య చేసినట్లు ప్రకటించింది . పాకిస్తాన్ ప్రభుత్వం ఇది అబద్ధమని, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఉగ్రవాద సంస్థ అని ఆరోపించింది.
ఇపుడీ బలూచిస్తాన్ కారణంగానే పాక్ చైనా మధ్య సత్సంబంధాలున్నాయి. ఒక వేళ ఇదే బలూచిస్తాన్ పాకిస్థాన్ నుంచి చేజారి పోతే.. ఇక చైనా సైతం పాక్ కి సాయం చేయడం ఆపేస్తుంది. వారు గానీ ఇదే యుద్ధంలో తమకు తాము స్వాతంత్రం ప్రకటించుకుని ప్రత్యేక దేశంగా మారితే.. ఇక పాక్ పని దాదాపు ఖతమే. కారణం పాకిస్థాన్ భూ భాగంలో సగం బలూచిస్తాన్ దే. ఇటు దేశంలో సగ భాగం కోల్పోవడం మాత్రమే కాక అటు చైనా సాయం కూడా కోల్పోతే.. ఇక పాక్ పని అయిపోయినట్టే లెక్క.
ఈ వ్యవహారాన్ని ఎంతో సునిశితంగా గమనిస్తోంది చైనా. ఒక వేళ బలూచిస్తాన్ లిబరేష్ ఆర్మీ గనుక క్వెట్టాను పూర్తి స్వాధీనం చేసుకుంటే ఇక పాక్ సగం ముక్కగా మిగిలిపోవడం ఖాయం. ఇప్పటికే క్వెట్టాను బీఎల్ఏ చేజిక్కించుకున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఇక్కడి నుంచి పాక్ సైన్యం కూడా పరారవుతున్నట్టు కనిపిస్తోంది. వీటన్నిటిని బట్టీ చూస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా ఒక్క యుద్ధం ఇటు పాక్ పీచమణచడం అటు పాక్ నే సగం ముక్కగా మిగల్చడం జరిగినట్టే భావించాలి. అందుకే అజిత్ దోవల్ ఎప్పటి నుంచో మరో ముంబై తరహా దాడి జరిగితే.. పాక్ బలూచిస్తాన్ ని మరచిపోవల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఒక వేళ బలూచిస్తాన్ వేరుగా ఏర్పడితే.. చైనా నేరుగా ఈ దేశాన్నే ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది. చైనా ఉలబలాటమంతా బలూచిస్తాన్ లోని వనరుల కోసమే తప్ప పాకిస్థాన్ పై ప్రేమ కాదన్నది తెలిసిందే. ఆ కారణంగానే బలూచిస్థాన్ పాక్ చేజారితే మన దాయాది దేశం ఒక ఒంటరే. ఇక సింధ్, గిల్గిట్- బల్టిస్తాన్ గొడవ సంగతి సరే సరి. వీటికి తోడు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ సైతం భారత్ పరమైతే.. పాకిస్తాన్ పిట్ట రెట్టంత దేశంగా మారిపోవడం తథ్యం.