పవన్ జీ.. సికింద్రాబాద్లో ప్రచారం చేయవా ప్లీజ్!
posted on Apr 19, 2014 12:46PM
వెండితెర పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్ అయ్యాడు. తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ సంబంధాలు అంతంతమాత్రంగానే వున్నప్పటికీ, ఆయన బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీన్ని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మంచి అవకాశంగా తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ని బాగా వాడుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తమ నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేస్తే తమ దశ తిరిగిపోతుందని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి కొంతమంది అడ్వాన్స్ అయిపోయి పవన్ కళ్యాణ్ని సంప్రదిస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పవన్ కళ్యాణ్ని కలిశారు.
రాజకీయంగా తనకున్న సుదీర్ఘ అనుభం గురించి, దేశానికి తాను చేసిన సేవ గురించి పవన్ కళ్యాణ్కి వివరించిన దత్తాత్రేయ ఈ ఎన్నికలలో సికింద్రాబాద్కి వచ్చి తనకు ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని, వయసు కూడా పైబడిందని, అందువల్ల తనమీద కాస్తంత అభిమానం చూపించి తనకు ప్రచారం చేయాల్సిందిగా దత్తాత్రేయ పవన్ని కోరినట్టు సమాచారం.
మిగతా అభ్యర్థుల మాదిరిగా డబ్బు వెదజల్లే అవకాశం తనకి లేదని, అంతేకాకుండా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా తన గెలుపుకి సహకరించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో తమరే నన్ను కాపాడాలని పవన్ని దత్తాత్రేయ కోరినట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఏ విషయం తర్వాత చెబుతానని దత్తాత్రేయతో అన్నట్టు తెలుస్తోంది.