ఎన్నికల వేళ.. బీబీసీ డాక్యుమెంటరీ రచ్చ!
posted on Feb 7, 2023 11:18AM
ఎన్నికల ఏడాది.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకీ బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ (బీబీసీ) గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది తొమ్మది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే వచ్చే ఏడాది మేలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దీంతో విపక్షాలన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై విమర్శల దాడికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
అయితే అనుకోకుండా వాటికి బీబీసీ డాక్యుమెంట్ రూపంలో బ్రహ్మాస్త్రం లభ్యమైంది. అసలు సాధారణంగా దేశంలో ఎన్నికల సమయంలో మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా తమదైన సైడ్ తీసుకోవడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువగా కనిపిస్తోంది. అధికార పక్షం వైపో విపక్షాల వైపో మీడియా కూడా తమ ప్రచురణలు, ప్రసారాలను చేస్తున్నది. అయితే అనూహ్యంగా బీబీసీ రూపొందించిన ఒక డాక్యుమెంటరీ మాత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. 2002 నాటి గుజరాత్ అల్లర్లపై బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన ఒక డాక్యుమెంటరీ మొదటి భాగం గత నెల 17న ప్రసారమైంది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విపక్షాలకు ఒక బ్రహ్మాస్త్రంగా దొరికిందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేంద్రం వెంటనే అప్రమత్తమై ఈ డాక్యముంటరీ ప్రసారంపై నిధేధం విధించింది. రెండు భాగాల ఈ డాక్యుమెంటరీ పేరు ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్ సమయంలో జరిగిన మత ఘర్షణలపై నాటి ప్రభుత్వం స్పందన కు సంబంధించిన ఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని చూసిన వారు మాత్రం మోడీ టార్గెట్ గా ఉందని అంటున్నారు. గుజరాత్ అల్లర్ల విషయంలో అప్పటి మోదీ ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించిందని బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు ఇమ్రాన్ హుసేన్ విమర్శించారు. అయితే, బ్రిటన్ ప్రధానమంత్రి రుషి సునాక్ దీనిని ఇమ్రాన్ హుసేన్ పాకిస్థాన్ సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు. అలాగే రుషి సునాక్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు. ఇద్దరి అభిప్రాయాలూ వారి వారి మూలాలకు అనుగుణంగానే ఉన్నాయి. అందుకే వాస్తవంగా ఈ డాక్యుమెంటరీలో ఏముందన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ డాక్యుమెంటరీ ని కేంద్రం నిషేధించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి.
అప్పట్లో రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నా మోదీ సర్కార్ పట్టనట్టు వ్యవహరించిందని ఏమాత్రం పట్టించుకోకపోవ డం దురదృష్టకరమని బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు ఇమ్రాన్ హుసేన్ అన్నారు. రాష్ట్రంలో ఒక వర్గాన్నిపూర్తిగా తుడిచిపేట్టే కుట్ర జరిగిందని, అప్పటి మోడీ సర్కార్ ఉదాశీనత ఆ కుట్రకు ఊతం ఇచ్చేలా ఉందన్నది ఆయన విమర్శల సారాంశం. ఇక బీబీసీ డాక్యుమెంటరీ మొదటి భాగం చూసిన వారు అది ఉద్దేశపూర్వకంగా పూర్తిగా ఏకపక్షంగా రూపొందించారని విమర్శిస్తున్నారు. ఒక దారుణానికి ప్రతిఘటనగా గుజరాత్ అల్లర్లు జరిగిన విషయాన్ని డాక్యుమెంటరీలో ఎక్కడా కనీసం ప్రస్తావన కూడా లేకపోవడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. అయితే డాక్యుమెంటరీపై బ్రిటిష్ ప్రధాని ఆ దేశ పార్లమెంటులో బ్రిటిష్ ప్రభుత్వం మారణ హెూమాలను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. అలాగే బీబీసీ గుజరాత్ అల్లర్లను చిత్రీకరించిన విధానం మోదీని దోషిగా నిలబెట్టడానికి ఏకపక్షంగా చేసిన ప్రయత్నంలా ఉందని భావిస్తున్నమని పేర్కొన్నారు.
ఈ అభిప్రాయం ఒక్క రిషి సునాక్ మాత్రమే కాదు.. బ్రిటిష్ పౌరులలో కూడా ఎక్కువ మందికూడా వ్యక్తం చేశారు. ఈ డాక్యుమెంటరీలో అప్పటి హింసా విధ్వంస కాండలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఈ హింసాకాండలో ముగ్గురు బ్రిటిష్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్యా కూడా హత్యకు గురయ్యారు. ఈ హింసాకాండ తర్వాత బ్రిటన్ ప్రభుత్వం ఈ సంఘటనలపై దర్యాప్తుకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు గుజరాత్ వచ్చి దర్యాప్తు జరిపి ఒక సమగ్ర నివేదికను అంద జేసిందని, దాని ప్రకారం ఇక్కడ అల్లర్లు జరుగుతున్నప్పుడు మోదీ ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించిందనే విషయం తేటతెల్లమయిందని డాక్యుమెంటరీలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.
అల్పసంఖ్యాక వర్గాలే లక్ష్యంగా ఇక్కడ హింసాకాండ ప్రారంభమైనందనడంలో ఎటువంటి సందేహమూ లేదని కూడా ఆ డాక్యుమెంటరీ నిర్ధారించిందని దానిని చూసిన వారు చెబుతున్నారు. అయితే ఈ అల్లర్ల వెనుక కుట్ర ఏమీ లేదని సుప్రీం కోర్టు విస్పష్టంగా తేల్చి చెప్పింది. అప్పటి అల్లర్ల వ్యవహారంలో అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ, ఆయన ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని సిట్ ఇచ్చిన నివేదికను జకియా జాఫ్రీ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై సుప్రీంకోర్టు ఈ అల్లర్లు అప్పటికప్పుడు పెట్రేగిపోయాయని, వీటి వెనుక కుట్రేమీ లేదని స్పష్టచేసింది. ఇప్పుడు గత జనవరి 17న బీబీసీ ఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని ప్రసారం చేయడం వెనుక ఏదో దురుద్దేశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.