టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడి కుమారుడు, కుమార్తె అరెస్టు

దివంగత మాజీ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు, కుమార్తెలు అరెస్టయ్యారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రఘునాథ్‌ అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్‌, కుమార్తె కల్పజ, డీఎస్పీ మోహన్‌ను సీబీఐ అధికారులు సోమవారం (డిసెంబర్ 22) అరెస్టు చేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రఘునాథ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో   భూముల క్రయవిక్రయాలు చేసేవారు. ఆయన 2019 మే4న బెంగళూరు వైట్ ఫీల్డ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.  ఆయన  భార్య మంజుల  ఫిర్యాదు మేరకు .  పోలీసులు  విచారణ చేపట్టారు. తన భర్త మరణంపై శ్రీనివాస్‌తో పాటు పలువురు కారణమని మంజుల తన ఫిర్యాదులో పూర్కొన్నారు.  తన భర్తను కిడ్నాప్ చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రఘునాథ్ అత్మహత్య అని పేర్కొంటూ అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిని సవాల్ చేస్తూ రఘునాథ్ భార్య మంజుల హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ కూడా రఘునాథ్ ది ఆత్మహత్యేనని నిర్ధారించింది. అయితే  మంజుల హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించారు.  ఆమె పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం, రఘునాథ్‌ మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసు సీబీఐ విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఇందులో భాగంగానే  ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజతో పాటు పలువురిని  అరెస్టు చేసింది. సాక్ష్యాలు నాశనం చేయడం, పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ స్టాంపులు, సీళ్లను సృష్టించడం వంటి ఆరోపణలపై ఈ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu