వంద రూపాయల కోసం పాప ప్రాణం తీసిన వార్డు బాయ్! నీలోఫర్ హాస్పిటల్ లో దారుణం..

సమాజంలో మానవత్వం నశించిపోతోంది. మంచి మనసున్నవాడు కనపడకుండా పోతున్నాడు. మనుషులకు డబ్బే ప్రధానంగా మారిపోతోంది. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నాడు. సొంత మనుషులను కూడా పట్టించుకోవడం లేదు. ప్రాణాలు తీయడానికి కూడా తెగబడుతున్నారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతుండగా.. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. వంద రూపాయల కోసం ఓ మూర్ఖుడు పసిపాప మరణానికి కారణమయ్యాడు.  హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ లో ఈ దారుణం జరిగింది. వంద రూపాయల కోసం పసిపాస ప్రాణం తీశాడు వార్డు బాయ్.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పాపను నీలోఫర్ లో అడ్మిట్ చేశారు. అయితే ఆక్సిజన్ పెట్టడానికి వార్డు బాయ్ వంద రూపాయలు లంచం అడిగారు. కాని పాప తల్లిదండ్రులు ఇవ్వలేకపోయారు. దీంతో పాపకు అమర్చాల్సిన ఆక్సిజన్ సిలిండర్ ను డబ్బులు ఇచ్చిన మరో పాపకు అమర్చాడు. దీంతో ఆక్సిజన్ అందక పాప ప్రాణాలు కోల్పోయింది.  వార్డు బాయ్ వల్లే తమ పాప చనిపోయిందని పేరేంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  ఆక్సిజన్ సిలిండర్‌ను సకాలంలో అమర్చకపోవడంతో పాప చనిపోవడం  నీలో ఫర్ హాస్పిటల్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి తీవ్రంగా స్పందించారు. సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులను మందలించారు. దీంతో పాప చావుకు కారణమైన వార్డు బాయ్‌ను సస్పెండ్ చేశారు నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్. 

హుజురాబాద్ లో ఈటలదే విజయం.. ఎగ్జిట్ పోల్స్ లో కమల వికాసం

తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ముందు నుంచి ఊహించినట్లే భారీగా పోలింగ్ జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో 84 శాతం పోలింగ్ జరగగా... ఈసారి అంతకన్నా ఎక్కువగానే పోలింగ్ జరిగింది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో పార్టీల్లో టెన్షన్ కనిపిస్తోంది. పోలింగ్ సరళని బట్టి తమ గెలుపు అవకాశాలపై అంచనాలు వేసుకుంటున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీదే విజయమని తేలింది. ప్రముఖ ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలన్నీ ఈటల వైపే ఓట్లు మొగ్గు చూపాయి. మెజార్టీ సర్వేలు ఈటల గెలుస్తాడని చెప్పగా.. ఒక సర్వే మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చింది. కొన్ని సర్వేల్లో హోరాహోరీ కనిపించింది. భారీ ఓటింగ్ ఆయనకే కలిసొచ్చినట్లు కనిపిస్తున్నది.  హుజురాబాద్ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. మూర్తి ఆత్మసాక్షి గ్రూపు హైదరాబాద్ బీజేపీ 50.05 శాతం టీఆర్ఎస్ 43.01 శాతం కాంగ్రెస్ 5.7 శాతం ఇతరులు 0.7శాతం మిషన్ చైతన్య.. బీజేపీ 58.42శాతం టీఆర్ఎస్ 32.29 శాతం కాంగ్రెస్ 16.32 శాతం ఇతరులు 2.97శాతం కౌటిల్య సొల్యూషన్స్ బీజేపీ 47శాతం టీఆర్ఎస్ 40 శాతం కాంగ్రెస్ 8 శాతం ఇతరులు 5శాతం పొలిటికల్ ల్యాబొరేటరీ బీజేపీ 51శాతం టీఆర్ఎస్ 42 శాతం కాంగ్రెస్ 2నుంచి 3 శాతం విదుర రీసెర్చ్ ఏజెన్సీ నాగన్న ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 42.90 నుంచి 45.50 శాతం టీఆర్ఎస్ 45.30 నుంచి 48.9 శాతం కాంగ్రెస్ 2.25 నుంచి 4 శాతం ఇతరులు 5.51 నుంచి 6.50 శాతం

మ‌ళ్లీ స‌మైక్యాంధ్ర‌.. రాజుకుంటున్న‌ రాజ‌కీయ‌ ర‌చ్చ..

నిప్పు లేనిదే పొగ రాదు. ముందు చిన్న‌గా నిప్పు పెడ‌తారు. ఆ త‌ర్వాత పొగ బ‌య‌ట‌కు వ‌స్తుంది. దాన్ని ఊది ఊది అగ్గి రాజేస్తారు. ఆ రాజ‌కీయ‌ మంట‌లో చ‌లి కాచుకుంటారు. ఇక కుంప‌టి కార్చిచ్చులా వ్యాపిస్తుందో.. లేక‌, చ‌ప్పున చ‌ల్లారుతుందో తెలీదు కానీ.. ఆలోగా జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోతుంది. అదే రాజ‌కీయం. ఏపీ-తెలంగాణ‌లో ఇప్పుడ‌దే జ‌రుగుతోంద‌ని అంటున్నారు.  కేసీఆర్ ఓ మాట‌న్నారు. దానికి ఏపీ మంత్రి పేర్ని నాని మ‌రింత ఎగ‌దోశారు. ఆ అవ‌కాశాన్ని రేవంత్‌రెడ్డి స‌రిగ్గా అందిపుచ్చుకున్నారు. ఇక‌, కాంగ్రెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఆ అగ్గి మీద గుగ్గిలం వేశారు. ఇక అంతే. స‌మైక్యాంధ్రపై రాజకీయ ర‌చ్చ మొద‌లైపోయింది. రెండు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ డిబేట్ న‌డుస్తోంది.  "కేసీఆర్‌, జగన్‌రెడ్డి మొదటి నుంచీ కవలల్లా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆమె పాదయాత్రలో విజయమ్మ పాల్గొనడం, టీఆర్ఎస్‌ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, ఏపీలో పార్టీ పెట్టమని కోరుతున్నారంటూ కేసీఆర్‌ అనడం, ఏపీ మంత్రి పేర్ని నాని.. రెండు రాష్ట్రాలు కలిసిపోతే పోలా అనడం, ఆయన వ్యాఖ్యలను కేసీఆర్‌, టీఆర్ఎస్‌ మంత్రులు ఖండించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జగన్‌ జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని ఆయన సొంత పార్టీ నేతలే అంటున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్‌ అనుకుంటున్నట్లుంది. రాజ్య విస్తరణ, అక్కడి అపారమైన ఖనిజ సంపదపై కేసీఆర్‌ కన్నేసి ఉండొచ్చు’’ అని రేవంత్‌రెడ్డి చేసిన‌ ఆరోపణ‌లు సంచ‌ల‌నంగా మారాయి. నిజ‌మేనా..? అనిపించేలా ఉన్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు, జ‌రుగుతున్న విష‌యాల‌కు కాస్త పొంత‌న కుదురుతుండ‌టంతో.. తెర‌వెనుక స‌మైక్యాంధ్ర పావులు క‌దులుతున్నాయా? అనే అనుమానం బ‌ల‌ప‌డుతోంది. ఆ చ‌ర్చ‌ను మ‌రింత బ‌ల‌ప‌రిచేలా తాజాగా కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  సీఎం కేసీఆర్‌ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఉద్యమ సమయంలోనూ సమైక్య వాదాన్నే వినిపించా. ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో నేను అన్నట్టుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ కేసీఆర్‌, పేర్ని నాని వ్యాఖ్య‌ల‌ను ఉంటంకించారు జ‌గ్గారెడ్డి.  జ‌గ‌న్ జైలుకెళ్తే.. రెండు రాష్ట్రాల‌ను క‌లిపేస్తే.. గ‌తంలో ఏపీ ఆధిప‌త్యంలో తెలంగాణ ఉన్న‌ట్టు.. ఇప్పుడు తెలంగాణ నేత‌లు ఏపీని గుప్పిట్లోకి తీసుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోందా? అనే చ‌ర్చ రేవంత్‌రెడ్డి మాట‌ల త‌ర్వాత మొద‌లైంది. అయితే, స‌మైక్యాంధ్ర ర‌చ్చ ఇప్పుడే మొద‌లైనా.. ముందుముందు ఇది ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందోన‌నే టెన్ష‌న్ అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. మ‌ళ్లీ తెలుగురాష్ట్రాల్లో ఉద్య‌మాలు, తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌ప్ప‌వా? ఈ రాజ‌కీయ ర‌చ్చ‌..రొచ్చుగా మారుతుందా? ఏమో...

ఎంపీలకు మోడీ సర్కార్ మరో షాక్..ఈసారి ఏం కట్ చేశారంటే? 

ఆర్థికశాఖలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న బీజీపీ ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఎయిర్ ఇండియాలో ఎంపీలకు ఫ్రీ విమాన టికెట్లను రద్దు చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ బిడ్డింగ్ లో దక్కించుకున్న  తర్వాత కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా సంస్థకు అప్పగించేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ఈ కసరత్తులో భాగంగా అన్ని బకాయిలను ముందుగానే క్లియర్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలు విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా విమాన టికెట్లను డబ్బు చెల్లించి కొనాలని కూడా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థగా ఎయిర్ ఇండియా ఉండటంతో ఎంపీలకు ఉచితంగా టికెట్ ప్రొటోకాల్ అమలయ్యేది. ఇప్పుడు ప్రైవేటు సంస్థగా  ఎయిర్ ఇండియా మారడంతో ఎంపీలు విమాన టికెట్లను ఉచితంగా పొందలేరని డబ్బులు పెట్టి కొనాలని రాజ్యసభ సచివాలయం శుక్రవారం వెల్లడించింది. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఉచిత టికెట్  సదుపాయం కూడా రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తాజా నిర్ణయం ప్రకారం ఎంపీలు తమ డబ్బులతో టికెట్లు కొనుగోలు చేసి తర్వాత పార్లమెంటు సచివాలయానికి రీఎంబర్స్ మెంటుకు దరఖాస్తు చేసుకోవాలి.  ఎంపీలకు మరికొన్ని కోతలు పెట్టింది మోడీ సర్కార్. కేంద్రియ విద్యాలయాల్లో ఎంపీల కోటాను కట్ చేసింది. ఇప్పటివరకు ఎంపీలకు 10 శాతం రిజర్వేన్ ఉండేది. ఇది సరిపోకపోతే కేంద్రమంత్రి విచక్షణతో ఎంపీలు మరిన్ని సీట్లను తీసుకునేవారు. ఇపుడు ఆ రిజర్వేషన్ ప్రక్రియను కూడా కేంద్రం రద్దు చేసేసింది. ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ ఫండ్లను కూడా నిలిపేసింది. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఏటా ప్రతి ఎంపీకి కేంద్రం రు. 5 కోట్లను మంజూరు చేస్తోంది. అయితే కొన్ని చోట్ల ఈ ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ రిలీజ్ ను కేంద్రం ఫ్రీజ్ చేసేసింది. పార్లమెంటు క్యాంటిన్ లో దొరికే ఆహారం ధరలు బాగా పెంచేసింది.

చంద్రబాబు ఉగ్రరూపం.. రఘురామ సంచలనం.. హుజురాబాద్ ఎవరిది?.. టాప్ న్యూస్@7PM

కుప్పంకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సామగుట్టపల్లిలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా హంద్రీనీవా పూర్తి చేయడం లేదన్నారు. ట్రూ అప్ చార్జీల పేరిట ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. నకిలీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజాసంపద దోచుకోవడమే తప్ప..ప్రజలపై ప్రేమ లేదని తప్పుబట్టారు.  --- సీబీఐలో ఏ ఆఫీసర్ ఎక్కడ ఉండాలో విజయసాయి చూస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సీబీఐ, ఈడీ అధికారులతో విజయసాయి నిరంతరం మంతనాలు చేస్తున్నారని చెప్పారు. సీబీఐ లాయర్‌గా సుభాష్ నియామకం వెనుక విజయసాయి పాత్ర ఉందన్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో అనుకూల అధికారుల నియామకం జరిగేలా విజయసాయి చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఒంటిమీద చేయి వేయకూడదన్నారు.  ------------ రాష్ట్రంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు లైన్ క్లియరైంది. రైతుల పాదయాత్రకు 20 షరతులతో డీజీపీ సవాంగ్ అనుమతి ఇచ్చారు.  హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. గుంటూరు అర్బన్‌, రూరల్‌, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్‌ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ----- వర్ధన్ బ్యాంకులో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్ధన్ బ్యాంకులో ఒక్క రూపాయి వాటా లేదని తెలిపారు. వాటా ఉన్నట్లు నిరూపిస్తే గొంతు కోసుకుంటానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాటలకు విలువ లేదని చెప్పారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బుడ్డా వంశమని శిల్పా చక్రపాణిరెడ్డి ధ్వజమెత్తారు. -- కర్నూలు జిల్లాలోని నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో రసాభసా ఏర్పడింది. పట్టణంలోని నీటి సమస్యపై చర్చించే విషయంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రోజూ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేసారు.  ------ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు,  కొనుగోలు కేంద్ర బాధ్యులు, రైతు బంధు సమన్వయ సమితి సభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్య కొనుగోలును అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక సవాలుగా తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. --------  నాదెప్పుడు ప్రజల లైన్.. ప్రజలు బాగుండాలనే నేను కోరుకుంటా"అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మీడియాలనో సమైక్య రాష్ట్రంగా ఉండాలంటే తాను అంటే తనను తప్పుపట్టారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అందరూ అదే మాట్లాడుతున్నారన్నారు. ఇది ఎన్నికల కోసం టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ ఆడుతున్న డ్రామా అని జగ్గారెడ్డి ఆరోపించారు. ---------- జాతీయ పార్టీ అయిన బీజేపీ మతతత్వ పార్టీ అని వైఎస్సాఆర్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల ఆరోపించారు.ప్రజలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకొనే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు చేసినవాళ్ళు హమాలీలుగా పని చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు.  తల ఎత్తుకొని తిరగలేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. అయినా సీఎం కేసీఆర్‌లో చలనం లేదన్నారు. ------- కాంగ్రెస్‌తో సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారంనాడు తోసిపుచ్చారు. మెత్రీ సంబంధాల పునరుద్ధరణకు సమయం దాటిపోయిందని ఆయన అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీని స్థాపించనున్నట్టు కెప్టెన్ ఇటీవల ప్రకటించారు. ----- ప్రజలతో రాజకీయ నేతలు సన్నిహిత సంబంధాలు ఎలా నెరపాలి? నేరుగా వారికి వద్దకే వెళ్లి కలవాలంటే ఏమి చేయాలి?. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇందుకు ఒక ఉదాహరణగా నిలిచారు. గోవా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ శనివారంనాడు గోవాలో పర్యటించారు. నేరుగా మత్స్యకారులు నివసించే గ్రామానికే వెళ్లి వారిని పలకరించారు. ---- 

ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్.. హుజురాబాద్ లో గెలిచేది ఎవరంటే..!

తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడటం, పోటాపోటీగా డబ్బులు ఖర్చు చేయడంతో హుజురాబాద్ బైపోల్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. జూన్ లో మొదలైన హుజురాబాద్ రాజకీయ హీట్.. శనివారం జరిగిన పోలింగ్ తో చల్లారింది. అయితే పోలింగ్ ముగియడంతో ఇప్పుడు విజయం ఎవరిది అన్నది ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీగా సాగిన హుజురాబాద్ పోరులో ఎవరూ గెలుస్తారన్నదానిపై వేల కోట్ల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం పార్టీలను భయపెడుతోంది. పోలింగ్ సరళీని బట్టి పార్టీల తమ విజయవకాశాలపై అంచనాలు వేసుకుంటున్నాయి.  హుజురాబాద్ ఉప ఎన్నికలో 35 మంది బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్యే సాగింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతుకుంట, కమలాపూర్ మండలాలు ఉన్నాయి. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలుగా ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల ఓట్లు ఉండగా.. వీళ్ల కోసం 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ దాదాపు 80 శాతం కావడంతో మొత్తంగా లక్షా 80 వేల వరకు ఓట్లు పోలయ్యాయి. దీంతో మండలాలు, గ్రామాలు, పోలింగ్ కేంద్రాల లెక్కన తమకు ఎన్ని ఓట్లు వచ్చాయో అంచనా వేసుకుంటున్నారు అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారన్న దానిపై పోలింగ్ రోజున తెలుగువన్ బృందం సర్వే నిర్వహించింది. ఓటర్ల నాడిని పట్టింది. ముందు నుంచి సాగినట్లే  పోలింగ్  రోజు కూడా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరాటం హోరాహోరీగానే నడిచినట్లు కనిపించింది. హుజురాబాద్ మండలంలో బీజేపీకి కొంత ఆధిక్యత వస్తుందని సర్వేలో తేలింది. హుజురాబాద్ పట్టణంలో బీజేపీకి పూర్తిగా సానుకూలత కనిపించింది. ఉద్యోగులు, విద్యావేత్తలు, యువత ఈటలకు సపోర్టుగా నిలిచారు.  హుజురాబాద్ రూరల్ మండలంలో మాత్రం రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఓవరాల్ గా హుజురాబాద్ మండలంలో బీజేపీకి లీడ్ రానుందని సర్వేలో స్పష్టమైంది. హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన జమ్మికుంట మండలంలో పోలింగ్ భారీగా నమోదైంది. జమ్మికుంట మొదటి నుంచి టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది. గతంలో ఈటలకు ఇక్కడే భారీ మెజార్టీ వచ్చేంది. దీంతో ఇక్కడ ఈసారి కూడా  టీఆర్ఎస్ కు లీడ్ వస్తుందని అంతా భావించారు. కాని పోలింగ్ లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జమ్మికుంట పట్టణంలో బీజేపీకి లీడ్ కనిపించింది. జమ్మికుంట రూరల్ లో కారుకు స్వల్ప ఆధిక్యత రావచ్చు. మొత్తంగా జమ్మికుంట మండలంలో రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉండే అవకాశం ఉంది. వీణవంక మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటలకు మంచి లీడ్ వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత మండలం అయినప్పటికి వీణవంక మండలంలో ఈటల రాజేందర్ కు క్లియర్ మద్దతు కనిపించింది. గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హిమ్మత్ నగర్ లోనూ ఈటలకు మద్దతు కనిపించింది. అంతేకాదు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ గెల్లు సొంతూరులోనే ఓటర్లు ఆందోళనకు దిగడం అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేసింది. ఇల్లంతకుండ మండలంలో మాత్రం టీఆర్ఎస్ కు కొంత లీడ్ వస్తుందని సర్వేలో స్పష్టమైంది.  ఇక ఈటల రాజేందర్ సొంత మండలం కమలాపూర్ లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. కమలాపూర్ తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కమలానికి ఓటర్లు జైకొట్టిన పోలింగ్ రోజున తేలింది. కమలాపూర్ మండలం తమకు టఫ్ గా ఉండటంతో టీఆర్ఎస్ నేతలు ఇక్కడే ఎక్కువ ఫోకస్ చేశారు. ఓటర్లకు డబ్బులు కూడా బాగా పంపిణి చేశాయి. అయితే పోలింగ్ రోజున మాత్రం ఓటర్లు మనీ కంటే సెంటిమెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమైంది. కమలాపూర్ మండలంలో ఈటలకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని తెలుగువన్ సర్వేలో తేలింది. పోలింగ్ సరళిని భట్టి హుజురాబాద్ ఉప సమరంలో బీజేపీ అభ్య్రర్థి ఈటల రాజేందర్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు టీఆర్ఎస్ పై 10 నుంచి 15 శాతం వరకు ఓట్ల మెజార్టీ రావచ్చొని తెలుగువన్ సర్వేలో స్పష్టమైంది.అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణి చేసినా.. ఈటలపై ఉన్న సానుభూతి ముందు నిలవలేదని స్పష్టమైంది. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు పంచిన డబ్బులు ఓటర్లకు అందలేదు. దీంతో వాళ్లంతా ఓపెన్ గానే ఈటలకు మద్దతు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ ను తిట్టుకుంటూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం కనిపించింది. పోలింగ్ సరళిని అంచనా వేసిన కమలం నేతలు సంతోషంలో ఉండగా... మధ్యాహ్నానికే కారు పార్టీ లీడర్లు ఢీలా పడిపోయారు.

థ‌ర్డ్‌వేవ్‌ అల‌ర్ట్‌.. వ్యాక్సిన్ వేసుకున్నా వైర‌స్‌.. డెల్టాకంటే డేంజ‌ర‌స్‌ వేరియంట్ AY 4.2

క‌రోనా లేదు పాడూ లేదు. ఫుల్ టూ బిందాస్‌. ఎందుకైనా మంచిద‌ని మాస్క్ ఒక్క‌టి మెడ‌కు వేలాడ‌దీస్తున్నారు. ఎవ‌రైనా తుమ్మిన‌ప్పుడు మాత్ర‌మే ముక్కు మీద‌కు మాస్క్ లాగుతున్నారు. లేదంటే లేదు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. గుస‌గుస‌లు పెట్టుకుంటున్నారు. షేరింగ్‌లు.. చుమ్మాలు.. అంతా కామ‌న్‌. అచ్చం మామూలు రోజుల్లా.. క‌రోనా అనేదే లేద‌న్న‌ట్టుగా జీవించేస్తున్నారు జ‌నాలు. కానీ, ఓవైపు చ‌లికాలం స్టార్ట్ అవుతోంది.. మ‌రోవైపు పాజిటివ్‌ కేసుల్లో క‌ద‌లిక వ‌స్తోంది. ఇంకోవైపు కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. గ‌తంలో సెకండ్ వేవ్‌కు ముందున్న ప‌రిస్థితే ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. రానున్న‌ థ‌ర్డ్ వేవ్‌కు సింబాలిక్‌గా.. విదేశాల్లో క‌రోనా మార‌ణ‌హోమం మొద‌లైపోయింది. అమెరికా, యూర‌ప్‌, ర‌ష్యా, సింగ‌పూర్.. ప్ర‌పంచ దేశాల‌న్నీ పాజిటివ్ కేసుల‌తో బెదిరిపోతున్నాయి. డెల్టా కంటే డేంజ‌ర‌స్ వేరియంట్ ఏవై 4.2 విజృంభిస్తోంది. తాజాగా, మ‌న దేశంలోనూ అందులోనూ తెలంగాణ‌లోనూ ఏవై 4.2 కేసులు క‌నిపించ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.  తెలంగాణ‌లో 48 ఏళ్ల వ్య‌క్తి, 22 ఏళ్ల యువ‌తికి డెల్టా ఏవై 4.2 ర‌కానికి చెందిన క‌రోనా వైర‌స్ సోకింద‌ని తెలుస్తోంది. అయితే, వైద్య అధికారులు ఈ విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచుతున్నార‌ని అంటున్నారు. ఏవై 4.2 వేరియంట్ వైర‌స్సే ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌ను చుట్టేస్తోంది. మూడోవేవ్‌కు ముంద‌స్తు సిద్ధం చేస్తోంది. ఏవై 4.2 అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెబుతున్నారు. డెల్టా వేరియంట్‌లోని 60 ర‌కాల్లో ఇది ఒక‌ట‌ని, ఇది డెల్టా సాధార‌ణ వేరియంట్ కంటే 15 శాతం వేగంగా విస్త‌రించే ప్ర‌మాదం ఉంద‌నేది నిపుణుల ఆందోళ‌న‌. తెలంగాణ‌తో పాటు ఏపీ, క‌ర్ణాట‌క‌లోనూ ఈ కొత్త వేరియంట్‌ వెలుగు చూసింద‌ని తెలుస్తోంది.  రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్న వారికీ ఈ వైర‌స్ వ‌దిలిపెట్ట‌డం లేదంటున్నారు. వ్యాక్సిన్‌కు విరుగుడు మంత్రంతో వ‌చ్చిందీ ఏవై 4.2 వేరియంట్‌. సింగ‌పూర్‌లో అదే జ‌రుగుతోంది. ఆ దేశంలో 84శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోగా.. అందులో 14శాతం మంది బూస్టర్ డోస్‌లు కూడా పూర్తి చేసుకున్నారు. అయినా సింగ‌పూర్‌లో రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. తాజాగా ఒక్క‌రోజులోనే నాలుగువేలకు పైగా కొత్త‌ కేసులు నమోదవ‌గా.. 16 మంది కొవిడ్‌తో చ‌నిపోయారు. ఇక‌, ర‌ష్యాలో కొత్త వేరియంట్ బీభ‌త్సం మామూలుగా లేదు. రోజూ ల‌క్ష‌లాది కేసులు వ‌స్తుండ‌టం.. అందులో చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్న‌వారే కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఏవై 4.2 వేరియంట్ వ్యాక్సిన్‌ను త‌ట్టుకొని మ‌రీ విస్త‌రిస్తుండ‌టం.. పొంచిఉన్న మూడో వేవ్ ముప్పుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. అందుకే, భార‌తీయులారా.. బీ కేర్‌ఫుల్‌.. క‌రోనా ఎక్క‌డికీ పోలేదు.. మ‌న మ‌ధ్య‌నే పొంచి ఉండి.. మ‌రింత ప‌దునుగా రాటుదేలుతోంది. సో, మాస్కులు, సోష‌ల్ డిస్టెన్స్ మ‌రిచిపోవ‌ద్దు. జాగ్ర‌త్తే క‌రోనా నుంచి ర‌క్ష‌. లేదంటే.. అస‌లే శీతాకాలం.. ఎప్పుడైనా క‌రోనా కుమ్మేయ వ‌చ్చు.. థ‌ర్డ్ వేవ్ చుట్టేయ వ‌చ్చు..

భార‌త్‌కు పాక్ మ‌రో షాక్‌.. కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబ‌ర్‌..

బాబ‌ర్ అజామ్‌. పాకిస్తాన్ కెప్టెన్‌. ఈ పేరు అంద‌రికంటే ఇండియన్స్‌కే ఎక్కువ గుర్తుంటుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన ఘ‌నుడు. వాడు మామూలుగా ఆడ‌టం లేదు. ర‌న్స్‌తో పాటు రికార్డ్సూ కొల్ల‌గొడుతున్నారు. వ‌రుస విజ‌యాల‌ను ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా, భార‌త్‌కు మ‌రో షాక్ ఇచ్చాడు ఈ పాక్ కెప్టెన్‌. టీమిండియా సూప‌ర్ స్టార్ కోహ్లీ రికార్డుతో పాటు భార‌తీయుల గుండెల‌నూ బ్రేక్ చేశాడు బాబ‌ర్‌. తాజాగా, ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచి.. గ్రూప్-2 లో వరుసగా మూడు విక్ట‌రీల‌తో దూసుకుపోతోంది. ఆ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 51 పరుగులు పూర్తి చేసి టీ20 క్రికెట్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆట‌గాడిగా నిలిచాడు. కోహ్లీని దాటేశాడు. 26 ఇన్నింగ్స్‌ల‌తో బాబ‌ర్ 1000 ర‌న్స్ కంప్లీట్ చేశాడు. దీంతో 30 ఇన్నింగ్స్‌లో వెయ్యి ప‌రుగుల‌తో కోహ్లీ పేరున ఉన్న రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టాడు బాబ‌ర్‌.  ఇక‌, కోహ్లీ త‌ర్వాత స్థానంలో.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ (31 ఇన్నింగ్సుల్లో), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (32 ఇన్నింగ్సుల్లో), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (36 ఇన్నింగ్సుల్లో) నిలిచారు.  అటు.. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా టీ20ల్లో రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ర‌షీద్‌ఖాన్ త‌ర్వాతి పొజిష‌న్లో.. శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగపై 76 (ఇన్నింగ్సుల్లో), న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ (82 ఇన్నింగ్సుల్లో), బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ (83 ఇన్నింగ్సుల్లో) ఉన్నారు. ఇక‌, రషీద్ ఖాన్ వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పటికే రికార్డు నెలకొల్పాడు. వ‌న్డేల్లో 44 ఇన్నింగ్సుల్లోనే ర‌షీద్‌ ఈ రికార్డు నెలకొల్పాడు.   ఇలా, బ్యాటింగ్‌లో పాకిస్తాన్ నుంచి బాబ‌ర్‌.. బౌలింగ్‌లో అఫ్ఘ‌నిస్తాన్ త‌ర‌ఫున ర‌షీద్‌ఖాన్‌.. ఇలా అండ‌ర్ డాగ్ టీమ్‌లుగా ప‌రిగ‌ణించే జ‌ట్ల నుంచి ఇలా ప్ర‌పంచ అత్యుత్త‌మ ఆట‌గాళ్లు ఉండ‌టం విశేషం.   

బిగ్ బ్రేకింగ్ : ఈటల రాజేందర్ వాహనాలు సీజ్.. పీఆర్వో అరెస్ట్

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడుతున్నారు. డబ్బులు పంచుతున్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించుకుంటున్నారు. దీంతో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి.  బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు పోలీసులు షాకిచ్చారు.హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఈటల కాన్వాయ్‌లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేసి, పీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. అంతకుముందు  ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పదుల సంఖ్యలో కార్యకర్తలతో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్నారని ఆరోపించింది.   

జ‌గ‌న్ ఆట‌క‌ట్టిస్తా.. ప్ర‌భుత్వంపై తిరుగుబాటుకు చంద్ర‌బాబు పిలుపు..

వైసీపీ నాయ‌కుల ఆట‌క‌ట్టిస్తానంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పన్నులతో దోచుకుంటున్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమను హస్తగతం చేసుకొని వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని మండిప‌డ్డారు చంద్ర‌బాబు.  సొంత నియోజకవర్గమైన‌ కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన జోరుగా కొన‌సాగుతోంది. తొలుత లక్ష్మీపురంలో పార్టీ జెండాను ఆవిష్కరించి.. అక్కడి నుంచి వరదరాజస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. మ‌ధ్య‌లో స్థానికుల‌తో క‌లిసి మాట్లాడారు. వారి స‌మ‌స్య‌లు విన్నారు. ప్ర‌భుత్వ పాల‌నా తీరుపై టీడీపీ అధినేత‌కు ఫిర్యాదులు చేశారు స్థానిక ప్ర‌జ‌లు.  అనంత‌రం భారీ ర్యాలీ నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. వైసీపీ పాలనలో రౌడీయిజం పెరిగిందని మండిపడ్డారు. ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయింద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరెంటు ఛార్జీలు.. ఆర్టీసీ ఛార్జీలు.. ప‌థ‌కాల్లో కోత విధిస్తోంద‌ని చంద్రబాబు మండిపడ్డారు.  

జ‌గ‌న్‌కు సీబీఐకు ఒకే లాయ‌ర్‌.. డైరెక్టర్‌కు రఘురామ ఫిర్యాదు..

అరాచకాలకు కేరాఫ్ వైసీపీ సర్కార్ అనే విమర్శ ఉంది. జగన్‌రెడ్డి ప్ర‌భుత్వం తీసుకున్న ప్ర‌తీ నిర్ణ‌య‌మూ వివాదాస్ప‌దం అవుతోంది. అస‌లు జ‌గ‌న్‌కు రాష్ట్రాన్ని పాలించే హ‌క్కే లేదంటూ.. బెయిల్‌పై బ‌య‌ట ఉంటున్న ముఖ్య‌మంత్రిని మ‌ళ్లీ జైలుకే త‌ర‌లించాలంటూ ఎంపీ ర‌ఘురామ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్న‌ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జ‌గ‌న్‌కు ప‌రోక్షంగా సాయ‌ప‌డుతున్న‌ సీబీఐ తీరును త‌ప్పుబ‌డుతున్నారు ర‌ఘురామ‌. జ‌గ‌న్‌-సీబీఐ స‌హ‌కారంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గానే.. మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. జ‌గ‌న్‌రెడ్డి-వైసీపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున కేసులు వాదించే న్యాయ‌వాది పి.సుభాష్‌ను.. సీబీఐ సైతం త‌మ లాయ‌ర్‌గా నియ‌మించుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సీబీఐ తీరును ఎంపీ ర‌ఘురామ తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ఆ నిర్ణ‌యంపై నేరుగా సీబీఐ డైరెక్ట‌ర్‌కు లేఖ రాశారు.  జగన్మోహన్‌రెడ్డి తరపు న్యాయవాది పి.సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడాన్ని త‌ప్పుబ‌డుతూ సీబీఐ డైరెక్ట‌ర్‌కు లేఖ రాశారు ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు. న్యాయవాది పి.సుభాష్... జగన్ అక్రమాస్తుల కేసులను వాదించారని తెలిపారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య, డాక్టర్ సుధాకర్ అనుమానాస్పద మృతి సహా, వైసీపీ నేతలు న్యాయమూర్తులను దూషించడంపై కూడా సీబీఐ విచారణ జరుపుతోందన్నారు. ఇలాంటి విచారణ నేపథ్యంలో సీబీఐ తరపున పి.సుభాష్‌ను స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించడం సీబీఐపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోందన్నారు ర‌ఘురామ‌.  న్యాయమూర్తులపై దూషణల కేసును నేరుగా పర్యవేక్షణ చేయమని హైకోర్టు సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తరపున పని చేసిన న్యాయవాదిని సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ నియమించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు కోసం సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా పి.సుభాష్‌ని తొలగించాలని లేఖ‌లో డిమాండ్ చేశారు ర‌ఘురామ‌.   

ఓటుకు నోట్లు.. దొంగ ఓట్లు! ఉప ఎన్నికల్లో అధికార పార్టీల బరి తెగింపు..

ఉప ఎన్నికలు జరుగుతోంది ఒక్క ఏపీ, తెలంగాణలో మాత్రమే కాదు. ఒక్క బద్వేల్, హుజూరాబాద్  అసెంబ్లీ నియోజక వర్గాలలో మాత్రమే కూడా కాదు. దేశం మొత్తంలో మరో 27 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలకు కూడా ఇదే రోజున ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో,  ఎన్నికల జరుగతున్న తీరుకు, ఇతర రాష్ట్రాలలో ఎన్నికల తీరుకు పొంతన కుదరడం లేదు.  తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి రాను రాను రాజు గుర్రం గాడిద అయ్యింది అన్నట్లుగా ప్రజాస్వామ్య ప్రమాణాలు పతనమవుతున్నాయి. హుజూరాబాద్ లో సుమారు మూడు నెలలకు పైగా సాగిన ఎన్నికల జాతరలో ఇటు పార్టీలు, అటు ప్రభుత్వం కూడా వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. రెండున్నర సంవత్సరాల పదవీ కాలం కోసం ప్రధాన పార్టీలు రెండూ రెండున్నర మూడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం చివరకు ఓటుకు ఆరు నుంచి పదివేల రూపాయల వరకు ఓటర్లకు ఇవ్వడం ... డబ్బులు ముట్టని ఓటర్లు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడం, ఇవన్నీ,తెలుగు రాష్ట్రాలలో దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలకు సంకేతంగా నిలుస్తున్నాయి. పతనమవుతున్న ప్రజాస్వామ్య విలువలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక సజీవ తార్కాణంగా  నిలుస్తుందంటున్నారు.  ఇంతకాలం  పోలింగ్ కు ముందు ఓటర్లకు డబ్భులు పంచడం ఒక సంప్రదాయంగా మాత్రమే ఉంది. కానీ, ఇప్పుడు, ఓటర్లు రోడ్డు మీదకు వచ్చి ఓటుకు రేటు డిమాండ్ చేస్తున్నారు. అంటే అది హక్కుగా భావించే స్థితికి పరిస్థితి దిగజారింది. ముందు ముందు పండిన పంటకు గిట్టుబాటు ధర లేదా కనీస మద్దతు ధర లాగా ఓటుకు గిట్టుబాటు, కనీస మద్దతు ధరలను డిమాండ్ చేసే రోజులు వచ్చినా రావచ్చును. ఒక్క రెండు రోజుల్లో తెరాస, బీజేపీ పార్టీల అభ్యర్ధులు 250 కోట్ల రూపాయలు ఓటర్లకు పంచారని వస్తున్న వార్తలు నిజమే అయితే, ప్రజాస్వామ్యం అనే మాటకు కొత్త అర్థం వెతుక్కోవలసివస్తుంది.   ఇక్కడ ఇలా ఉంటే సోదర తెలుగు రాష్ట్రం ఏపీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గానికి జరుగతున్న ఉప ఎన్నికలో, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ పోటీలో లేకున్నా, అధికార వైసీపీ, అన్ని రకాల అక్రమాలు సాగిస్తూనే ఉంది. మరీ హుజూరాబాద్ స్థాయిలో కాకపోయినా అక్కడా వైసీపీ ఓటుకు రెండు వేలరూపాల వంతున డబ్బులు పంచుతోంది. తాగినోడికి తాగినంత మందు పోస్తోంది. అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యం, ఉప ఎన్నికను అభాసుపాలు చేశాయి దీనితో పాటుగా, అధికార వైసీపే ఇరుగు పొరుగు నియోజక వర్గాల నుంచి జనాలను బస్సుల్లో తరలింఛి దొంగ ఓట్లు వేయించే వినూత్న ప్రయోగం చేస్తోంది.  నిజానికి  వైసీపీ  తిరుపతి ఉప ఎన్నికలలోనే ఈ ప్రయోగం చేసినిది. ఇప్పడు బద్వేల్ లో కొనసాగిస్తోంది. భవిష్యత్ ‘లోనూ ఇదే పంధాను అనుసరించినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండు వినూత్న వికృతులని పరిచయం చేశాయి. 

మీడియా వాహనాలు, రిపోర్టర్ల ద్వారా డబ్బు పంపిణీ..

హుజూరాబాద్ లో డబ్బు పంపిణీ కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల కొనుగోలులో కొత్త దారులు పోతున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న మొండి పట్టుదలతో అధికార పార్టీ అనూహ్యమైన ఎత్తుగడలు వేస్తోంది. పోలింగ్ ముందురోజు రాత్రి వరకూ ఓటర్లకు డబ్బు పంపిణీలో ఉన్న పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ... పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా నోట్ల కట్టలతో రెడ్ హేండెడ్ గా పట్టుబడింది.  టీ-న్యూస్ ఫేక్ ఐడీ  కార్డులతో  కొందరు అధికార పార్టీ నాయకులు రిపోర్టర్లుగా బుకాయిస్తూ ఏకంగా బూత్ ల దగ్గరే డబ్బు పంపిణీ చేస్తుండడం ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను నిరాశపరుస్తోంది. అయితే అధికార పార్టీ ఎక్కడెక్కడ, ఏ విధంగా అడ్డదార్లు తొక్కే  అవకాశం ఉందో అంచనా వేసిన బీజేపీ నాయకులు ప్రతి బూత్ దగ్గర కూడా తమ కార్యకర్తలను, ఆయా గ్రామాల్లోని మహిళలను నిఘా కోసం పెట్టారు. వారంతా అధికార పార్టీ ఆగడాలు అడ్డుకునేందుకే పోలింగ్ బూత్ ల దగ్గర కాపలా కాస్తుండడం విశేషం. ఈ క్రమంలో ఓ స్థానికేతరుడు తాను టీ న్యాస్ రిపోర్టర్ని అంటూ బుకాయిస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడం, ఆ వ్యక్తిని అనుమానించిన స్థానికులు అడ్డుకోవడంతో ఆయన దగ్గర నోట్లు బయటపడ్డాయి.   ఇలా వీణవంక, ఘన్ముక్ల, కమలాపూర్.. ఎక్కడ చూసినా ఎన్నికల ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. అనేక చోట్ల టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. వారిని సముదాయించడం, శాంతింపజేయడం, ఆ తరువాత ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా కొనసాగించడం పోలీసులకు సవాలుగా మారింది. ఎన్నికల్లో ప్రలోభాల కోసం ప్రయత్నిస్తున్న కొందరు నాయకులు ఫేక్ ప్రెస్ ఐడీ కార్డులతో బయటకొచ్చే అవకాశం ఉందని, ఎవరైనా పేపర్ పేరు చెప్పి, మీడియా పేరు చెప్పి ప్రలోభపెడితే వారిని నమ్మరాదని, తమకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు ముందురోజే హెచ్చరించడం విశేషం. వారు హెచ్చరించినట్టుగానే ఉదయం ఫేక్ టీ-న్యూస్ ఐడీ కార్డులతో బూత్ ల దగ్గర తచ్చాడిన వ్యక్తులు కనిపించడం గమనించాల్సిన అంశం. మరోవైపు ఓటర్లను,  బీజేపీ కార్యకర్తలను, గతంలో టీఆర్ఎస్ లో ఉండి ఈ మధ్యే బీజేపీలో చేరిన పలువురిని అధికార పార్టీ నేతలు బెదిరించడం సంచలనంగా మారుతోంది.  తాము తల్చుకుంటే ఒకే ఒక్క నిమిషంలో మీ అందరినీ మాయం చేస్తామని బీజేపీ నాయకులకు వార్నింగ్స్ ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈటల రాజేందర్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బహిరంగ బెదిరింపులు, బహిరంగ నోట్ల పంపిణీ జరుగుతున్నా ఈసీ అసమర్థంగా వ్యవహరిస్తోందని, అసలు ఈసీ కనుసన్నల్లోనే నోట్ల పంపిణీ జరుగుతుందా అన్న అనుమానం కలుగుతోందని ఆయన ఆరోపించారు.  టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నా.. అతనికి అన్ని బూత్ లలోకి వెళ్లే అధికారం ఉన్నా.. ఆయన వస్తే ఓటర్లను ప్రలోభపెడతాడని, ఆయన బూత్ ల దగ్గరికి రావొద్దని ఓటర్లు అడ్డుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. ఇందుకోసం మహిళలు పెద్దసంఖ్యలో ముందుండడం అధికార పార్టీని వణికిస్తోంది. నోట్లు పంచుతున్నారంటూ టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గరున్న నోట్లు కూడా స్వాధీనం చేసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దీన్నిబట్టి నోట్లు పంచే కార్యక్రమం ఎంత పకడ్బందీగా సాగుతుందోో అర్థం చేసుకోవచ్చు

కుప్పంలో చంద్ర‌న్న వ్యూహాలు.. త‌మ్ముళ్ల జేజేలు..

కుప్పం చంద్ర‌బాబు అడ్డా. ద‌శాబ్దాలుగా ఆయ‌నే రారాజు.  ఓటమి ఎరుగని నాయకుడు. వైసీపీ నేత‌లు ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు, దౌర్జ‌న్యాలు, ఆగ‌డాలు చేసినా.. కుప్పంలో చంద్ర‌బాబు చిటికెన వేలు కూడా ట‌చ్ చేయ‌లేమ‌నే విష‌యం వాళ్ల‌కు కూడా తెలుసు. అందుకే, అధికార పార్టీలో అంత అస‌హ‌నం. అది భ‌రించ‌లేకే.. టీడీపీ ఫ్లెక్సీల‌ను చించేయ‌డం.. క‌రెంట్ క‌ట్ చేయ‌డం.. స‌భ‌లో ఉద్రిక్త‌త‌లు రాజేయ‌డం.. లాంటి చిల్ల‌ర చేష్ట‌ల‌కు దిగుతున్నారు. వాట‌న్నిటికీ ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగు త‌మ్ముళ్లు ధీటుగా జ‌వాబిస్తున్నారు. గ‌ట్టిగా ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు ల‌భించిన అనూహ్యం మ‌ద్ద‌తు, భారీ ఘ‌న స్వాగ‌తం చూశాకైనా.. కుప్పంలో బాబు ప‌వ‌రెంతో ప్ర‌త్య‌ర్థుల‌కు తెలిసొచ్చి ఉంటుంది.  ఇక‌, కుప్పంలో చంద్ర‌బాబు రెండోరోజు కీల‌క స‌మీక్ష‌లు జ‌రుపుతున్నారు. ఈసారి జ‌ర‌గ‌బోయే కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌లు ఉప ఎన్నిక‌లు, స్థానిక సంస్థ‌ల ఎల‌క్ష‌న్ల‌లో వైసీపీకి వార్ వ‌న్‌సైడ్ కావ‌డంతో.. కుప్పంలో అధికార పార్టీ జోరుకు బ్రేకులు వేసేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. చంద్ర‌బాబు ఇలాఖాలో టీడీపీకి షాక్ ఇవ్వాల‌ని అధికార పార్టీ ఎత్తులు వేస్తుంటే.. వారి జిత్తుల‌ను చిత్తు చేసేందుకు స్వ‌యంగా చంద్ర‌బాబే రంగంలోకి దిగారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌తో కుప్పంలో పార్టీ శ్రేణుల్లో స‌మ‌రోత్సాహం నింపుతున్నారు. శ‌నివారం పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వ‌రుస‌ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలపై చర్చిస్తున్నారు. టీడీపీ తరపున  పోటీ చేసే ఆశావ‌హులు భారీగా ఉండ‌టంతో.. అభ్య‌ర్థుల ఎంపిక క‌త్తి మీద సాముగా మారింది. ఇక‌, మునిసిపల్ ఎన్నికల్లో అనుస‌రించాల్సిన‌ వ్యూహాలపై పార్టీ శ్రేణుల‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలోగ్గకుండా.. అధికార పార్టీ ఆగ‌డాల‌ను అడ్డుకునేలా.. కేడ‌ర్‌కు చంద్రబాబు సూచనలు చేశారు. టీడీపీ అధినేత ప‌ర్య‌ట‌న‌తో కుప్పంలో తెలుగు త‌మ్ముళ్ల జోష్ మామూలుగా లేదు.

క్రికెట్ బెట్టింగులో హైదరాబాద్ పోలీసులు.. గోవాలో ఇద్దరు అరెస్ట్

వాళ్లు పోలీసులు.. ఇది టీట్వంటీ సీజన్.. గల్లీగల్లీలో బెట్టింగులు కామన్. అయితే వాటిని ఆపాల్సిన పోలీసులే బెట్టింగుల్లో మునిగితేలుతున్నారు. విధులకు డుమ్మా కొట్టి మరీ పందేళ్లు కాస్తున్నారు. ఇలా గోవాలో క్రికెట్ బెట్టింగ్ పెడుతూ ఇద్దరు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది.   గోవా క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు హైదరాబాద్ పోలీసులు పట్టుబడ్డారు. క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతూ ఇద్దరు పోలీసులు చిక్కారు. పట్టుబడిన వారు మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ సయ్యద్,  వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఇమ్రాన్‌గా గుర్తించారు. ఇమ్రాన్ తన చెల్లి పెళ్లి అంటూ లీవ్ పెట్టి గోవాలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. గతంలో ఇమ్రాన్ అనేక సార్లు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.  ఇమ్రాన్  12 ఏళ్లగా టాస్క్ ఫోర్స్‌లో డ్యూటీ చేస్తుండగా... సయ్యద్ 8 ఏళ్లగా టాస్క్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు.  గోవాలో బెట్టింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు..  పట్టుబడిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  

కుప్పంలో చంద్ర‌న్న జోరు.. బ‌ద్వేల్లో దొంగఓట్లు.. హుజురా-వార్‌.. టాప్‌న్యూస్ @1pm

1. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కుప్పం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల విషయంపై చర్చించారు. మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున  పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక‌, గెలుపు వ్యూహాల‌పై చ‌ర్చించ‌నున్నారు చంద్ర‌బాబు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రోడ్డు షో నిర్వ‌హించ‌నున్నారు.  2. ఉప ఎన్నిక సంద‌ర్భంగా బ‌ద్వేలు పరిధిలో బీజేపీ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ నేత సీఎం రమేష్ అన్నారు. ఉపఎన్నికల్లో దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారని ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలను కాకుండా  స్థానిక పోలీసులను రక్షణగా ఉంచుతున్నారన్నారు. పోరుమామిళ్లలో బయటి వ్యక్తులను మోహరించారని సీఎం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  3. బ‌ద్వేలు ప‌రిధిలోని గోపవరం పోలింగ్ బూత్‌ దగ్గర వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బూత్‌ నుంచి ఇతర పార్టీల ఏజెంట్ల పట్ల వైసీపీ నేతలు బెదిరింపులకు తెగబడ్డారు. పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో దొంగ ఓట్లు వేసేందుకు ప్ర‌య‌త్నించిన వారిని ప‌ట్టుకొని పోటీసుల‌కు అప్ప‌గించారు గ్రామ‌స్తులు.  4. బద్దేల్‌లో ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ అన్నారు. బద్వేల్ ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా  విజయానంద్ పరిశీలిస్తున్నారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయకపోవడాన్ని గుర్తించి వెంటనే అధికారులు వాటిని మార్చినట్లు తెలిపారు. స్థానికంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.  5. హుజురాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఉద్రిక్త‌తలు చెల‌రేగుతున్నాయి. వీణవంక మండలం గణుముక్కుల గ్రామంలో పోలింగ్ బూత్‌లో టీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. పోలింగ్ బూత్‌లో ప్రచారం చేయడం ఏంట‌ని గ్రామస్తులు కౌశిక్‌రెడ్డిని అడ్డ‌గించి.. అక్క‌డి నుంచి వెళ్ల‌గొట్టారు.  6. జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరుల ప్రచారాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మ‌రోవైపు, హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా భారీ ఎత్తున పోలింగ్ న‌మోద‌వుతోంది. మ‌ధ్యాహ్నానికే సుమారు 40శాతం ఓటింగ్ జ‌రిగింది. 7. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని 11వ రోజు పాదయాత్రలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమ‌ర్శించారు. ‘‘రెండుసార్లు అవకాశం ఇస్తే ఎవరు బాగుపడ్డారు. కేజీ టూ పీజీ అని చెప్పి విద్యార్థులను మోసం చేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు అని చెప్పి పేదలను మోసం చేశారు. పెన్షన్లు ఆపి వృద్ధులను మోసం చేశారు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి యావత్ తెలంగాణను కేసీఆర్ మోసం చేశారు’’ అని కేసీఆర్‌పై ష‌ర్మిల మండిప‌డ్డారు.  8. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తన రాజకీయ భవిష్యత్ కోసం పోలీసుల కాపలాతో పాదయాత్ర చేశారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు "న్యాయస్థానం నుండి దేవస్థానం" పాదయాత్ర చేస్తూంటే  అడ్డుకోవడం అంటే జగన్ తనని తాను అవమానించుకోవడమే అని విమ‌ర్శించారు. న్యాయ స్థానం అనుమతితో " న్యాయస్థానం టూ దేవస్థానం" ఇక భద్రత, బాధ్యత పోలీసులదే అని లంకా దినకర్ చెప్పారు.   9. రాజమండ్రిలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.  విసన కర్రలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నిరసన తెలిపారు. చేతకాని ముఖ్యమంత్రి ఏపీని పరిపాలిస్తున్నారని ఆమె మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని ఆదిరెడ్డి భవానీ తెలిపారు. మ‌రోవైపు, విద్యారంగాన్నిసీఎం జగన్‌రెడ్డి భ్రష్టుపట్టిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ నాయ‌కులు మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ఎలా పటిష్ఠం చేయాలో తెలియకుండా, వాటిని మూసేయాలని ఏకపక్షంగా నిర్ణయించడం దారుణమన్నారు. 10.  విశాఖ స్ట్రీల్‌ను అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి  లేదని పర్యావరణ ఉద్యమకారిణి  మేధాపాట్కర్ అన్నారు. స్ట్రీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మ‌న్నపాలెం దగ్గర కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ సంఘీభావం పలికారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.   

మేడ‌మ్ 'మ‌మ‌త‌'కు పెద్దోళ్ల స‌పోర్ట్‌!.. బ‌దిలీ బంద్‌!

మేడ‌మ్ మ‌మ‌త‌. తెలుసుగా. ఆమె గురించి తెలీక‌పోయినా ఈ ఫోటో చూస్తే గుర్తుప‌ట్టేస్తారు. తెలంగాణ ఉద్య‌మం ఫాలో అయిన వారంద‌రికీ ఈమె సుప‌రిచిత‌మే. అప్ప‌ట్లో ఉద్య‌మంలో ఫుల్ యాక్టివ్ ఉండేవారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీస‌ర్స్‌-టీజీవోల త‌ర‌ఫున గ‌ట్టిగా పోరాడారు. ప్ర‌స్తుత మంత్రి, అప్పటి టీజీవో లీడ‌ర్ శ్రీనివాస్‌గౌడ్ త‌ర్వాత‌.. నెంబ‌ర్ 2గా చెలామ‌ని అయ్యారు. యూనియ‌న్ త‌రఫున ప్ర‌తీ ఫ్రేమ్‌లో ఆమె ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం సాకారమ‌య్యాక‌.. ఆమె పోరాటానికి త‌గిన గుర్తింపుతో పాటు, మేడ‌మ్‌కు ప్ర‌మోష‌న్ కూడా ల‌భించింది. అస‌లు మమతకు పదోన్నతి ఇవ్వడంపైనా వివాదం ఉంది. ఆమె కంటే ప‌దుల‌మంది సీనియర్లు ఉన్నప్పటికీ జోనల్‌ కమిషనర్‌గా ప్రమోషన్ ద‌క్కింది. అలా ఏళ్లుగా.. ఓ వెలుగు వెలుగుతూ వ‌చ్చిన మ‌మ‌త‌కు స‌డెన్‌గా షాక్ త‌గిలింది.    ఇప్పుడు మమత మున్సిపల్ కమిషనర్‌. సుదీర్ఘ కాలంగా కూకట్‌పల్లిలో పని చేస్తున్నారు. ఇటీవ‌ల ఎల్బీనగర్‌కు బదిలీ చేయ‌డం ఆమెకు ఊహించ‌ని ప‌రిణామం. ఆ.. న‌న్నే ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తారా? అంటూ మేడ‌మ్ క‌న్నెర్ర చేశారు. దెబ్బ‌కు సాయంత్రానిక‌ల్లా బ‌దిలీ ఉత్తర్వులు మారిపోయాయి. ఆమెను కూకట్ పల్లిలోనే కొనసాగించాలని మార్చిన‌ ఆర్డ‌ర్ వ‌చ్చేసింది. అదీ మ‌మ‌త ప‌వ‌ర్‌.  అవినీతి ఆరోపణలు ఉండటం.. సుదీర్ఘకాలంగా పని చేస్తూండటంతో.. గ్రేట‌ర్ ప‌రిధిలోని ఐదుగురు జోనల్ కమిషనర్లను ఒక్క సారిగా బదిలీ చేశారు. ఇందులో మమత కూడా ఉన్నారు. వెంటనే ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు మ‌మ‌త త‌ర‌ఫున రంగంలోకి దిగారు. ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. క‌ట్ చేస్తే.. మమత బదిలీ అగిపోయింది. మిగిలిన వారి బ‌దిలీలు యధావిధిగా జరిగిపోయాయి. మ‌మ‌త మేడ‌మ్ ప‌ర‌ప‌తి ఏంటో గ్రేట‌ర్ క‌మిష‌న‌ర్‌కు తెలిసొచ్చింది. అయితే.. ఎప్పుడో ఉద్య‌మంలో యాక్టివ్‌గా ఉన్నార‌నే కార‌ణంతో.. ఇన్నేళ్లైనా ఆమెకు అంత ప్ర‌యారిటీ ఇవ్వ‌డం.. ప‌దోన్న‌తి, కావల‌సిన పోస్టింగ్‌లోనే కూర్చోబెట్ట‌డంపై మిగ‌తా ఉద్యోగ సంఘాల నేత‌లు, స‌హ‌చ‌ర ఉద్యోగులు మండిప‌డుతున్నారు. 

రెండు నెలల్లో 50 కోట్ల మద్యం.. తాగేసిన హుజురాబాద్ జనం..

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అత్యంత కాస్ట్లీగా మారింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల్లో హుజురాబాద్ నిలిచిపోతుందని అంటున్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే నియోజకవర్దంలో రాజకీయం వేడెక్కింది. జూలై నుంచే ఓటర్లకు ప్రలోభాలు మొదలయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ లో పీక్ స్టేజీకి చేరాయి. గత రెండు నెలలుగా హుజురాబాద్ ఓటర్లు పండుగ చేసుకున్నారు. మందుకు ఢోకా లేకుండా పోయింది. ప్రధాన పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశాయి. తాగేవారికి తాగినంతగా మద్యం ఇచ్చారు. పోటా పోటీ ప్రచారం తో పాటు మద్యం మాంసం విందులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మద్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలు తేదీ సమీపిస్తున్న రోజు ల్లో ప్రతి రోజు దాదాపు గా రెండు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గురు శుక్ర వారా ల్లో నియోజక వర్గంలో భారీ గా మద్యం పంపిణీ జరిగి నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం పొంతన లేని సమాధానం చెబుతున్నారు. గతేడాది మాదిరి గానే మద్యం అమ్మకాలు జరిగినట్లు రికార్డులు చూపెడుతున్నారు. హుజురాబాద్ లో ఖర్చు చేసిన మద్యాన్ని వివిధ జిల్లాల నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఎవరీ కంట పడ కుండా డంప్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ నెల లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో 76 కోట్ల 19 లక్షల 22 వేల రూపాయల మద్యం అమ్మ కాలు జరిగాయి. హుజురాబాద్ లో పరిధిలో 11 కోట్ల 3 లక్షల 64 వేల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. జమ్మికుంట లో 12 కోట్ల 24 లక్షల 64 వేల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక అక్టోబర్ నెలలో జిల్లాలో 84 కోట్ల 64 లక్షల రూపాయల మద్యాన్ని అమ్మారు. ఉప ఎన్నిక జరుగుతున్న హుజురాబాద్ లో 11 కోట్ల 53 లక్షలు జమ్మికుంట లో 13 కోట్ల 21 లక్షల రూపాయల వ్యాపారం జరిగింది. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో 48 కోట్ల 2 లక్షల 28 వేల రూపాయల మద్యం అమ్మినట్లు చెబుతున్నారు. ఈ మద్యం లెక్కలు కేవలం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోవి మాత్రమే. అయితే హుజురాబాద్ పక్కనే ఉన్న వరంగల్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలోని షాపుల నుంచి భారీగా మద్యం తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా గత రెండు నెలల్లోనే హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 60 కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరిగినట్లు చెబుతున్నారు.

నాపై కేసీఆర్ పంతం.. ఈట‌ల సంచ‌ల‌నం..

హుజురాబాద్‌లో పోలింగ్‌ పోటెత్తుతోంది. ఓట‌ర్లు భారీగా త‌ర‌లివ‌చ్చారు. పెద్ద పెద్ద క్యూ లైన్ల‌తో ఓపిగ్గా ఓటేస్తున్నారు. అర్థ‌రాత్రి వర‌కూ చీక‌ట్లో సైలెంట్‌గా డ‌బ్బుల పందేరం సాగిందంటున్నారు. ఉద‌యం సైతం.. అక్క‌డ‌క్క‌డా డ‌బ్బుల క‌ట్ట‌లు ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఓ న్యూస్ ఛానెల్ ప్ర‌తినిధి పైస‌లు పంచుతున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో అత‌న్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. రిపోర్ట‌ర్ల ముసుగులో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి.  ఇక టీఆర్ఎస్ చీఫ్ ఎల‌క్ష‌న్ ఏజెంట్‌గా ఉన్న కౌశిక్‌రెడ్డి ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్ల‌గా.. అక్క‌డే ఉన్న ఈట‌ల‌ వ‌ర్గీయులు ఆయ‌న్ను అడ్డుకున్నారు. బ‌ల‌వంతంగా అక్క‌డి నుంచి పంపించేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం తాను ఏ బూత్‌లోకైనా వెళ్లొచ్చిన కౌశిక్‌రెడ్డి చెప్పినా.. గుంపుగా ఎందుకొచ్చావ్‌? ఓట‌ర్ల‌ను ఎందుకు ప్ర‌భావితం చేస్తున్నావంటూ.. స్థానికులు కౌశిక్‌రెడ్డిని అక్క‌డి నుంచి త‌రిమికొట్టారు. పెద్ద‌గా ఉద్రిక్త‌త‌లు లేకున్నా.. ఉద్రిక్త వాతావ‌ర‌ణం మాత్రం కొన‌సాగుతోంది.  ఇక‌, ఉద‌య‌మే క‌మ‌లాపూర్‌లో ఓటు వేశారు బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌. హుజూరాబాద్‌లో పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారని ఈటల ఆరోపించారు. నియోజకవర్గంలో మద్యం ఏరులైపారిందని.. రూ.వందలకోట్లు పంపిణీ చేశారని ఆయ‌న‌ ఆరోపించారు. ప్రజలే బహిరంగంగా తమకు డబ్బు అందలేదని చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని మండిప‌డ్డారు.  ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో చూడొద్దని సీఎం కేసీఆర్‌ పంతం పట్టినట్టున్నారని.. అందుకే అధికార యంత్రాంగం సాయంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారని ఆరోపించారు. ప్రజలంతా దీన్ని ఎదుర్కోకపోతే సమాజం బానిసత్వంలోకి వెళ్లిపోతుందని.. ఆత్మగౌరవరం, ధర్మాన్ని గెలిపించుకోవాలని ఈటల రాజేంద‌ర్‌ పిలుపిచ్చారు.