పాక్ కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం
posted on May 9, 2025 3:42PM

పాకిస్తాన్ జమ్ముకాశ్మీర్ లో జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళీనాయర్ వీరమరణం చెందారు. మురళీనాయక్ మృతిచెందినట్లు అధికారవర్గాలు ధృవీకరించాయి. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలోని కల్లి తండాకు చెందిన మురళి నాయక్ సోమందేపల్లి మండల పరిధిలోని నాగినాయని చెరువు తండాలో పెరిగారు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. . పంజాబ్ లో పని చేస్తున్న ఆయన రెండు రోజుల కిందటే విధుల నిమిత్తం జమ్మూకు వెళ్లారు. గురువారం పాక్ చొరబాటుదారులను అడ్డుకునే ఆపరేషన్ లో పాలుపంచుకున్నారు.
ఆ క్రమంలో పాక్ నుంచి జరిగిన కాల్పుల్లో అసువులు బాసారు. మురళినాయక్ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు అధికారులు చేరవేశారు. మురళీనాయక్ భౌతిక కాయం రేపు ఆయన స్వగ్రామమైన కల్లి తండాకు చేరనుంది. మురళి మరణ వార్తతో ఆయన స్వగ్రామంలోనే కాకుండా ఏపీవ్యాప్తంగా విషాధ ఛాయలు అలముకున్నాయి.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడకు వీరజవాన్ మురళీనాయక్ మృతి పట్ల ప్రగాఢ సంతాపంతెలిపారు. యుద్ధంలో మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సదరు సంతాపంలో చంద్రబాబు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళికి నివాళి అర్పించిన బాబు… మురళి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మంత్రులు అనగాని సత్యప్రాసాద్ తదితరులు మురళి వీర మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మురళీనాయక్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
