Rajamouli

అల్లు అర్జున్ ఈజ్ రియల్ లైఫ్ హీరో: రాజమౌళి

  బాహుబలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అమాంతం హాలీవుడ్ స్థాయికి చేర్చిన దర్శకుడు రాజమౌళి రుద్రమదేవి సినిమాపై తన ట్వీటర్ ద్వారా ప్రశంశల వర్షం కురిపించారు. ముఖ్యంగా అందులో ముఖ్యపాత్రలు చేసిన అల్లు అర్జున్, రానా, అనుష్క, ప్రకాష్ రాజ్ లను చాలా మెచ్చుకొన్నారు. గోన గన్నారెడ్డి పాత్ర పోషించిన అల్లు అర్జున్ గురించి ఈవిధంగా అన్నారు. “రుద్రమదేవి సినిమా షూటింగ్ దాదాపు నిలిచిపోయినప్పుడు అల్లు అర్జున్ ప్రవేశించి దానిని ముందుకు తీసుకుపోవడమే కాకుండా గన్నా రెడ్డి పాత్రను చాలా అద్భుతంగా పోషించారు. ఆయన నటన సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చును. మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా దానికి తెలంగాణా ప్రభుత్వం చేత వినోదపన్ను మినహాయింపు ఇప్పించడంలో సహాయపడినట్లు విన్నాను. అల్లు అర్జున్ సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా హీరో అనిపించుకొన్నాడు. అతనికి నా మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.   రుద్రమదేవి పాత్రలో స్వీటీ (అనుష్క) అత్యద్భుతంగా నటించింది. ఆ పాత్రలో ఆమె కనబరిచిన నిబద్దత అత్యద్భుతం. రుద్రమదేవి పాత్రని ఆమె తప్ప మరొకరు చేయలేరనే అంత గొప్పగా నటించింది. అటువంటి గొప్ప నటిని కలిగి ఉండటం మన సినీ పరిశ్రమ అదృష్టం. రుద్రమదేవి, వీరభద్రుల పాత్రలు మరికొంత కొనసాగించి ఉండి ఉంటే చాలా తృప్తిగా ఉండేది. కానీ ఆ కొద్దిపాటి సమయంలోనే రానా తన ప్రతిభను చాటుకొన్నారు. ఇకపై ఎవరయినా ఇటువంటి చారిత్రిక సినిమాలను తీయదలిస్తే రానాయే మొదట గుర్తుకు వస్తాడు. అంత గొప్పగా చేసాడు రుద్రమదేవిలో తన పాత్రని. శివదేవయ్య రాజకీయ ఎత్తుగడలను కూడా మరికొంత చూపించి ఉండి ఉంటే బాగుండేది. ప్రకాష్ రాజ్ గారు తనకు ఇచ్చిన సమయంలో ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇటువంటి గొప్ప సినిమాను తీయలనుకొన్నందుకు, తీసినందుకు, తీసి విజయం సాధించినందుకు దర్శకుడు గుణశేఖర్ గారికి, వారి యూనిట్ మెంబర్లు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు,” అని రాజమౌళి ట్వీట్ చేసారు.

Playback Singer

ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్ను మూశారు

  గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అలనాటి మధుర గాయకుడు విస్సంరాజు రామకృష్ణ ఈరోజు తెల్లవారు జామున జూబ్లీ హిల్స్ లో గల తన నివాసంలో కన్నుమూశారు. అమర గాయకుడు స్వర్గీయ ఘంటసాల తరువాత అంతటివాడని పేరు పొందిన ఏకైక గాయకుడు ఆయన. రామకృష్ణగా తెలుగు ప్రజలకు చిరపరిచితుడయిన ఆయన ఆగస్టు 20,1947లో రంగశాయి, రత్నం దంపతులకు జన్మించారు.   ఆయన మొదట 'ఆల్ ఇండియా రేడియో'లో పాటలు పాడేవారు. 1972సం.లో ఆయన విచిత్రబందం అనే సినిమా కోసం పాడిన ‘వయసే ఒక పూల తోట’ సినీ పాటల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. నాటి నుండి కొన్ని సం.ల క్రితం వరకు ఆయన తన పాటలతో తెలుగు ప్రజలను అలరారిస్తూనే ఉన్నారు. ఆయన సుమారు 5000 లకు పైగా పాటలు పాడారు. వాటిలో తాతా మనవడు, అందాల రాముడు, భక్త తుకారం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, అందరూ దొంగలే, చక్రవాకం, బలిపీఠం, యశోద కృష్ణ, ముత్యాలముగ్గు, భక్త కన్నప్ప, దానవీరశూర కర్ణ, కరుణామయుడు, వయసు పిలిచింది, యువతరం కదిలింది, శ్రీ షిరిడి సాయి మహత్యం, నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలలో ఆయన పాడిన పాటలు తెలుగు ప్రజల హృదయాలలో ఎల్లప్పటికీ మెదులుతూనే ఉంటాయి. ఆ సినిమాలన్నీ హిట్స్ అందులో ఆయన పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్. నేటికీ ఆయన పాడిన పాటలు ప్రజలు అవలీలగా గుర్తుకు తెచ్చుకోగలరంటే ఆయన పాటకు, గొంతుకు ఎంత ప్రత్యేకత ఉందో అర్ధమవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో 1970-80 మధ్య విడుదలయిన అనేక సినిమాలలో ఆయన పాడిన ప్రతీపాట మధురమయినదే. ఆయనకు అజరామరమయిన కీర్తి ప్రతిష్టలను అందజేసినదే.   స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్ఆర్, శోభన్ బాబు వంటి మేటి నటులందరికీ ఆయన డబ్బింగ్ చెప్పారు. ఆయన సినిమా పాటలే కాకుండా భక్తి గీతాల ఆల్బమ్స్ కూడా చాలా చేసారు. వాటికీ ప్రజలలో అంతే విశేషాదరణ ఉండేది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సినీ సంగీత విభావరి నిర్వహించారు. అంతేకాదు గత కొన్నేళ్ళుగా ఆయన తెలుగు టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. ఆయన భార్య పేరు జ్యోతీకృష్ణ. ఆమెకూడా గాయనీమణే. వారికి సాయి కిరణ్, లేఖ అనే ఇద్దరు సంతానం. వారిలో సాయి కిరణ్ 2001 సం.లో విడుదలయిన ‘నువ్వే కావాలి’ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. రామకృష్ణ అంత్యక్రియలు ఈరోజు హైదరాబాద్ లో జరుగవచ్చును.

Music Director

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ ఇక లేరు

  తెలుగు, తమిళ్, మలయాళ బాషలలో 1200 చిత్రాలకు సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ ఈరోజు తెల్లవారు జామున చెన్నైలో మల్లార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎం.యస్.విశ్వనాథన్ కేరళలో పాలక్కడ్ కు చెందిన ఇలప్పుళి గ్రామంలో 1928, జూన్ 24న జన్మించారు. చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయనకి నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి మనయంగాత్ సుబ్రమణియన్ మరణించడంతో తాతగారి వద్ద పెరిగారు. కానీ వారిది చాలా పేద కుటుంబం కావడంతో ఆ లేత వయసులోనే విశ్వనాథన్ గారు స్థానిక సినిమా హళ్ళలో తినుబండారాలు అమ్ముతూ జీవించాల్సిన భయానకమయిన దుస్థితి ఏర్పడింది. కానీ దాని వలన ఆయన సినీ ప్రపంచం వైపు ఆకర్షితులయ్యే అవకాశం కలిగింది. అప్పటి నుండే ఆయనకు సినిమాలలో నటించాలని, పాటలు పాడాలనే కోరిక మొదలయింది.   ఆ తరువాత ఆయన అనేక నాటకాలలో నటించారు కూడా. కానీ ఆయనలో దాగి ఉన్న సంగీత ప్రతిభను గుర్తించిన నీలకాండ భాగవతార్ ఆయనను చేరదీసి సంగీతం నేర్పించారు. 1933 నుండి 1939సం.వరకు ఆయన వద్ద సంగీతం నేర్చుకొన్నారు. ఆ తరువాత ఆయన యస్.వి. వెంకట్రామన్, యస్.ఎం.సుబ్బయ్య, సి.ఆర్. సుబ్బురామన్, టి.ఆర్. రామమూర్తి, టిజి.లింగప్ప తదితర ప్రముఖ సంగీత విద్వాంసుల బృందాలలో పనిచేసి సంగీతంలో మెళుకువలు ఆకళింపు చేసుకొన్నారు. 1952లో సి.ఆర్. సుబ్బురామన్ ఆకస్మికంగా మరణించడంతో ఆయన వద్ద పనిచేస్తున్న సంగీత దర్శకుడు రామ్మూర్తితో కలిసి ఎం.యస్.విశ్వనాథన్ సుబ్బురామన్ అంగీకరించిన దేవదాసు,చండీరాణి, మరుమగల్ మొదలయిన సినిమాలకు సకాలంలో అద్భుతమయిన సంగీతం అందించడంతో ఆయన సినీ ప్రస్తానం మొదలయిందని చెప్పవచ్చును. వాటిలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన దేవదాసు సినిమాకు ఎం.యస్.విశ్వనాథన్ సంగీతం అందించారు. ఆ చిత్రంలో ‘జగమే మాయ బ్రతుకే మాయ’ అనే పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలుసు.   ఆయన తెలుగులో కేవలం 31 సినిమాలకు మాత్రమే సంగీతం అందించినప్పటికీ, తెనాలి రామకృష్ణ, ఆకలి రాజ్యం, మరో చరిత్ర, అంతులేని కధ, అందమయిన అనుభవం, చిలకమ్మా చెప్పింది, ఇది కధ కాదు,గుప్పెడు మనసు, కోకిలమ్మ వంటి సినిమాలకు అందించిన అపూర్వమయిన బాణీలతో తెలుగు సినీ సంగీతం ప్రపంచంలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఫిలిం ఫేర్ జీవిత కాల పురస్కారం(2001), పరమాచార్య అవార్డు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమయిన కలైమణి అవార్డు వంటి అనేక అవార్డులు ఆయన అందుకొన్నారు. అజరామరమయిన సంగీతాన్ని అందించిన ఎం.యస్.విశ్వనాథన్ ఇకలేరు అని తెలియగానే సంగీత ప్రియులు చాలా బాధపడుతున్నారు. ఆయన అంత్యక్రియలు రేపు చెన్నైలో నిర్వహించబడతాయి.   https://www.youtube.com/playlist?list=PLvS3k4MyaWFfomd76mt2iP6Rr2NkXRdAR  

Bahubali

నా జీవితంలో అంతగొప్ప దర్శకుడిని చూడలేదు

  బాహుబలి సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు యం.యమ.కీరవాణి సంగీతం అందించారు. అయితే ఆయన కేవలం సంగీతం అందించడం వరకే తన పని అన్నట్లుగా భావించకుండా ఈ సినిమా నిర్మాణంలో తనకు అడుగడునా చాలా సహకరించారని, ఒక గొప్ప గురువులా తనకు మార్గదర్శనం చేసారని దర్శకుడు రాజమౌళి కీరవాణిని ప్రశంసించారు. సినిమా నిర్మాణంలో తను ఎక్కడ తప్పు చేసినట్లు ఆయన గుర్తించినా ఏ మాత్రం వెనకాడకుండా నిర్భయంగా ఆ తప్పులని ఎత్తి చూపుతూ వాటిని సవరించుకొనేందుకు తన చాలా తోడ్పడ్డారని రాజమౌళి ఆడియో రిలీజ్ కార్యక్రమానికి హాజరయిన వేలాది ప్రజల ముందు చెప్పడం ఆయన సమున్నత వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ఏ సంగీత దర్శకుడుకి కూడా ఇంతకంటే గొప్ప అవార్డు ఉండబోదు.

Director Rajamouli

రాజమౌళి అభిమాన టెక్నీషియన్ ఎవరు?

  నిన్న తిరుపతిలో జరిగిన బాహుబలి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా విభిన్నంగా సాగింది. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలలో దర్శక, నిర్మాతలు, నటీనటులు ఒకరినొకరు పొగుడుకోవడానికే సరిపోతుంది. కానీ ఈ కార్యక్రమంలో ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న అనేక మంది టెక్నీషియన్లను పేరుపేరునా గుర్తుంచుకొని కృతజ్ఞత ప్రకటించడం విశేషం. అంతేకాదు ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు వేదిక మీదకి వచ్చిన ప్రతీ ఒక్కరి చేత వారి అభిమాన టెక్నీషియన్ పేరు చెప్పించడం, స్టేజికి వెనుక ఏర్పాటు చేసిన పెద్దతెర మీద అతని ఫోటోని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకొంది. తద్వారా వారిపట్ల నటీనటులకు, ముఖ్యంగా దర్శకుడు రాజమౌళికి ఎంత గౌరవం ఉందో అర్ధమవుతోంది.   రాజమౌళిని కూడా ఈ సినిమా కోసం పనిచేసిన వారిలో తన అభిమాన టెక్నీషియన్ పేరు చెప్పమని అడిగినప్పుడు ఆయన కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన కృష్ణ పేరు చెప్పారు. “ఈ సినిమాలో నటీనటులకు, ముఖ్యంగా వీరోచిత సన్నివేశాలలో పాల్గొనే ప్రభాస్, రాణాల కోసం కృష్ణ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, యుద్ద కవచాలు, కిరీటాలు వగైరా చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిని వేసుకొని వారిరువురూ గంటల గంటలసేపు షూటింగ్ లో పాల్గొనవలసివచ్చేది. అవి పైకి చాలా దృడంగా, బరువుగా కనబడేలా తయారు చేసినా, చాలా తేలికగా ఉండేలా తయారుచేసారు. ఎంతో నైపుణ్యం, శ్రద్ద, ఓర్పు ఉంటే తప్ప అటువంటివి సృష్టించడం సాధ్యం కాదు. అంత గొప్ప కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన కృష్ణకి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని రాజమౌళి అన్నారు.

Bahubali Movie

బాహుబలి సినిమా రిలీజ్ డేట్???

  గత మూడేళ్ళుగా కొనసాగిన బాహుబలి సినిమా షూటింగ్ ఇంకా ఎప్పటికి పూర్తవుతుంది? రాజమౌళి ఎప్పటికయినా సినిమాని రిలీజ్ చేస్తారా? లేకపోతే శిల్పం చెక్కుతున్నట్లుగా సినిమాను చెక్కుకొంటూనే కూర్చోంటారా?అని ప్రభాస్ అభిమానులు, ఆ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ప్రజలు అందరూ కూడా గుర్రుగా ఉన్నారనే సంగతి రాజమౌళికి కూడా తెలుసు. చివరికి బాహుబలి సినిమా రిలీజ్ పై ఆ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలోనే నిర్వాహకులు రెండు వ్యంగ్య వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించడంతో రాజమౌళితో సహా అందరూ హాయిగా నవ్వుకొన్నారు.   మొదటిది బొమ్మరిల్లు సినిమాలో క్లైమాక్స్ సీన్ లో ప్రకాష్ రాజ్, హీరో సిద్దార్ధ మధ్య జరిగిన చాలా పాపులర్ డైలాగ్స్ ఉన్న వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించి, అందులో వారిరువురి డైలాగ్స్ ని మార్చి బాహుబలి సినిమా రిలీజ్ ఇంకా ఎప్పుడు? అని సిద్దార్ధ చేత ప్రకాష్ రాజ్ ని అడిగించడం అందరినీ కడుపుబ్బ నవ్వించింది. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన సుమ కార్యక్రమం మొదటి నుండి సినిమా రిలీజ్ గురింఛి సరదాగా చురకలు వేస్తూనే ఉన్నారు.   ఆమె బాహుబలి సినిమాని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో పోల్చుతూ వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించి మెట్రో రైల్ నిర్మాణం సాగుతూనే ఉంది...బాహుబలి సినిమా కూడా సాగుతూనే ఉంది...సాగుతూనే ఉంది...ఇంకా సాగుతూనే ఉంది......ఎలాగో ఇప్పటికి ఆడియో రిలీజ్ కార్యక్రమం వరకు వచ్చింది...మెట్రో రైల్ ప్రాజెక్టులాగే...అయినా ఇప్పటికీ బాహుబలి సినిమా రిలీజ్ ఎప్పుడో ఎవరికీ తెలియదు...మెట్రో రైల్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు...”అని ఆమె తనదయిన శైలిలో పలికిన మాటలకు రాజమౌళితో సహా అందరూ హాయిగా నవ్వుకొన్నారు.   ఈ కార్యక్రమంలో ఆడియో రిలీజ్ కంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అందరూ రాజమౌళిని ప్రశ్నిస్తుండటం దానికి రాజమౌళి ముసిముసినవ్వులే జవాబులుగా ఇచ్చేరు సమాధానం చెప్పలేదు. తన సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో తన సినిమా రిలీజ్ డేట్ గురించే వ్యంగ్యంగా వీడియోలు ప్రదర్శించడానికి రాజమౌళి అంగీకరించడం, యాంకర్ సుమతో సహా అందరూ ఎన్ని వ్యంగాస్త్రాలు సందిస్తున్నా దానిని ఆయన మనసారా ఆనందించడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.   ఈ కార్యక్రమంలోనయినా సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అందరూ ఆశగా ఎదురుచూసారు. కానీ రాజమౌళి బయటపడలేదు. అందరి కంటే ఆఖరిగా మాట్లాడిన హీరో ప్రభాస్ తన ప్రసంగం ముగిస్తూ రాజమౌళిని మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో జనాలు కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమం ముగించే ముందు ప్రభాస్ నోటి ద్వారానే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం రాజమౌళి ఉద్దేశ్యం కావచ్చును.అందుకే చివరి వరకు ఆయన ఎవరు ఎన్ని సార్లు అడిగినా బయటపడలేదు. చివరిగా ప్రభాస్ ద్వారా బాహుబలి సినిమా రిలీజ్ డేట్ ప్రకటింపజేసి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభాస్ అభిమానులని, తిరుపతి ప్రజలని, టీవీ ద్వారా లైవ్ టెలీకాస్ట్ చూస్తున్న వారిని అందరినీ కూడా ఆనందపరిచారు. బాహుబలి సినిమా జూలై 10వ తేదీన విడుదల అవుతుందని ప్రభాస్ ప్రకటించారు. అంటే సరిగ్గా మరొక మూడు వారాలలోనన్న మాట! చాలా మంచి మాట చెప్పావు డార్లింగ్!

Prabhas

నన్ను ఇంతవాడిని చేసింది ఆయనే: ప్రభాస్

  తెలుగు సినిమా హీరోలలో ప్రభాస్ వంటి మంచి ఒడ్డుపొడుగు, వర్చసు ఉన్న అందగాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. రాష్ట్రంలో ఎందరో కన్నె పిల్లల కలల యువరాజు అతను. అటువంటి వ్యక్తి నిజంగానే బాహుబలి కోసం కత్తి పట్టుకొని, కిరీటం పెట్టుకొని యువరాజుగా మారిపోతే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది..కదా కానీ సుమారు రెండున్నరేళ్ళకు పైగా మరే సినిమా చేయకుండా బాహుబలికే అంకితమయిపోయిన ఆయన కనబడకపోవడంతో ఆయన అభిమానులు చాలా బాధపడ్డారు. కానీ వారి బాధను దూరం చేస్తూ మళ్ళీ ఈరోజు బాహుబలి ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ప్రభాస్ ప్రజల ముందుకు వచ్చేరు. ఇంతవరకు పెద్ద గడ్డం, మీసాలతో చాలా కరుకుగా కనిపించిన ప్రభాస్ ఈరోజు మళ్ళీ అందాల రాకుమారుడిలా తెల్ల చొక్కా వేసుకొని చాలా నీట్ గా ప్రత్యక్షం అయ్యేసరికి అభిమానులు ఆనందం పట్టలేకపోయారు.   ఈ సినిమాకి అపూర్వమయిన సంగీతం అందించిన కీరవాణిని ఆయన తెగ మెచ్చుకొన్నారు. రాజమౌళి దగ్గర సుమారు మూడేళ్ళపాటు శిష్యరికం చేసి చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకొన్నానని అన్నారు. సినీ పరిశ్రమలో తనకు ఈ పునాది వేసిన తన పెదనాన్నగారు అలనాటి మేటి నటుడు కృష్ణంరాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు.   "నా సినీ కెరీర్ లో వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలు పడిన సమయంలో రాజమౌళి నాతో ఈసినిమా తీయాలనుకోవడం నా అదృష్టమే. పెద్ద సినిమా తీస్తున్నామని చెప్పారే గానీ మరీ ఇంత భారీ సినిమా అని నేను మొదట ఊహించలేకపోయాను. ఛత్రపతి సినిమాతోనే మా ఇద్దరి మధ్య ఒక అనుబందం ఏర్పడింది. అది ఈ బాహుబలితో మరింత బలపడింది. మేమంతా ఒకే కుటుంబానికి చెందిన అనుభూతి నాకు కలుగుతోంది.అంతగా కలిపోయాము. రాజమౌళి నాగురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ ఎన్ని సినిమాలు చేసినా ఆయనంతగోప్పవాడిని కాలేను. నేనే ఆయనకి పెద్ద అభిమానిని. ఎటువంటి సమస్యలున్నా నిర్భయంగా నిసంకోచంగా ఆయనకు చెప్పుకోగలను అంత దగ్గరయ్యారు ఆయన."   "బాహుబలి సినిమా భారతదేశ సినీ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు. అదేవిధంగా యావత్ ప్రపంచం కూడా భారతీయ సినీ పరిశ్రమ శక్తి సామర్ధ్యాలు ఈ సినిమాతో గుర్తించబోతున్నాయని చాలా గట్టి నమ్మకంతో చెప్పారు. తనకు ఛత్రపతితో మంచి ఫౌండేషన్ వేసిన రాజమౌళి వలననే అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపునిచ్చే సినిమాను చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందుకు రాజమౌళికి సర్వదా రుణపడి ఉంటానని అన్నారు.

Prabhas

ప్రభాసే నాకు దైర్యం చెప్పేవారు: రాజమౌళి

  శనివారం రాత్రి తిరుపతి యస్వీ యూనివర్సిటీ మైదానంలో బాహుబలి ఆడియో రిలీజ్ చాలా అట్టహాసంగా, విభిన్నంగా, చాలా సరదా సరదాగా ముగిసింది. సినిమాను ఎలాగూ ఆయన తనకి నచ్చినట్లు తీసుకొంటారు. కానీ ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ పై కూడా ఆయన ముద్ర స్పష్టంగా కనబడింది. సుమారు మూడేళ్ళ పాటు నిర్విరామంగా శిల్పం చెక్కినట్లు బాహుబలిని చెక్కిన జక్కన రాజమౌళికి అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే! ఈ సినిమా ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారని? కానీ దానికి ఆయన నేరుగా జవాబు చెప్పకుండా చాలా త్వరలోనే అని తప్పించుకొన్నారు. ఈ కార్యక్రమానికి సినిమాలో నటించిన ప్రభాస్, రాణా, నాజర్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితర తారలందరూ హాజరయ్యారు.   రాజమౌళి మాట్లాడుతూ “ఈ సినిమా షూటింగ్ అనుకొన్న సమయం కంటే సుదీర్ఘంగా సాగుతున్నప్పుడు నేను చాలా ఆందోళన చెందేవాడిని. కానీ ప్రభాస్ ఎప్పుడూ కూడా నాకు దైర్యం నూరిపోసేవాడు. అసలు ఆ స్థాయి హీరో ఏడాది డేట్స్ అడిగితే రెండేళ్ళు ఇవ్వడమే కాకుండా సినిమా పూర్తీ అయ్యేంతవరకు కూడా ఎన్నడూ అభ్యంతరం చెప్పకుండా ఎంతో సహకరించారు. పైగా ఆయనే ఒక అంతర్జాతీయ స్థాయిలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాను మనం చేస్తున్నామని ఆయనే నాకు చాలా దైర్యం చెప్పేవారు. మా మొదటి సినిమా ఛత్రపతికి ఆయన ఎంతగా కష్టపడ్డారో అంతకు వందరెట్లు ఈ బాహుబలి సినిమా కోసం ఆయన కష్టపడ్డారు. ఆయనిచ్చిన ప్రోత్సాహం, సహకారం ఎన్నటికీ మరిచిపోలేను, అని ప్రభాస్ ని తనివితీరా పొగిడేశారు.

MAA

‘మా’ ఎన్నికలపై మళ్ళీ కోర్టుకెక్కిన కళ్యాణ్

  రాజకీయ ఎన్నికలకి ఏ మాత్రం తీసిపోని విధంగా జరిగిన తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఊహించని విధంగా రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దానితో ఇక వివాదాలన్నీ ముగిసినట్లేనని అందరూ భావించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి ఇంతవరకు ఇరు వర్గాలకు చెందినవారు ఎవరూ కూడా మళ్ళీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా మళ్ళీ ఎవరి పనిలో వారు పడిపోవడంతో వివాదాలన్నీ ఇక సమసిపోయాయనే అందరూ అనుకొన్నారు. కానీ ఇంతకు ముందు ‘మా’ ఎన్నికలు సక్రమంగా నిర్వహించలేదనే పిర్యాదుతో కోర్టుకెక్కిన సినీ నటుడు ఓ. కళ్యాణ్, మళ్ళీ అదే పిర్యాదుతో మొన్న సిటీ సివిల్ కోర్టులో పిటిషను వేశారు. ఆయన వేసిన పిటిషన్ పై స్పందించిన కోర్టు కొత్తగా ఎన్నికైన మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్, శివాజీ రాజాలకు నోటీసులు జారీ చేసింది. అంతా సర్దుమణిగిందనుకొంటునప్పుడు మళ్ళీ ఆయన కోర్టుకి ఎందుకు ఎక్కారో...ఆయనను వెనుక నుండి ఎవరు ప్రోత్సహిస్తున్నారో అని అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.

Tollywood Actor

త్వరలో అల్లరి నరేష్ వివాహం

  ప్రముఖ హాస్య నటుడు అల్లరి నరేష్ త్వరలో చెన్నై కి చెందిన విరూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 3వ తేదీన చెన్నైలో వారి నిశ్చితార్దం అవుతుందని సమాచారం. విరూప తల్లి తండ్రులు కృష్ణా జిల్లాకు చెందిన వారు కానీ చెన్నై లో స్థిరపడ్డారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత విరూప చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఒకటి రెండు నెలలనే వారి వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లరి నరేష్ సాయి కిషోర్ దర్శకత్వంలో ‘జేమ్స్ బాండ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘నేను కాదు నా పెళ్ళాం’ అనే ట్యాగ్ లైన్ పెట్టేరు. ఈ సినిమాలో సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

ఆ నగ్న వీడియోలు సోనాక్షివేనా?

  సోషల్ మీడియాలోకి ఎంటరైతే చాలు... ఈ నగ్న వీడియో ఫలానా హీరోయిన్‌ది అంటూ అనేక వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ ధోరణి హాలీవుడ్ హీరోయిన్ల విషయంలో బాగా కనిపిస్తూ వుంటుంది. అప్పుడప్పుడు మన హీరోయిన్ల పేర్లతో కూడా ఇలాంటి వీడియోలు షికార్లు చేస్తూ వుంటాయి. ఈమధ్య కొందరు దక్షిణాది హీరోయిన్లవిగా చెబుతూ కనిపించిన వీడియోలు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు వీటి బారిన బాలీవుడ్ అందగత్తె సోనాక్షి సిన్హా కూడా పడింది. సోనాక్షి సిన్హా పోలికలతో వున్న ఒక యువతి నగ్న వీడియోలు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని సోనాక్షి దృష్టికి మీడియా తీసుకెళ్ళినప్పుడు ఆమె కస్సుమంది. ఆ వీడియోలు తనవి కావని, తనను అప్రతిష్ఠపాలు చేయడానికి ఎవరో కుట్రపన్ని ఈ వీడియోలను వ్యాప్తి చేస్తున్నారని చెప్పింది.

కత్రినా ఛాన్స్ కొట్టేసింది

  బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సూపర్ ఛాన్న్ కొట్టేసింది. మొట్ట మొదటిసారి ప్రఖ్యాత కేన్స్ చిత్రోత్సవంలో మెరవనుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ తారలు ఐశ్వరాయ్ బచ్చన్, సోనమ్ కపూర్ లు మాత్రమే కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడు వారితో పాటు కత్రినా కైఫ్ కూడా సందడి చేయనుంది. ప్రస్తుతం తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న లోరియల్ సంస్ధ తరుపున కేన్స్ లో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2015 కార్యక్రమానికి హాజరుకానుంది. ఫ్రాన్స్ లోని కేన్స్ లో మే 13 నుండి 24 ఈ ఉత్సవాలు జరగనున్నాయి. భారత్ తరపున మొదటిసారి కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొంటున్నందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందని కత్రినా కైఫ్ తెలిపింది.