కడపలో కుటుంబం హత్య
posted on Oct 7, 2014 12:56PM
.jpg)
కడప నగరంలో ఏడాది క్రితం మాయమైన ఓ కుటుంబం మొత్తం హత్యకు గురైనట్లు తెలుస్తోంది. శాంతి సంఘం కడప జిల్లా అధ్యక్షుడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్, ఆయన కుమారుడు కృపాకర్, కోడలు మౌనికతోపాటు ముగ్గురు పిల్లలు ఏడాది క్రితం మాయమయ్యారు. ఈ ఆరుగురూ హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను వారి స్కూలు ఆవరణలోనే పాతిపెట్టారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ అయిన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం జియోన్ స్కూలు ఆవరణలో తవ్వకాలు జరపగా కుటుంబం మొత్తం ఐదు అస్థిపంజరాలు బయటపడ్డాయి. చనిపోయిన కుటుంబ పెద్ద రాజారత్నం ఐజక్కు కడప నగరంలో మంచి పేరుంది. నగర ప్రముఖులు అందరితో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. సభలు, సమావేశాలలో ఆయన ఎక్కువగా పాల్గొంటూ వుండేవారు. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన విషయంలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అన్ని ప్రశ్నలకు పోలీసులు బుధవారం నాడు సమాధానం చెప్పే అవకాశాలున్నాయి.