అమిత్‌షా సాక్షిగా.. కేసీఆర్‌పై బండి సంజ‌య్ గ‌ర్జ‌న‌..

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు నిజమైన తెలంగాణ వాదులైతే వెంటనే ప్రభుత్వాన్ని కూల్చేయాలని బండి సంజయ్ సంచలన పిలుపు ఇచ్చారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా.. ప్రగతి భవన్‌కు పరిమితమైన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ బహిరంగ సభ వేదిక‌గా గులాబీ బాస్‌పై గ‌ర్జించారు బండి సంజ‌య్‌. నిర్మల్ గడ్డ పోరు గడ్డ అంటూ.. శివాజీ చేతిలో కత్తి చూడు.. అమిత్ షా సత్తా చూడు.. తల తల మెరిసే తల్వార్ చూడు.. మన సమర యోధుల వీరత్వం చూడు అంటూ బీజేపీ కేడ‌ర్‌ను ఉర్రూత‌లూగించారు బండి సంజయ్. 

వెయ్యి మందిని మర్రి చెట్టుకు ఉరి తీశారని.. ఆ వీర యోధుల ఘనత చాటి చెప్పడానికే బీజేపీ నిర్మ‌ల్‌లో ఈ సభ నిర్వహించినట్టు చెప్పారు. తెలంగాణ మొత్తం విమోచన దినోత్సవం జరుపుకుంటుంటే.. సీఎం కేసీఆర్ కనీసం జెండా ఎగురవేయకపోవడం అవమానకరం అన్నారు. వెంటనే ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 

కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుంటే.. తెలంగాణను మాత్రం కేసీఆర్ మూడు ముక్కలు చేశారన్నారు. ఒక్క ముక్క ఓవైసీ, మరో ముక్క కొడుకు, మూడో ముక్కను అల్లుడికి ఇచ్చారంటూ మండిప‌డ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని.. వారికి పెన్షన్ కూడా ఇస్తామన్నారు. 

ఎంఐఎం పార్టీ అరాచకలు రాష్ట్రంలో పెరుగుతున్నాయన్నారు. భైంసాలో ఎంతోమంది మీద దాడి చేశారన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మర్చిపోదన్నారు. విమోచన దినోత్సవం వద్దని చెప్పిన మేథావి ఎవరో చెప్పాలి.. వాడిని ఇక్కడే నిండు సభలో ఉరేసి చంపుతామంటూ బండి సంజయ్ భ‌గ్గుమ‌న్నారు. 

త్వరలోనే బీజేపీ అధికారంలోకి వస్తోందని.. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడతామన్నారు. అవినీతి చరిత్రను బయటపెడుతామని హెచ్చరించారు. కాషాయ జెండాను త్వరలోనే తెలంగాణలో ఎగురవేసే క్షణం దగ్గరలోనే ఉందన్నారు. మూర్ఖుడి చేతిలో బంధీ అయి ఉన్నానని తెలంగాణ తల్లి ఆర్తనాధాలు పెడుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ‌ తల్లికి విముక్తి కలిగించాలని బండి సంజయ్ పిలుపిచ్చారు.