మా ఇంటి నుంచీ మీ ఇంటికీ అంతే దూరం.. జగన్కు లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్..
posted on Sep 17, 2021 4:16PM
వైసీపీ దౌర్జన్యాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రతిపక్షనేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేనీ, బులుగు గూండాలని పంపావంటేనే, తాడేపల్లి కొంపలో ఎంతగా వణికిపోతున్నావో అర్థం అవుతోందంటూ లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడిని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. జగన్ రోజురోజుకూ అధఃపాతాళంలోకి దిగజారుతున్నారన్నారు. తాడేపల్లిలోని నీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరమని.. ఆ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు.
జగన్ రెడ్డి గాలి హామీలు తేలిపోయాయని.. ఒకప్పటి ఆయన ముద్దులే.. ప్రస్తుతం పిడిగుద్దుల్లా పడుతున్నాయని లోకేశ్ సెటైర్లు చేశారు. జగన్ది అంతా నాటకమనే విషయం.. జనానికి తెలిసిపోయిందన్నారు. తమ పరిస్థతిపై ఉలిక్కిపడి.. ప్రతిపక్షంపైకి రౌడీలను పంపుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు.. జగన్ లాంటి క్రూర, నేరస్వభావం కలవారు కాదని గుర్తు చేశారు. త్వరలో ఒక్కొక్కరికి.. వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.