బలాబలాలు తేల్చుకోవానికేనా అసెంబ్లీకెళ్లేది?
posted on Sep 21, 2012 6:36PM

అసెంబ్లీలో నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఒకరికొకరు ఎన్నెన్ని మాటలనుకున్నా ఫరవాలేదు. కోపంతో తిట్టుకున్నా బాధలేదు... కానీ వారి ఆవేశం అసెంబ్లీలోని బల్లలు, మైకులపై చూపిస్తేనే ఇబ్బంది. అసెంబ్లీలో తెలంగాణాపై అన్ని పార్టీలు తమ వైఖరులు చెబుతున్న నేపథ్యంలో స్పీకర్ లోక్సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్కు మైక్ ఇవ్వడం.. ఆయన బంద్లవల్ల సరైన ట్రాన్స్పోర్ట్ లేక ప్రతిరోజూ 60మంది ఉద్యోగులను ఐబిఎం కంపెనీ విమానంలో బెంగుళూరు తీసుకెళుతోందని చెప్పారు. దాంతో పక్కనేఉన్న టిఆర్ఎస్ ఎం.ఎల్.ఎ. హరీష్రావు లేచి ‘తెలంగాణాలో వందలాదిమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. దాన్ని కాదని ఐబిఎం కంపెనీ ఉద్యోగులను విమానంలో తీసుకెళ్ళిన విషయం ఇక్కడెందుకు?’ అంటూ మండి పడ్డారు. దానిపై వాగ్వివాదం జరగటంతో హరీష్ కోపంతో మైక్ను రెండుసార్లు బెంచీకేసి కొట్టారు. మరో సందర్భంలో నాగం, దానం మధ్య జరిగిన వాగ్వివాదంలో మైక్ను చేతిలోకి తీసుకుని వైర్ను చేతికి చుట్టేసుకున్నారు దానం. అంతేకాదు తన చేతిలోని సిడీని సైతం నాగంపై విసిరేందుకు ప్రయత్నించారు. ప్రజాసమస్యలపై సామరస్య, ప్రశాంతంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చించవలసింది పోయి భావితరానికి అసెంబ్లీ అంటే ఇలా చెయ్యాలేమో అన్నట్లుగా ఉంటున్నాయి గౌరవనీయులైన మన నేతల తీరు! ఇలా అసెంబ్లీ మైక్లు, బల్లలు పాడుచేస్తే.. వాటి స్థానంలో కొత్తవి పెట్టడానికి ఆయ్యే ఖర్చు ఎవరూ భరిస్తారు.? ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల సొమ్మే! ఎమ్మెల్యేల దుందుడుకుతనానికి ప్రజల సొమ్ము ఖర్చుచేయడం ఎంతవరకూ న్యాయం? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాకాకుండా అసెంబ్లీలో ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో.. వారినుండే దానికయ్యే ఖర్చును వసూలు చెయ్యాలని సూచన కూడా చేస్తున్నారు.