సిద్ధం అంటూ అంబటి రాయుడు ట్వీట్.. నిలకడేదిరా బాబూ అంటూ నెటిజనుల ట్రోల్

అంబటి రాయుడు తొందరపాటు నిర్ణయాలకూ, స్థిరత్వం లేని తీరుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడు. మాంచి ప్రతిభ గలిగిన క్రికెటర్ గా క్రీడాభిమానులకు చిరపరిచితుడైన అంబటి రాయుడు తన క్రికెట్ కెరీర్ ను తొందరపాటు నిర్ణయాలతో, దుందుడుకు పోకడలతో చేజేతులా నాశనం చేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించడానికి వేచి చూసినంత కాలం పట్లలేదు ఆ క్రికెట్ కెరీర్ కు ముగింపు పలకడానికి. ఎంత ప్రతిభ ఉన్నా అతడిలో స్థిరత్వం కొరవడటంతో కెప్టెన్ విశ్వాసం పొందలే కపోయేవాడు. ఫలితంగా క్రికెట్ కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. ఆ తరువాత ఆయన  రాజకీయ ప్రవేశం విషయంలో కూడా నిలకడలేని నిర్ణయాలు, ఎక్కడా స్థిరం లేకపోవడం, తొందరపాటు తనంతో నవ్వుల పాలయ్యాడు. క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికిన తరువాత అంబటి రాయుడు గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో అడుగులు వేశాడు. నియోజకవర్గంలో కొంత కాలం చురుగ్గా పర్యటించి, ఒకింత ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.

గుంటూరు లోక్ సభ నియోకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో ఆయన వైసీపీ గూటికి చేరాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరారు.   గుంటూరు లోక్ సభ స్థానం హామీతో ఆయన వైసీపీ గూటికి చేరారని, అయితే చేరిన రోజుల వ్యవధిలోనే అక్కడి నుంచి పోటీకి అవకాశం లేదని గ్రహించి క్షణం ఆలోచించకుండా వైసీపీ గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆ వెంటనే తాను , విదేశాలలో క్రికెట్ టోర్నీలో పాల్గొనాల్సి ఉన్నందున  రాజకీయాల నుంచి చిన్న విరామం తీసుకున్నానని ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వైసీపీ సామాజిక మాధ్యమంలో అంబటి రాయుడు తాడేపల్లిగూడెంలో జరిగి వైసీపీ సభలో పాల్గొన్న కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో అంబటిరాయుడు జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆయన జనసేన గూటికి చేరలేదు.

ఇప్పుడు హఠాత్తుగా అండటి రాయుడు బుధవారం మార్చి 27) ఉదయం సిద్ధం అంటూ ట్వీట్ చేయడం ద్వారాతాను మళ్లీ వైసీపీ గూటికి చేరనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. దీంతో అంబటి రాయుడు స్థిరం లేని నిర్ణయాలు, నిలకడ లేని తీరుపై సామాజిక మాధ్యమంలో నెటిజనులు ఓ రెంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  అయినా అంబటి రాయుడు వైసీపీలో చేరి ఆ వెంటనే రాజీనామా చేసి, మళ్లీ ఇప్పుడు పార్టీకి మద్దతుగా నిలవడం వల్ల అంబటిరాయుడికి వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు కానీ.. వైసీపీకి మాత్రం ఆయన తీరు వల్ల జనాలలో నగుబాటు అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.