ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

 

ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, పర్యటన రోడ్ మ్యాప్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌ఫోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 

ఈ సమావేశంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధాని పర్యటనను సక్సెస్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 5లక్షల మందితో భారీ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు.