ghost spirit

ఆత్మ ఉందని శాస్త్రవేత్తలు కనుక్కొన్నారా?

  మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అన్న విషయం మీదే మతాలన్నీ ఆధారపడి ఉన్నాయంటారు. అందుకనే ఈ విషయం మీద బోల్డు చర్చలు, వాదనలు సాగుతుంటాయి. కొంతమంది మరో అడుగు ముందుకు వేసి ఫలానా దేశంలో ఆత్మ బరువు ఎంత ఉందో లెక్కకట్టారనీ, ఫలానా చోట ఆత్మని ఫొటో తీశారనీ చెబుతూ ఉంటారు. ఇలాగే రెండేళ్ల క్రితం కొందరు జర్మనీ శాస్త్రవేత్తలు ఆత్మ ఉందని నిరూపించారన్న వార్త గుప్పుమంది. ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఈ వార్తే కనిపించింది. ఇండియాటుడే లాంటి పత్రికలు సైతం ఈ వార్తని ప్రచురించాయి. ఈ వార్త ప్రకారం జర్మనీలోని టెక్నిసే విశ్వవిద్యాలయంలో Dr Berthold Ackermann అనే శాస్త్రవేత్త పనిచేస్తున్నారు.   ఈయన ఆధ్వర్యంలో నాలుగేళ్లపాటు శరీరం వేరు, ఆత్మ వేరు అని కనుగొనే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయోగం కోసం 900 మందికి పైగా కార్యకర్తలను ఎన్నుకొన్నారట. వీరిలో ఆస్తికులు, నాస్తికులు, హిందువులు, ముస్లింలు.. అన్న బేధాలు లేకుండా అన్నిరకాల వారూ ఉన్నారు. పరిశోధన కోసం ఎన్నుకొన్న అభ్యర్థులందరినీ తాత్కాలిక కోమాకి గురిచేశారు. ఒక ఇరవై నిమిషాల తర్వాత వారిలో తిరిగి కదలికలను తీసుకువచ్చారు. మరణానికి దగ్గరగా ఉన్న ఆ పరిస్థితిలో వారు ఎలాంటి అనుభూతికి లోనయ్యారో తెలియచేయమని చెప్పారు. ఆశ్చర్యంగా అభ్యర్థులంతా కూడా తాము ఒకేరకమైన అనుభూతులు పొందామని చెప్పారు.   తాము శరీరం నుంచి వేరైనట్లుగా తోచడం, ఆకాశంలో తేలిపోతూ ఉండటం, అంతులేని ప్రశాంతత, అప్పటిదాకా ఉన్న భయాందోళనలన్నీ చెరిగిపోవడం, గాలిలో కరిగిపోతున్నట్లుగా అనిపించడం... లాంటి అనుభూతులన్నీ అభ్యర్థులకి కలిగాయట. తాము ఒక కాంతిపుంజం ముందు నిలబడిన భావన కూడా కలిగిందట! మతాలకు అతీతంగా, నాస్తికులకు సైతం ఇలాంటి అనుభవాలు కలిగాయట!   ఈ వార్త World News Daily Report అనే వెబ్సైటులో కనిపించగానే సంచలనంగా మారిపోయింది. వెంటనే ప్రపంచంలోని జాతీయ పత్రికలన్నీ ఈ వార్తని ప్రచురించేశాయి. ఈ వార్తలో ఎలాంటి నిజమూ లేదన్నది చాలామంది వాదన. కానీ వార్తలో పేర్కొన్న ‘ఆత్మానుభూతులు’ మనం ఈ మధ్యకాలంలో చదువుతున్న ఆధ్యాత్మిక పుస్తకాలను దగ్గరగా ఉండటంతో... ఈ వార్త నిజమే అని ఒప్పుకునేవారూ ఉన్నారు. పరిశోధన జరిగిందో లేదో కానీ, జరిగితే ఇదే బయటపడుతుందని ఆస్తికుల వాదన! - నిర్జర.    

gambling

పేకాట మాన్పించే మందులు వచ్చేస్తున్నాయి!

  కొంతమందిని చూడండి! ఒక పద్ధతి అనుకుని దాని ప్రకారమే జీవించేస్తుంటారు. ఆ పద్ధతికి ఓ అడుగు అటూ ఇటూ ఒక్క అడుగైనా వేసేందుకు సిద్ధపడరు. మరికొందరు ఇందుకు పూర్తిగా భిన్నం. వాళ్ల తీరుని ఊహించడం కష్టం. మనిషి మనిషికీ మధ్య ఈ తేడాలేంటి. ఒకరు దూకుడుగా ఉంటే, మరికొందరు అతిజాగ్రత్తగా ఎందుకు ప్రవర్తిస్తారు? కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు, ఈ ప్రశ్నకి జవాబు కనుక్కొనే ప్రయత్నం చేశారు. ఈ జవాబు చాలా సమస్యలకి పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు.   దూకుడుగానో, పద్ధతిగానో ప్రవర్తించే సమయంలో మన మెదడులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో గమనించే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం కొన్ని ఎలుకలకి ల్యాబొరేటరీలో ఓ పరీక్ష పెట్టారు. వాటికి ఐపాడ్ మీద రెండు దృశ్యాలని చూపించారు. మొదటి దృశ్యాన్ని ఎలుక ముట్టుకున్నప్పుడు, దానికి వెంటనే ఓ స్వీట్ ఇచ్చారు. రెండో దృశ్యాన్ని ఎలుక ముట్టుకున్నప్పుడు కూడా దానికి స్వీట్ ఇచ్చేవారు... కాకపోతే అది ఇవ్వడంలో కాస్త అనిశ్చితి ఉండేది. అంటే స్వీట్ దక్కుతుంది కానీ... దాన్ని ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో ఎలుకలు ఉండేవన్నమాట!   సహజంగానే కొన్నిరకాల ఎలుకలు వెంటనే స్వీట్ తినేందుకు ఇష్టపడి ఎప్పుడూ మొదటి దృశ్యాన్నే ఎన్నుకొనేవి. మిగతా ఎలుకలు స్వీట్ ఎప్పుడు దక్కినా ఫర్వాలేదు అనుకుంటూ రెండో దృశ్యాన్ని ఎన్నుకొనేవి. ఇలా అనిశ్చితికి సిద్ధంగా ఉండే ఎలుకలలోని మెదడు పనితీరు భిన్నంగా ఉన్నట్లు గ్రహించారు. వీరి మెదడులోని orbitofrontal cortex అనే వ్యవస్థ పనితీరు కాస్త నిదానంగా ఉంది. దాంతో ఎదుర్కోబోయే అనిశ్చితిని అవి ఊహించ లేకపోయాయి. ఇక అనిశ్చితికి సిద్ధపడే ఎలుకల మెదడులో gephyrin అనే ప్రొటీను కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు తేలింది.   మనిషికీ మనిషికీ మెదడులో ఉండే తేడాల వల్లే వారి ప్రవర్తనలో మార్పులు ఉంటాయని తేలిపోయింది. దాంతో మున్ముందు ప్రవర్తనకి సంబంధించి ఎలాంటి సమస్యనైనా మందులతో నివారించవచ్చని ఆశిస్తున్నారు. ఆటిజం వంటి అనేక సమస్యలకి ఈ మందుతో నివారణ సాధ్యమంటున్నారు. అంతేకాదు! పేకాట ఆడేవారిలో అనిశ్చితిని ఇష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక నిరంతరం పద్ధతిగా ఉండాలనుకునేవారిలో చాదస్తం ఎక్కువగా కనిపిస్తుంది. Gephyrin ప్రొటీనులో మార్పులు తీసుకురావడం వల్ల పేకాట, చాదస్తంలాంటి సమస్యలని కూడా మందులతో నివారించవచ్చునట! - నిర్జర.    

face reading

ఉన్నవాడో లేనివాడో... మొహం చూస్తే తెలిసిపోతుంది

‘Face is the index of the mind’ అంటూ ఉంటారు పెద్దలు. మన మొహం చూస్తే, మనసులో ఏముందో చెప్పేయవచ్చన్నది వారి భావన. కానీ ఒకరి మొహం చూసీచూడగానే... ఇతను ఉన్నవాడనో, లేనివాడనో చెప్పేయవచ్చా! మొహంలో ఎలాంటి భావనా కనిపించకపోయినా, అతని అంతస్తుని పసిగట్టవచ్చా! అంటే భేషుగ్గా అంటున్నారు పరిశోధకులు. టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు... మొహాన్ని చూసి మనిషి ఆస్తిపరుడా, కాదా అన్న విషయాన్ని ఎంతవరకు పసిగడతామో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 60వేల డాలర్ల ఆదాయం ఉన్నవారు కొందరినీ, లక్షకు పైగా డాలర్ల ఆదాయం ఉన్నవారు కొందరినీ ఫొటోలు తీశారు. ఈ ఫొటో తీసే సమయంలో వారి మొహంలో చిరునవ్వూ, బాధా, కోపం లాంటి ఏ భావమూ లేకుండా ఉండేట్లు జాగ్రత్తపడ్డారు.   పరిశోధకులు తాము తీసిన ఫొటోలని కొందరు వాలంటీర్లకు చూపించారు. విచిత్రంగా సగానికి పైగా సందర్భాలలోనే అవతలి మనిషి పేదా, గొప్పా అన్న విషయాన్ని ఇట్టే పసిగట్టేశారట. ఎదుట ఉన్నది ఆడామగా, తెల్లవాడా నల్లవాడా అన్న బేధాలేవీ ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదు. చూసీ చూడగానే ఠక్కున ఫొటోలోని వ్యక్తి ఆర్థిక పరిస్థితిని తేల్చేశారు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా... ఇదంతా కూడా మన మెదడుకి ఉన్న సామర్థ్యమే అంటున్నారు. మొహాలని పసిగట్టడంలో మన మెదడు మహా దిట్ట అట. ఆఖరికి మబ్బులని చూసినా కూడా, వాటిని ఏదో ఒక మొహంతో పోల్చుకోగలదు. ఎదుటివారు సంతోషంగా ఉన్నారా, విరక్తిగా ఉన్నారా అన్నది కూడా దానికి తెలిసిపోతుంటుంది. అదే సూత్రంతో వాళ్లు పేదా గొప్పా అన్నది అంచనా వేసేస్తుంది.   అనారోగ్యం, కుటుంబ కష్టాలు దీర్ఘకాలం ఉండకపోవచ్చు. కానీ పేదరికంలో పుట్టినవారు దాని నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. ఆ పేదరికం కలిగించే అసంతృప్తి, బాధ వారిని వేధిస్తుంది. ఒక మనిషి సుదీర్ఘకాలం సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా... కొన్నాళ్లకి ఆ భావం అతని మొహం మీద స్థిరపడిపోతుందట! అంటే ఓ వయసు వచ్చిన తర్వాత మనం ఏ భావమూ లేకుండా ఉన్నా కూడా, మన పరిస్థితి అన్నది అవతలి మనిషికి తెలిసిపోతుందన్నమాట!   మన ఆర్థిక పరిస్థితి అవతలివారికి తెలియడం వల్ల నష్టం ఏమిటి? అన్న అనుమానం రావచ్చుగాక! ఏ ఉద్యోగానికో, పెళ్లిచూపులకో, అప్పు కోసమో వెళ్లినప్పుడు... సహజంగానే అవతలి వ్యక్తికి మన మీద తెలియకుండానే ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మన పేదరికం మరింత శాపంగా పరిగణిస్తుంది. పరిశోధకులు దీనికి నివారణోపాయాన్ని చెప్పలేదు కానీ... జీవితంలో ఎలాంటి సమస్యనయినా చిరునవ్వుతో ఎదిరించే ధైర్యం, ఉన్నదానిలో తృప్తిగా ఉండే తత్వం ఉంటే మన మొహంలో ఎలాంటి పేదరికమూ కనిపించకపోవచ్చు. - నిర్జర.    

drinking of beer

ఈ బీరు తాగితే ఆరోగ్యమట!

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ మాట మనం లక్షసార్లు వినే ఉంటాము. కాకపోతే మోతాదులో పుచ్చుకుంటే మద్యం వల్ల ఉపయోగం ఉంటుందని కొందరు నమ్ముతుంటారు. అప్పుడప్పుడూ ఓ గుటక వేస్తే తప్పేంటని మరికొందరు వాదిస్తుంటారు. మొత్తానికి మద్యం తాగేవాళ్లు సర్వకాల సర్వావస్థల్లోనూ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి మందుబాబులకి ఇప్పుడు ఓ శుభవార్త! ప్రోబయాటిక్‌ అన్న పదం ఇప్పుడు చాలా సందర్భాలలో వినిపిస్తోంది. శరీరానికి మేలు చేసే సూక్ష్మజీవులనే మనం ప్రోబయాటిక్స్‌ అంటున్నాము. రోగంతో పాటుగా శరీరానికి కూడా హాని తలపెట్టే యాంటీబయాటిక్‌ మందుల కంటే, ఇప్పుడు ప్రోబయాటిక్‌ మందులకే వైద్యులు ప్రాధాన్యతని ఇస్తున్నారు. మున్ముందు ఆహారపదార్థాలకి కూడా ఈ ప్రోబయాటిక్స్‌ను కలిపి తినే రోజులు రానున్నాయి. ఇంత మంచి ప్రోబయాటిక్స్‌ను బీరులో ఎందుకు కలపకూడదన్న ఆలోచన వచ్చింది సింగపూర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులకి. కానీ బీరులో ప్రోబయాటిక్స్‌ బతకడం దాదాపు అసాధ్యం! బీరులో ఉండే ‘హాప్‌ యాసిడ్స్‌’ అనే రసాయనాలతో ప్రోబయాటిక్స్‌ మనుగడ సాగించడం అసాధ్యం. అందుకని దాదాపు తొమ్మిదినెలలపాటు శ్రమించి ప్రోబయాటిక్స్‌కు అనుకూలంగా ఉండే బీరు తయారీ విధానాన్ని కనుగొన్నారు. బీరు తయారీలో మార్పు తేవడం ద్వారా సగం పని పూర్తయింది. ఇక అందులోకి ఎలాంటి ప్రోబయాటిక్స్ అనుకూలమో గమనించే ప్రయత్నం చేశారు. Lactobacillus paracasei (L26) అనే పదార్థమైతే బాగుంటుందని తేల్చారు. పాలల్లో కనిపించే లాక్టిక్‌ యాసిడ్‌లో ఒక రకమే ఈ L26. మన పేగులలో కనిపించే ఈ ప్రోబయాటిక్‌ శరీరంలోని హానికారక రసాయనాలకి (toxins) విరుగుడుగా పనిచేస్తుందట. వైరస్‌ను ఎదుర్కోవడంలో, రోగనిరోధకశక్తిని పెంపొందించడలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని తేలింది. ఇక ఇలాంటి ప్రోబయాటిక్ ఉన్న బీరు తాగితే ఆరోగ్యం గ్యారెంటీ అంటున్నారు. ఈ బీరుని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఏదన్నా సంస్థ ముందుకు వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు.   - నిర్జర.

Ankylosing spondylitis

కామెడీ సినిమాలతో చావుని జయించాడు

  నార్మన్ కజిన్స్- ఈ పేరు చాలామంది విని ఉండకపోవచ్చు! కానీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో పరిచయం ఉన్నవారు ఎక్కడో అక్కడ, ఏదో ఒక సందర్భంలో ఆయన గురించి వినే ఉంటారు. మనిషిలో సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసుకోవాలంటే... నార్మన్ జీవితమే ఓ ఉదాహరణ!   నార్మన్ ఓ జర్నలిస్ట్. అమెరికాలోని ఓ ప్రముఖ పత్రికలో చేరి, క్రమక్రమంగా దాని మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి ఎదిగిన సమర్థుడు. ప్రపంచశాంతి కోసం పాటుపడినవాడు. జపాను మీద అమెరికా అణుదాడి చేసినప్పుడు, నిర్భయంగా తన నిరసనను వ్యక్తపరిచిన వ్యక్తి. నార్మన్ వ్యక్తిగత జీవితమూ, వృత్తి జీవితమూ చాలా అద్భుతంగా సాగిపోతున్న కాలంలో ఓ పిడుగులాంటి వార్త వినిపించింది.   1964లో నార్మన్కి 49 ఏళ్ల వయసు ఉండగా... అతనికి Ankylosing spondylitis అనే అరుదైన వ్యాధి ఉందని తేల్చారు. అప్పట్లో ఈ వ్యాధి వచ్చినవారు బతికేందుకు అవకాశం చాలా తక్కువగా ఉండేదట. ఈ వ్యాధి సోకి ప్రతి 500 మందిలో ఒక్కరు మాత్రమే బతికే అదృష్టం ఉంటుందట. మరికొద్ది రోజులలో నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి ‘చివరగా’ పూర్తిచేసుకోవాల్సిన పనులు ఏమన్నా ఉంటే పూర్తిచేసుకోమంటూ.... వైద్యులు నార్మన్కు సూచించారు.   ఒకపక్క తాను అతి త్వరలో చనిపోబోతున్నానన్న విషాధం. మరోపక్క ఆ వ్యాధి కలిగిస్తున్న అంతులేని బాధ. దాంతో నార్మన్కు ఏం చేయాలో పాలుపోలేదు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆయనకి ఓ ఆలోచన వచ్చింది. రోగం, బాధ కలిసి ఉన్నప్పుడు- ఆరోగ్యం, సంతోషం కూడా కలిసి ఉండాలి కదా! తను బాధగా ఉంటే రోగం నయం కాకపోవచ్చు. కానీ సంతోషంగా ఉంటే ఏదన్నా అద్భుతం జరగవచ్చు కదా! ఆ ఆలోచన రాగానే నార్మన్ ఓ నిర్ణయానికి వచ్చాడు.   నార్మన్ వెంటనే హాస్పిటల్లోంచి బయటకు వచ్చేశాడు. ఓ హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు. తను పోగుచేసుకున్న సంపాదనతో ఓ ప్రొజెక్టరు కొన్నాడు. ఇక అంతే! ఆ ప్రొజెక్టరులో కామెడీ సినిమాలు వేసుకోవడం, అదే పనిగా నవ్వడం- ఇదే దినచర్యగా పెట్టుకొన్నాడు. వాటికి తోడు రోగనిరోధశక్తిని పెరిగేందుకు పుష్కలంగా C విటమిన్ పుచ్చుకున్నాడు.   ఫలితం! ఎవ్వరూ నమ్మలేని విధంగా నార్మన్ మామూలు మనిషి అయిపోయాడు. కొద్ది రోజుల్లో చనిపోతావని చెప్పిన వైద్యుల మాటలని తారుమారు చేస్తూ మరో 26 ఏళ్లు బతికాడు. ఆ తర్వాత కాలంలో సంతోషంగా ఉండటం వల్లా, నవ్వు వల్లా ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉంటాయో చెబుతూ బోలెడు పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. నవ్వుతో immunoglobulin A, T lymphocytes వంటి రోగనిరోధకశక్తిని పెంపొందించే కణాలు వృద్ధి చెందుతాయని తేలింది. నవ్వుతో శరీరంలో ఉండే వైరస్, క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని బయటపడింది.   నార్మన్ తన అనుభవంతో Anatomy of an Illness అనే పుస్తకాన్ని రాశాడు. సానుకూల దృక్పథంతో, చిరునవ్వుతో తాను చావుని ఎలా జయించాడో అందులో చెప్పుకొచ్చాడు. వ్యక్తిత్వ వికాస రంగంలో ఆ పుస్తకం ఇప్పటికీ ఓ సంచలనమే! - నిర్జర.      

bald head

పొట్టిగా ఉండేవారిలో బట్టతల ఎందుకు?

  మీరో విషయాన్ని గమనించారా! తెల్లగా, పొట్టిగా ఉండేవారిలో బట్టతల కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కావాలంటే మరోసారి కళ్లుమూసుకుని మీ పరిచయస్తులందరినీ గుర్తుచేసుకుని చూడండి. ఇదేమీ మూఢనమ్మకం కాదండోయ్. జన్యు పరిశోధకులు తేల్చి చెబుతున్న విషయం.   బట్టతల అనేది జన్యుపరంగా వచ్చే సమస్య అని తెలుసు. కానీ బట్టతలని కలిగించే జన్యువులు ఇతరత్రా లక్షణాలు కూడా ఏమన్నా చూపించగలవా? అన్న అనుమానం వచ్చింది కొందరు జర్మనీ శాస్త్రవేత్తలకి. ఆలోచన వచ్చిందే తడవుగా చిన్నవయసులోనే బట్టతల వచ్చేసిన ఓ 11వేల మంది జన్యువులనీ, అసలు బట్టతలే లేని ఓ 12వేల మంది జన్యువులనీ పరిశీలించి చూశారు. వీరంతా కూడా ఒక్కదేశానికి చెందినవారు కాదు. ఏడు వేర్వేరు దేశాలకి చెందిన అభ్యర్థులు!   అభ్యర్థులందరి జన్యువులనీ పరిశీలించిన మీదట... బట్టతల ఉన్నవారిలో ఓ 63 జన్యువులు భిన్నంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు! ఈ జన్యువుల ఇతరత్రా లక్షణాలకు కూడా కారణం అవుతున్నట్లు బయటపడింది. బట్టతల కలిగించే జన్యువులు... తెల్లటి చర్మానికీ, తక్కువ ఎత్తుకీ, కొన్ని రకాల కేన్సర్లకీ కూడా కారణం అవుతున్నట్లు గమనించారు. ముఖ్యంగా వీరిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గ్రహించారు. అలాగే బట్టతలని కలిగించే జన్యువులతోనే గుండెజబ్బు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే కనిపించింది!   తెల్లటి చర్మం ఉన్నవారిలో బట్టతల రావడానికి కారణం లేకపోలేదు. తెల్లగా ఉన్నవారిలో సూర్యకాంతి నుంచి విటమిన్ ‘డి’ని సంగ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి తల మీద ఉన్న చర్మం కూడా ఆ పని చేసేందుకు వీలుగా, నెత్తిన వెంట్రుకలు పలచబడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తెల్లగా ఉండేవారి బట్టతల ఓ సోలార్ ప్యానెల్లాగా పనిచేస్తుందన్నమాట! కానీ గుండెజబ్బులు, ప్రొస్టేట్ కేన్సర్లాంటి ఇతరత్రా సమస్యలకీ బట్టతలకీ మధ్య కారణం ఏమిటో మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.   శతాబ్దాల తరబడి రకరకాల జన్యు పరివర్తనాలు (gene mutations) ఏర్పడటం సహజం. ఈ ప్రక్రియలో భాగంగా కొంతమందికి కొన్ని రకాల జన్యువుల సంక్రమిస్తూ ఉంటాయి. వీటితో కొన్ని లాభాలూ ఉంటాయి, కొన్ని నష్టాలూ ఉంటాయి. నాకు బట్టతల ఉంది కాబట్టి గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ అని బాధపడాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే... ఈ ప్రమాదాన్ని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. - నిర్జర.  

empty stomach

ఖాళీకడుపు మీద ఇవి అస్సలు తినకూడదట!

  ఉదయం లేవగానే కడుపు నకనకలాడిపోతుంటుంది. ఏదో ఒకటి పొట్టలో పడకపోతే, మనసంతా చిరాగ్గా మారిపోతుంది. కానీ ఆకలి తీర్చుకునే ధ్యాసలో ఏదిపడితే అది తినేస్తే మాత్రం... ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమంటున్నారు. అలా ఖాళీ కడుపుకి దూరంగా ఉంచాల్సిన పదార్థాలు కొన్నింటిని సూచిస్తున్నారు...   ఆరటిపళ్లు   ఉదయాన్నే తినేందుకు ఏదీ కనిపించకపోతే ఓ అరటిపండుని నమిలిపారేస్తాం. అరటిపండులో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఖాళీకడుపున జీర్ణమయ్యే ఈ మెగ్నీషియం గుండె, నాడీవ్యవస్థ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట!   మసాలాలు   ఉదయాన్నే వేడివేడి సమోసానో, నోరూరించే పరోటా కుర్మానో తినేస్తుంటారు. ఖాళీ కడుపు మీద ఇలా పచ్చిమిర్చి, మసాలాలు దట్టించిన ఆహారం తినడం వల్ల పేగులు దెబ్బతిని అల్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. పైగా ఇలాంటి ఘాటైన పదార్థాల వల్ల జీర్ణరసాలు ఎక్కువగా ఊరి అసెడిటీకి కూడా దారితీస్తాయట.   టీ – కాఫీ   కాఫీ,టీలలో ఉండే కెఫిన్ వల్ల తాగిన వెంటనే కాస్త ఉత్సాహంగా ఉంటే ఉండవచ్చుగాక! కానీ ఖాళీ కడుపున ఇవి పుచ్చుకుంటే మాత్రం అజీర్ణం తప్పదంటున్నారు. అంతేకాదు! పరగడుపున తాగే టీ, కాఫీలు బైల్ అనే రసాయనం ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయట. దానివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, ఊబకాయం వంటి సమస్యలు రావచ్చునంటున్నారు. కాబట్టి టీ, కాఫీలు అలవాటు ఉన్నవారు... అల్పాహారం తిన్న తరువాతనో, ఓ గ్లాసుడు మంచినీరు తాగిన తర్వాతనో మాత్రమే వాటిని పుచ్చుకోవాలని సూచిస్తున్నారు.   తీపిపదార్థాలు   పరగడుపున చాక్లెట్లు, స్వీట్స్, జ్యూసులు, కూల్డ్రింక్స్ వంటి తీపిపదార్ధాలు తీసుకోవడం అంటే లివర్ నెత్తిన ఇంత విషం పోయడమే అంటున్నారు. మద్యం తాగడం వల్ల లివర్ మీద ఎంత భారం పడుతుందో... ఖాళీ కడుపున తీపి తినడం వల్ల కూడా అంతే ప్రమాదమట!   టమాటాలు   చూస్తూ చూస్తూ ఎవరూ పరగడుపున టమాటాలు తినరనుకోండి. కానీ చపాతీలలోకో, సలాడ్లలో భాగంగానో పచ్చి టమాటాలు తినే అలవాటు మాత్రం చాలామందికి ఉంటుంది. టమాటాలలో ఉండే ‘టేనిక్ యాసిడ్’ అనే రసాయనం జీర్ణవ్యవస్థని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందట!   పచ్చికూరలు   ఉదయం లేవగానే దోసెలు,పూరీలులాంటి నూనెపదార్థాల బదులు చక్కగా పచ్చికూరలు తినవచ్చు కదా! అన్న ఆలోచన రావడం మంచిదే. కానీ మన శరీరం పచ్చి ఆహారాన్ని తినే అలవాటు నుంచి దూరమై చాలా శతాబ్దాలే గడిచిపోయింది కదా! అలాంటి శరీరంలోకి ఇప్పుడ అకస్మాత్తుగా ఖాళీకడుపున పచ్చికూరలు వేస్తే... వాటిలోని పీచు పదార్థాలతో పేగులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదంటున్నారు. కాబట్టి జీర్ణవ్యవస్థ బాగోలేనివారు పరగడుపున ఈ పచ్చికూరలకి దూరంగా ఉండమని సూచిస్తున్నారు.   ఇవే కాదు- పుల్లటి పళ్లు, మద్యం, బేకరీ పదార్థాలు కూడా పరగడుపున మంచిది కాదని సూచిస్తున్నారు. - నిర్జర.      

inspirational quotes

99 వేల రూపాయల సంఘం

ఒకానొక సమయంలో ఓ గొప్ప జమీందారు ఉండేవాడు. నౌకర్లూ, చాకర్లూ, పొలాలూ, వాహనాలూ, భవనాలూ... ఇలా అన్నిరకాల సంపదలూ ఆ జమీందారు దగ్గర ఉన్నాయి. కానీ ఏం లాభం! అతని మనసులో ప్రశాంతత లేదు, అతని జీవితంలో సంతోషం లేదు. ఓ రోజు ఎప్పటిలాగే జమీందారు దిగాలుగా తన తోటలో కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో ఒక పనివాడు తోటలో ఉత్సాహంగా పనిచేయడం అతని కంటపడింది. ఆ పనివాడి ఒంటి మీద సరైన బట్ట లేదు. అయినా ఆడుతూపాడుతూ పనిచేస్తున్న అతన్ని చూసి జమీందారుకి ఆశ్చర్యం వేసింది. ‘ఇంత సంపద ఉన్న నేనే నిస్సారంగా జీవితాన్ని గడిపేస్తుంటే... ఈ పేదవాడు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు?’ అనిపించింది. జమీందారుగారు తన మనసులో మాటని వెంటనే దివాన్జీతో పంచుకున్నాడు. దానికి దివాను- ‘ఆ పేదవాడు ఎందుకంత సంతోషంగా ఉన్నాడో... అతని సంతోషాన్ని దూరం చేసే ఉపాయం ఏమిటో నాకు తెలుసు. మీరు ఒక్క 99 వేలు ఇచ్చారంటే... నేను మీకో విచిత్రం చూపిస్తాను,’ అన్నాడు. దివాన్జీ మాట మీద నమ్మికతో జమీందారు ఓ 99 వేలు అతని చేతిలో పెట్టారు. ఆ రోజు రాత్రి పేదవాడి ఇంటి ముందర 99 వేల రూపాయలున్న మూటని గుట్టుచప్పుడు కాకుండా పెట్టాడు దివాన్జీ! మర్నాడు ఉదయమే లేచి ఆ డబ్బుని చూసిన పేదవాడి సంబరానికి అంతులేకుండా పోయింది. ఈ దెబ్బతో తాను లక్షాధికారిని అయిపోయానని మురుసుకున్నాడు. కానీ లెక్కపెట్టి చూస్తే ఏముంది! ఆ డబ్బు సరిగ్గా 99 వేలే ఉంది. ఈ డబ్బుని ఎవరు అందించారో కానీ, ఎటూ కాకుండా ఇచ్చారేమిటా అని సందేహపడ్డాడు. ఇంకొక్క వేయి రూపాయలు ఉంటే తాను లక్షాధికారిని అయ్యేవాడిని కదా అని బాధపడ్డాడు. ‘ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది! ఈ నెల కాస్త కష్టపడి పనిచేశానంటే ఓ వేయి రూపాయలు మిగుల్చుకుని ఆ లోటుని పూర్తిచేయవచ్చు. ఆ తర్వాత లక్షరూపాయలని ఏం చేయాలా అని ఆలోచించవచ్చు!’ అని అనుకున్నాడు. మర్నాటి నుంచి ఆ పేదవాడి తీరు మారిపోయింది. ఆ వేయి రూపాయల లోటుని పూడ్చడమే అతని ధ్యేయంగా మారిపోయింది. పనిలోంచి పాట దూరమైపోయింది, మొహంలో స్పష్టంగా చింత కనిపిస్తోంది. ఆ వేయి రూపాయలని పూడ్చేందుకు తన భార్యాబిడ్డలను కూడా పనికి పంపడం మొదలుపెట్టాడు. కానీ అదేం చిత్రమో కానీ... నెల పూర్తయినా కూడా వేయి రూపాయల లోటు నిండలేదు సరికదా.... ఏదో ఒక ఖర్చు పేరుతో ఉన్న డబ్బులోంచి కొంత కరిగిపోయింది. దాంతో లోటు మరింత లోతుకి చేరుకుంది. ఇలా నెల, రెండు నెలలు కాదు... ఆరు నెలలు గడిచిపోయాయి- కానీ లోటుని పూడ్చడం పేదవాడి వల్లకాలేదు. దాంతో అతని చింత కూడా పెరిగిపోసాగింది. పైగా ఎవరన్నా ఆ డబ్బు కోసం తిరిగివస్తారేమో అన్న భయమూ మొదలైంది. ఇప్పుడు మనిషిలో నవ్వు లేదు, పనిలో జీవం లేదు... మొత్తంగా అతని జీవితంలో సంతోషమే లేదు! ఒకరోజు జమీందారుగారు ఏదో పనిమీద తోటకి వచ్చినప్పుడు, ఆయన కంటికి ఈ పేదవాడు కనిపించాడు. ఆనాడు సంతోషానికి నిర్వచనంగా చూసిన మనిషికీ, ఆ రోజున దుఃఖానికి ప్రతిరూపంగా కనిపించి వ్యక్తికీ ఏమాత్రమూ పొంతన లేదయ్యే! ఇదంతా దివాన్జీ పన్నిన ఉపాయపు ఫలితమే అని అర్థమైంది. వెంటనే దివాన్జీని పిలిపించి విషయాన్ని వాకబు చేశాడు. దివాన్జీ, జమీందారుకి జరిగిన విషయమంతా చెప్పాడు. ‘ప్రభూ! ఇప్పుడతను 99వేల రూపాయల సంఘంలో సభ్యుడు! అందుకే అతనికి ఆ చింత!’ అన్నాడు దివాన్జీ. ‘99వేల రూపాయల సంఘమా! అదేంటి?’ అని ఆశ్చర్యంగా అడిగాడు జమీందారు. ‘తనకి ఉన్నదానితో సంతృప్తి పడకుండా, ఆ ఉన్నది చేజారిపోతుందేమో అని భయపడుతూ, ఉన్నదానికి మరింత జోడించాలనే తపనతో వ్యాకులపడుతూ... జీవితాన్ని చేజార్చుకునేవారంతా ఈ 99వేల రూపాయల సంఘంలోని సభ్యులే!’ అని చెప్పుకొచ్చాడు. ‘అంటే ఇప్పుడు మనం కూడా ఆ సంఘంలోని సభ్యులమే అంటారా!’ అని అడిగాడు జమీందారు. ‘అందులో సందేహమేముంది ప్రభూ! లేకపోతే మీ మనసులో ఎప్పుడూ ఎడతెగని చింత ఎందుకు ఉంటుంది?’ అని సెలవిచ్చాడు దివాన్జీ. అప్పటి నుంచి జమీందారు తనకి ఉన్నదాంతో సంతృప్తి చెందడం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నంతో అతని జీవితంలోకి సంతోషం కూడా ప్రవేశించింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

Sylvester Stallone

Sylvester Stallone – అతని జీవితమే ఓ సినిమా!

  అనగనగా ఓ హీరో! అతను నానాకష్టాలూ పడతాడు. ఆ కష్టాలు చూసినవారెవ్వరికైనా ‘ఇంతకంటే దారుణమైన జీవితం ఉంటుందా!’ అన్న అనుమానం వచ్చేస్తుంది. కానీ మన హీరోకి మాత్రం అలాంటి అనుమానం ఏమీ ఉండదు. ప్రతి కష్టాన్నీ అతను నిబ్బరంగా ఎదుర్కొంటాడు, చివరికి తను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలాంటి హీరోలు వెండితెర మీదే కాదు... మన మధ్యన కూడా కొందరున్నారు. కావాలంటే చూడండి!   సిల్వస్టర్ స్టలోన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 70 ఏళ్ల వయసులో కూడా హాలీవుడ్లో హంగామా సృష్టిస్తున్న టాప్ హీరో. కానీ ఈ స్థాయికి చేరుకునేందుకు అతను సాగించిన ప్రయాణం అసమాన్యం. స్టలోన్ తండ్రి అమెరికాలో స్థిరపడిన ఇటాలియన్, తల్లి రష్యన్. స్టలోన్ పుట్టుకతోనే దురదృష్టం తోడుగా లోకంలోకి అడుగుపెట్టాడు. అతన్ని తల్లి గర్భం నుంచి బయటకు తీసేందుకు పటకారు (forceps) ఉపయోగించాల్సి వచ్చింది. దాని వల్ల అతని మొహంలోని ఒక నరం దెబ్బతిని పక్షవాతం వచ్చేసింది. అతని పెదాలు, నాలుక, దవడలోని కొంత భాగం సరిగా పనిచేయకుండా పోయింది. స్టాలిన్ కష్టాలకు ఇది ఒక ఆరంభం మాత్రమే!   స్టలోన్కు తొమ్మిదేళ్ల వయసు ఉండగా... అతని తల్లిదండ్రులు విడిపోయారు. అతని ఆలనాపాలనా తల్లే చూసుకోసాగింది. కానీ స్టలోన్ చదువులో చురుగ్గా లేకపోవడంతో, తల్లి అతన్ని ఒక సెలూన్లో ఉద్యోగానికి పెట్టింది. కానీ ఆ ఉద్యగం అతన్ని మరింత పేదరికంలోకి నెట్టేసింది. స్టలోన్కు 24 ఏళ్లు వచ్చేసరికి ఏ ఉద్యోగమూ లేకుండా పోయింది. అతను ఉంటున్న అపార్టుమెంట్ అద్దెని కూడా కట్టలేని పరిస్థితి. దాంతో ఓ రోజున కట్టుబట్టలతో సహా ఆ అపార్టుమెంటు నుంచి బయటపడక తప్పలేదు. తలదాచుకోవడానికి ఆరడుగుల అండ కూడా దొరక్కపోవడంతో... న్యూయార్కులోని బస్టాండులోనే మూడు వారాలు గడిపాడట స్టలోన్.   ఆ సమయంలో స్టలోన్కు ఒక వరంలాంటి శాపం దక్కింది. చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉన్న అతడికి ఒక పోర్న్ ఫిల్మ్ (అశ్లీల చిత్రం)లో చిన్న పాత్ర దక్కింది. ఆ పాత్రకుగాను అతనికి 200 డాలర్లు ఇస్తామని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేదు, తల దాచుకోవడానికి నెత్తి మీద నీడ లేదు. అలాంటి సమయంలో స్టలోన్కు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఆ అవకాశంతో స్టలోన్ జీవితమైతే మారిపోలేదు కానీ చిన్నాచితకా వేషాలు దొరకడం మొదలైంది.   ఒకరోజు స్టలోన్ టీవీలో బాక్సింగ్ పోటీ చూస్తున్నాడు. అందులో మహమ్మద్ ఆలీ, చక్ వెప్నర్ అనే బాక్సర్లు హోరాహోరీగా పోటీపడుతున్నారు. ఆ పోటీ చూసిన స్టలోన్ మనసులో ఓ ఆలోచన మెదిలింది. బాక్సింగ్ పోటీ నేపథ్యంలో ఒక సినిమా కథని ఎందుకు రాయకూడదనిపించింది. వెంటనే తన రూమ్కి వెళ్లి మూడు రోజుల పాటు ఏకధాటిగా కూర్చుని ఒక కథని అల్లాడు. అదే Rocky! తను రాసిన స్క్రిప్ట్ను తీసుకుని స్టలోన్ ప్రొడ్యూసర్ల దగ్గరకి బయల్దేరాడు.   స్టలోన్ రాసిన కథ చాలామందికి నచ్చింది. కానీ ఆ కథలో ప్రధాన పాత్రని తనే పోషిస్తానని స్టలోన్ చెప్పడంతో ఎవ్వరూ సినిమా తీసేందుకు ధైర్యం చేయలేదు. చివరికి ఒక నిర్మాత ఆ కథని 3,50,000 డాలర్లకి కొనేందుకు ఒప్పుకొన్నాడు. అంత భారీ ఆఫర్ వచ్చినా కూడా స్టలోన్ తన పంతం వీడలేదు. అందులో రాకీ పాత్ర తను పోషించాల్సిందే అని పట్టుపట్టాడు. ఇక చేసేదేమీ లేక స్టలోన్కు కేవలం 35,000 డాలర్లు ముట్టచెప్పి అతనితో ఆ పాత్ర చేయించారు.   రాకీ విడుదల తర్వాత స్టలోన్ ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది. అందులో అతని అద్భుతమైన నటనకీ, రచనకీ ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. కేవలం పదకొండు లక్షల డాలర్లతో తీసిన ఆ చిత్రం 22 కోట్ల డాలర్లను వసూలు చేసింది. ఆ ఒక్క సినిమాకే ఆరు సీక్వెల్స్ తీశారంటే హాలీవుడ్లో దాని ప్రభావం ఏపాటిదో అర్థమవుతుంది. ఆ సీక్వెల్స్తో పాటుగా Rambo, Cliffhanger లాంటి 70కి పైగా చిత్రాలతో స్టలోన్ హాలీవుడ్ చరిత్రలోనే తనదైన అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు.   స్టలోన్ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకి ఇష్టమైన కుక్కపిల్లని 50 డాలర్లకు అమ్మేశాడట. కానీ రాకీ సినిమా కోసం తనకి 35,000 డాలర్లు ముట్టగానే వెంటనే ఆ కుక్కని తిరిగి కొనేందుకు బయల్దేరాడు. ఆ కుక్కని కొనుక్కొన్న వ్యక్తి తరచూ బార్కి వస్తాడని తెలియడంతో మూడురోజులపాటు అతని కోసం కాపుకాశాడు. చివరికి అతను కనిపించనైతే కనిపించాడు కానీ... ఆ కుక్కని తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ‘ఆఖరికి 3,000 డాలర్లు చెల్లించి నానా తిట్లూ తిన్న తర్వాత నాకు ఆ కుక్కని తిరిగి ఇచ్చేందుకు అతను ఒప్పుకున్నాడు’ అని స్టలోన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. హుమ్! స్టలోన్ తను కోల్పోయినవి కూడా తిరిగి సాధించుకున్నాడన్నమాట. నిజమైన విజయం అంటే అంతే కదా!!! - నిర్జర.    

Story of Fathers Day

నాన్న తోడుంటే -ఏదైనా సాధించవచ్చు

  పిల్లల్ని పెంచడంలో తల్లి పాత్రని ఎవ్వరూ కాదనలేరు. కానీ బిడ్డల మీద తండ్రి ప్రభావం కూడా అసాధారణమే అంటున్నారు పరిశోధకులు. ఈ మధ్యకాలంలో వెలుగుచూసిన కొన్ని పరిశోధనల తండ్రి కేవలం తెరచాటు మనిషి మాత్రమే కాదనీ... పిల్లలు ఎదిగేందుకు అతని తోడ్పాటు చాలా అవసరమనీ తేల్చి చెబుతున్నాయి. వాటిలో కొన్ని...   తండ్రిలానే ఉంటాము   పిల్లవాడు పుట్టగానే అతనిది తల్లి పోలికా తండ్రి పోలికా అని బేరీజు వేస్తుంటారు. ఎదిగేకొద్దీ తండ్రి బుద్ధులు వచ్చాయా, తల్లి అందం వచ్చిందా అని తరచి చూసుకుంటారు. నిజానికి పిల్లవాడికి తల్లీ, తండ్రీ ఇద్దరి నుంచీ సమానమైన లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. పైగా మన కణాలకు జీవాన్నిచ్చే ‘మైటోకాండ్రియా’ కేవలం తల్లి నుంచే పిల్లలకు వస్తుంది. కానీ ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనలో తండ్రి జన్యువులే పిల్లవాడి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయని తేలింది. తండ్రి నుంచి పిల్లవాడికి సంక్రమించిన genetic mutations మరింత బలంగా ఉంటాయట. కాబట్టి వంశపారంపర్యమైన వ్యాధులు వచ్చినా, మంచి రోగనిరోధకశక్తి ఉన్నా... తండ్రిదే కీలకపాత్ర కావచ్చు.   తండ్రి ప్రేమకి మంచి మార్కులు   టీనేజి పిల్లలకి చదువు మీద ధ్యాస అంతగా ఉండదు. అసలే పరిపరివిధాలా పోతున్న మనసుకి ఆర్థిక సమస్యలు కూడా తోడైతే ఇక చెప్పేదేమంది. చదువు కాస్తా చెట్టెక్కి తీరుతుంది. కానీ తండ్రి కనుక వీరికి అండగా నిలిస్తే... ఎలాంటి సమస్యనైనా దాటుకుని చదువులో ముందుండి తీరతారట. అయితే ఈ ప్రభావం ఆడపిల్లల మీద ఒకలా మగపిల్లల మీద ఒకలా ఉండటం గమనార్హం! తండ్రి నుంచి అందే ప్రేమతో ఆడపిల్లలు లెక్కలలో బాగా రాణిస్తే, ఆయన నుంచి వచ్చే ఆత్మవిశ్వాసంతో మగపిల్లలు ఇంగ్లిష్లో మంచి మార్కులు సాధించడాన్ని గమనించారు.   తండ్రి పక్కనుంటే డిప్రెషన్ దూరం   చక్కగా చూసుకునే నాన్న పక్కన ఉంటే, పిల్లవాడికి ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు స్వీడన్కు చెందిన పరిశోధకులు. దాదాపు 20 ఏళ్లపాటు శోధించి తేల్చిన విషయం ఇది. ప్రేమతో మెలిగే తండ్రి ఉన్న మగపిల్లలు లేనిపోని గొడవల జోలికీ, చెడు వ్యసనాల జోలికీ పోకుండా ఉంటారట. ఇక ఆడపిల్లలేమో మానసిక సమస్యలకి దూరంగా నిబ్బంగా జీవించగలుగుతారట. వంద కాదు వెయ్యి కాదు... దాదాపు ఇరవైవేల మంది పిల్లలను పరిశీలించిన తర్వాత తేల్చిన విషయమిది!   తండ్రి ద్వేషం   పిల్లల్ని తండ్రి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. పిల్లల్ని దగ్గరకు తీస్తే ఎక్కడ పాడైపోతారో అని చాలామంది తండ్రులు, పిల్లలని దూరం పెడుతుంటారు. కారణం ఏదైనా కానీయండి... తల్లికంటే కూడా తండ్రి నుంచి వచ్చే వ్యతిరేకతే పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. ఆ ప్రభావం వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. దాదాపు పదివేల మంది మీద జరిగిన 36 పరిశోధనల సారాంశమిది! మరెందుకాలస్యం. భేషజాలను పక్కన పెడదాం! తండ్రి కూడా తల్లితో సమానంగా పిల్లలకి ప్రేమ పంచగలడని నిరూపిద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే! - నిర్జర.    

William Chopik

స్నేహమేరా జీవితం... ఆ స్నేహంతోనే ఆరోగ్యం!

  కుటుంబాన్ని దేవుడు ఇస్తాడు, కానీ స్నేహితులని ఎంచుకునే అవకాశం మనకే ఉంటుంది. అందుకనే స్నేహం చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అంటారు పెద్దలు. అలా మంచి స్నేహితులను ఎంచుకోవడానికి మరో బలమైన కారణం కూడా చూపిస్తున్నారు పరిశోధకులు. మంచి స్నేహితులు పక్కన ఉంటే... ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.   మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన విలియం చోపిక్ అనే పరిశోధకుడు, ఆరోగ్యం మీద స్నేహం ప్రభావాన్ని తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకోసం వందమంది కాదు వేయిమంది కాదు వంద దేశాల నుంచి 2,70,000 మంది నుంచి సమాచారాన్ని సేకరించారు. వీళ్లంతా కూడా కుటుంబం వల్లా, స్నేహితుల వల్లా తాము సంతోషంగానూ ఆరోగ్యంగానూ ఉంటున్నామని చెప్పుకొచ్చారు. వృద్ధాప్యంలో అయితే కుటుంబాన్ని మించి కూడా స్నేహితుల అండ తమను ఆరోగ్యంగా ఉంచుతోందని తేల్చారు.   అభ్యర్థులు స్వయంగా చెప్పిన ఈ విషయాలు వాస్తవంగా ఎంతవరకూ నిజమో తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకోసం మరో ఏడువేల మందికి చెందిన మెడికల్ రికార్డులను పరిశీలించారు. నిజంగానే స్నేహితులు ఉన్నవారు ఇతరులకంటే ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. అందుకని వృద్ధాప్యంలో హాయిగా ఉండేందుకు డబ్బులు, ఆస్తులు ఎలా సమకూర్చుకుంటామో...   అంతకంటే ముఖ్యంగా, మంచి స్నేహితులను కూడా తయారుచేసుకోవాలని చెబుతున్నారు.ఇంతకీ వయసు పెరిగేకొద్దీ స్నేహం ఎందుకంత ప్రభావం చూపుతుంది? అన్న ప్రశ్నకు పరిశోధకుల దగ్గర చాలా జవాబులే ఉన్నాయి. - కాలం గడుస్తున్న కొద్దీ పనికిరాని స్నేహాలను పక్కనపెట్టి, నిజమైన స్నేహితులతోనే కాలం గడిపేందుకు ప్రయత్నిస్తాం. సహజంగానే వీరు మన కష్టసుఖాలను పంచుకునేవారై ఉంటారు.   - వృద్ధాప్యంలో భార్యో భర్తో మరణించిన తర్వాత ఎక్కడలేని ఒంటరితనమూ అవహిస్తుంది. సహజంగానే స్నేహితులు ఆ ఒంటరితనం నుంచీ, దగ్గర మనిషిని కోల్పోయిన బాధ నుంచీ బయటపడేస్తారు.   - కుటుంబసభ్యులతో అన్ని విషయాలనూ పంచుకోలేకపోవచ్చు. అవతలివారు అపార్థం చేసుకుంటారనో, కంగారు పడతారనో, బంధంలో చులకన అయిపోతామనో... వారి దగ్గర కొన్ని విషయాలు దాచిపెడతాము. కానీ స్నేహంలో అలాంటి భేషజాలు ఏవీ ఉండవు కదా! - ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో పాలుపోదు. జీవితమంతా శూన్యంలా తోస్తుంది. అలాంటి సమయంలో స్నేహితుల అండ ఓ కొత్త జీవితాన్ని అందిస్తుంది.   - కుటుంబంలో ఏదన్నా సమస్య ఉంటే అది మనసుని వేధించక తప్పదు. దాని నుంచి పారిపోయే అవకాశమూ లేకపోవచ్చు. కుటుంబంలో అనుభవించే యాతనకి స్నేహితుల దగ్గర ఓదార్పు లభించి తీరుతుంది.   అలాగని స్నేహం కేవలం వృద్ధాప్యంలోనే కాదు.... జీవితంలోని ఏ మలుపులో అయినా అండగా నిలిచి తీరుతుంది. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా మంచి మనుషులను స్నేహితులుగా మార్చుకునేందుకు, ఆ స్నేహితులను కలకాలం నిలుపుకొనేందుకు ఇప్పటినుంచే ప్రయత్నించమని సూచిస్తున్నారు పరిశోధకులు.     - నిర్జర.  

man crying

ఏడ్చే మగవాడిని నమ్మితీరాల్సిందే!

    ఏడ్చే మగవాడనికి నమ్మకూడదు అంటారు? కానీ రోజులు మారాయి. దాంతోపాటుగా నమ్మకాలు కూడా మారాల్సిందే! ఆడవారైనా, మగవారైనా ఏడిస్తే వ్యక్తిత్వం బలపడుతుంది! అంటున్నారు. ఎందుకో మీరే చూడండి.   ఒత్తిడి నుంచి ఉపశమనం:-   మనసుకి తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు, దానిని గుండెలోతుల్లో అదిమిపెట్టి ఉపయోగం లేదు. అలా అణిచిపెట్టుకున్న దుఃఖం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అదే కష్టాన్ని కన్నీళ్ల ద్వారా బయటకు పంపేస్తే మనసు తేలికపడుతుంది. కష్టం దగ్గరే ఆగిపోకుండా జీవితంలో ముందుకు సాగే ధైర్యం వస్తుంది. అంతేకాదు! మనసు తేలికపడిన తర్వాత అసలు సమస్య ఎక్కడ వచ్చింది? దానిని అధిగమించడం ఎలా అనే స్పష్టత ఏర్పడుతుంది.   తెగింపుకి సూచన:-   మనసులో ఎంత బాధ ఉన్నా పైకి గంభీరంగా నటిస్తాము. మగవాళ్లు ఏడిస్తే బాగోదు కదా! అన్న ఆలోచనతో కన్నీటి ఉగ్గబట్టుకుని కుమిలిపోతుంటాము. కానీ అవతలివారు ఏమనుకుంటారో! అన్న ఆలోచనని అధిగమించిన రోజునే తెగించి కన్నీళ్లు పెట్టుకోగలం. అందుకే స్వచ్ఛమైన మనసుకీ, భేషజాలెరుగని వ్యక్తిత్వానికీ సూచనగా ఏడుపు నిలుస్తుంది!   ఎదుటి వ్యక్తికి సాంత్వన:-   ఎదుటివాడి కష్టాన్ని చూసి కంటనీరు పెట్టుకున్నారనుకోండి! అవతలివారికి మీరు తన పట్ల సానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం కలుగుతుంది. తన కష్టసుఖాలను మీతో పంచుకోగల నమ్మకం వస్తుంది. ఒకవేళ మీరే ఎదన్నా తప్పు చేశారనుకోండి.... ‘తప్పయిపోయిం’దంటూ కంటనీరు పెట్టుకుంటే, అవతలివారి మనసులో మీ పట్ల ఉన్న దురభిప్రాయం కాస్తా తొలిగిపోతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా కన్నీరు బంధాలను నిలబెట్టినట్లే లెక్క!   స్పందనకు ప్రతిరూపం:-   కష్టానికి త్వరగా స్పందించే మనసు ఉన్నవారే... బొటబొటా కన్నీటిని విడుస్తుంటారు. ఇలాంటి సున్నితమైన మనసు ఉన్నవారు సహజంగా ఏ కవిగానో, చిత్రకారునిగానో మారి అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇతరుల కష్టాలని తీర్చేందుకు సమాజసేవకులుగానూ మారుతుంటారు. ప్రపంచపు బాధని తీర్చే శాస్త్రవేత్తలుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు!   ఆరోగ్యానికీ ఢోకా ఉండదు:-   కష్టాన్ని కన్నీటి ద్వారా బయటకు పంపేస్తే గుండెకు ఎలాగూ మంచిదే! అంతేకాకుండా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్‌ వంటి విషరసాయనాలన్నీ కన్నీటి ద్వారా బయటకు వెళ్లిపోతాయట! పైగా కన్నీటిలో ఉండే ‘లైసోజైం’ అనే అరుదైన రసాయనం శరీరంలోని హానికారక బ్యాక్టీరియాని నిర్వీర్యం చేయగలదు.   ఏడుపు వల్ల అటు వ్యక్తిత్వానికీ ఇటు ఆరోగ్యానికీ ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట! ఇప్పుడు చెప్పండి ఏడ్చే మగవాడిని నమ్మకుంగా ఎలా ఉండగలం!                        - నిర్జర.

hyderabadi haleem

సలామ్ హలీమ్! (సండే స్పెషల్)

ప్రేమకి కులం, మతం ఉండవంటారు. ప్రేమకే కాదు... ఫుడ్ కీ కూడా ఉండదు అని ఓ వంటకం నిరూపించింది. ఒక మతానికి చెందిన పవిత్ర ఆహారమైనా... ప్రతి మతం వారికీ ప్రీతిపాత్రమయ్యింది. ప్రపంచమంతటా తన పేరు మారుమోగేలా చేసుకుని ఏ ఆహారమూ సంపాదించనంత కీర్తిని మూటగట్టుకోవడం దానికే చెల్లింది. ఇంతకీ ఏమిటది? ఇంకా చెప్పాలా... అర్థమైపోలేదూ... హలీమ్. అవును. ఇది వంటకాలకే రారాజు. రుచుల్లో మహారాజు.    రంజాన్ మాసం వస్తోందంటే ముసల్మానులంతా ఉపవాసాలకు సిద్ధమవుతూ ఉంటారు. అయితే మిగతావారంతా హలీమ్ తినడానికి సిద్ధపడుతూ ఉంటారు. దుకాణాలు తెరిచీ తెరవగానే వాటి ముందు క్యూ కడుతుంటారు. లొట్టలేసుకుంటూ హలీమ్ ని లాగించేస్తుంటారు. ఏమిటంత ప్రీతి? ఓ వంటాన్ని తినడం కోసం ఎందుకింత ఆరాటం? హలీమ్ మాత్రమే ఎందుకింత ప్రత్యేకం? అసలు ఏమిటి హలీమ్ ప్రస్థానం? తెలుసుకుందాం రండి.   అలా వచ్చింది... మహబూబ్ అలీఖాన్... ఆరవ నిజాం నవాబు. ఒకసారి ఈయన తన రాజ్యంలోని రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని తలపెట్టాడు. దానికోసం ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి పర్షియా నుంచి కొందరు ప్రముఖులు వచ్చారు. అది రంజాన్ మాసం కావడంతో వాళ్లంతా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షను విరమించడానికి తాము ఎప్పుడూ తినే వంటకం ఉంటే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.  అది మనకు పరిచయం లేదు. దాంతో నవాబు వంటవాళ్లను పిలిచి, ఆ వంటకం ఎలా చేయాలో పర్షియన్ అతిథులతో వాళ్లకి చెప్పించాడు. వెంటనే ఆ వంటకం సిద్ధమైంది. దాని సువాసన అందరి ముక్కు పుటాలనూ అదరగొట్టింది. అదే హలీమ్. మొట్టమొదటి సారిగా ఆరోజు మన దేశంలో అడుగు పెట్టిన హలీమ్... ఆపైన మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లలేదు.       తయారీయే ప్రత్యేకం... హలీమ్ గొప్పదనమంతా దాన్ని వండటంలోనే ఉంటుంది. గోధుమరవ్వను నాలుగ్గంటలు నీటిలో నానబెడతారు. తర్వాత నీటిని ఒంపేసి మాంసం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మసాలాలతో కలిపి పన్నెండు గంటల పాటు ఉడకబెడతారు. తర్వాత దాన్ని మెత్తని పేస్ట్ లా అయ్యేవరకూ కర్రలతో కలియబెడతారు. ఇలా చేయడాన్ని గోటా కొట్టడం అంటారు. గోటా కొట్టిన తరువాతే హలీమ్ ఘుమఘుమలు మొదలవుతాయి. ఆపైన ఉల్లిపాయ ముక్కలు, బాదం పప్పు, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేయించి హలీంలో కలుపుతారు. తినేముందు కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం చల్లి ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లారకుండా బట్టీల్లో వేడి మీదే ఉంచుతారు. అందుకే ఎప్పుడు హలీమ్ తిన్నా వేడిగానే ఉంటుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయబట్టే హలీమ్ అన్నింట్లోకీ ప్రత్యేకంగా నిలిచింది.    పోషకాలకు లోటు లేదు... అసలు రంజాన్ మాసంలో హలీమ్ ఎందుకు తింటారు? ఎందుకంటే రోజంతా చేసే ఉపవాసం వల్ల నీరసం రాకుండా చేస్తుంది హలీమ్. దానిలో నిండుగా ఉండే పోషకాలు అదనపు శక్తినిచ్చి నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేయగలిగేలా చేస్తుంది. పప్పుధాన్యాలు, నెయ్యి, తాజా మాంసం, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎంతో బలవర్ధకం. అందుకే హలీమ్ రంజాన్ మాసపు ప్రత్యేక ఆహారమయ్యింది. మటన్, చికెన్ లతో పాటు వెజిటేరియన్స్ కోసం వెజ్ హలీమ్ కూడా దొరుకుతుంది. మటన్ తో చేసేదాన్ని హలీమ్ అనీ, చికెన్ తో చేసేదాన్ని హరీస్ అనీ అంటారు. పేరు ఏదైనా... పదార్థాలు ఏవైనా... వెజ్ అయినా నాన్ వెజ్ అయినా... దాని రుచి దేనికీ కాదు.    కాసులు కురిపిస్తోంది... రుచుల్ని అందించడమే కాదు... కాసుల్ని కూడా కురిపిస్తోంది హలీమ్. అది కూడా కోట్లలో. యేటా ఒక్క హైదరాబాద్ లోనే వంద కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోందంటే దీని డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భాగ్యనగరంలో ఆరు వేలకు పైగా హలీమ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆన్ లైన్ బుకింగ్ కూడా మొదలవ్వడంతో బిజినెస్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంతోమందికి జీవనాధారం కూడా కల్పిస్తోంది.     వాస్తవానికి వేరే దేశం నుంచి హలీమ్ హైదరాబాద్ కి వచ్చింది. కానీ ఇప్పుడు హలీమ్ కి హైదరాబాదే కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. మన దేశంలోని చెన్నై, కోల్ కతా, బెంగళూర్ వంటి సిటీలతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా, అమెరికా, మలేషియా, సింగపూర్, సౌదీ తదితర దేశాలకు కూడా హైదరాబాద్ నుంచే హలీమ్ సరఫరా అవుతోంది. అయితే ఇటీవలి కాలంలో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా హలీమ్ లభిస్తోన్నా హైదరాబాద్ హలీమ్ రుచి దేనికీ లేదంటున్నారు అభిమానులు. అంతగా హైదరాబాద్ హలీమ్ రుచి అందరినీ కట్టి పడేసింది. పావుకిలో రూ. 100 నుంచి రూ. 150 వరకూ ఉంటుంది. అరకిలో 250 నుంచి 300 రూపాయల వరకూ, కిలో 450 నుంచి 500 వరలకూ ఉంటోంది.     రేటు ఎంతయినా సరే... తిని తీరాల్సిందేనంటారు హలీమ్ ప్రియులు. అవును మరి... హలీమ్ కి వెలకట్టగలమా! తిన్న తర్వాత కొన్ని గంటల వరకూ నోటిని వదిలిపెట్టని ఆ రుచి కోసం ఎంతయినా ఖర్చుపెట్టొచ్చు. వంద భోజనాల వల్ల కలిగే శక్తిని ఒక్క కప్పుతో కలిగించే దాని ఘనతకి ఎన్ని వందలైనా వెచ్చించొచ్చు. తిరుగు లేని హలీమ్ కి ఎన్ని సలామ్ లైనా కొట్టొచ్చు. సలామ్ హలీమ్!   -Sameera N

heart attack

ఆదివారం లేట్గా నిద్రలేస్తే గుండెజబ్బు ఖాయం!

  రోజంతా ఉరుకుల పరుగుల జీవితం. క్షణం కూడా ఊపిరి సలపనీయని బాధ్యతలు. ఎక్కడికన్నా పారిపోవాలి అనిపించేంత ఒత్తిడి. అందుకనే శనివారం సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంటారు చాలామంది. ఇక శనివారం వచ్చిందంటే తమలోని గూడు కట్టుకుపోయిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు బార్కి బయల్దేరతారు. అర్ధరాత్రి దాకా గడిపి తీరికగా ఇంటికి చేరుకుంటారు. ఆపై కళ్లు మూతలు పడేదాకా టీవీ చూస్తూ కూర్చుంటారు.   మర్నాడు ఆదివారమే కదా! ఓ గంట ఆలస్యంగా నిద్ర లేవచ్చులే అన్న భరోసా వీరిది. నిజంగానే మర్నాడు బారెడు పొద్దెక్కాకే నిద్రలేస్తారు. కానీ అదేం విచిత్రమో ఒత్తిడి ఏమాత్రం తగ్గినట్లు అనిపించకపోగా... విసుగ్గా, బద్ధకంగా తోస్తుంది. ఇలా అదనంగా నిద్రపోయినా కూడా నిస్సత్తువగా తోచడానికి ‘సోషల్ జెట్లాగ్’ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. నిద్రని ఆపుకొని ఆపుకొని ఒకేసారి పడుకోవడమే ఈ సోషల్ జెట్లాగ్కి కారణం.   సోషల్ జెట్లాగ్ వల్ల మనం నిద్రపోయే సమయాలు ఒకసారి ఎక్కువగానూ, మరోసారి తక్కువగానూ ఉంటాయి. జీవగడియారంలో వచ్చే ఈ మార్పులు జన్యువుల మీద ప్రభావం చూపుతాయి. మన గుండెని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక సర్వేని చేపట్టారు. సర్వేలో భాగంగా 22 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న 984 మందిని పరిశీలించారు. వారు ఆదివారం నాడు ఎంత ఎక్కువసేపు నిద్రపోతున్నారో చెప్పమని అడిగారు. ఆ తర్వాత వారి ఆరోగ్యానికీ, మానసిక ప్రశాంతతకీ సంబంధించిన వివరాలు సేకరించారు. ఆదివారంపూట ఒక్క గంట ఎక్కువగా పడుకున్నా కూడా మనకి గుండెజబ్బు వచ్చే అవకాశం 11 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది! పైగా అంతసేపూ నిద్రపోయినా కూడా వారికి చిరాగ్గానూ, నిద్ర తీరనట్లుగానూ తోచిందట.   మనసు, ఆరోగ్యమూ సవ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర ఉండాలన్నది అందరికీ తెలిసిన విషయమే! కానీ ఆ నిద్ర కూడా ఎప్పుడూ ఒకే తీరున ఉండాలని ఈ పరిశోధన రుజువు చేస్తోంది. మర్నాడు ఆదివారం కదా అని శనివారం టీవీ చేస్తూనో, కబుర్లు చెబుతూనో, మందు కొడుతూనో కాలక్షేపం చేయనే వద్దని హెచ్చరిస్తోంది. వారం పొడుగూతా ప్రతి రాత్రీ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోతూ... ఒకే దినచర్యని పాటించాలన్నది పరిశోధకుల హెచ్చరిక! - నిర్జర.  

IF

IF

  IF you can keep your head when all about you Are losing theirs and blaming it on you, If you can trust yourself when all men doubt you, But make allowance for their doubting too; If you can wait and not be tired by waiting, Or being lied about, don't deal in lies, Or being hated, don't give way to hating, And yet don't look too good, nor talk too wise: If you can dream - and not make dreams your master; If you can think - and not make thoughts your aim; If you can meet with Triumph and Disaster And treat those two impostors just the same; If you can bear to hear the truth you've spoken Twisted by knaves to make a trap for fools, Or watch the things you gave your life to, broken, And stoop and build 'em up with worn-out tools: If you can make one heap of all your winnings And risk it on one turn of pitch-and-toss, And lose, and start again at your beginnings And never breathe a word about your loss; If you can force your heart and nerve and sinew To serve your turn long after they are gone, And so hold on when there is nothing in you Except the Will which says to them: 'Hold on!' If you can talk with crowds and keep your virtue, ' Or walk with Kings - nor lose the common touch, if neither foes nor loving friends can hurt you, If all men count with you, but none too much; If you can fill the unforgiving minute With sixty seconds' worth of distance run, Yours is the Earth and everything that's in it, And - which is more - you'll be a Man, my son! - Rudyard Kipling (If is thought to be one of the most inspiring poems of all time. IF is written by Rudyard Kipling famous for his `Jungle Book’ novel.)

అతనొక్కడే – కానీ ముంబైకి స్ఫూర్తిగా నిలిచాడు!

  ‘‘రెండేళ్ల క్రితం ముంబైలోని వెర్సోవా బీచ్, అతి చెత్త తీరాలలో ఒకటిగా అప్రతిష్ట మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు అదే తీరం అతి సుందరంగా కనిపిస్తోంది. వెర్సోవా ప్రాంతవాసుల శ్రమ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. వారికి నాయకత్వం వహించిన ‘అఫ్రోజ్ షా’ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను,’’ అంటూ ఈ మధ్య తన మన్ కీ బాత్ కార్యక్రమలో ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. అప్పటి నుంచీ దేశం యావత్తూ... వెర్సోవా బీచ్లో జరిగిన అద్భుతం గురించీ, ఆ అద్భుతం నిజమయ్యేందుకు అఫ్రోజ్ షా అనే వ్యక్తి చేసిన కృషి గురించి తెలుసుకునే ప్రయత్నంలో మునిగిపోయారు.   అఫ్రోజ్ షా, బాంబే హైకోర్టులో లాయరుగా పనిచేస్తున్నారు. అందరు ముంబైవాసులలాగానే ఆయన కూడా సముద్రతీరంలో ఓ ఇల్లు ఏర్పరుచుకోవాలని కలగన్నారు. 2015లో ఆ కల నిజమైంది కూడా! కానీ ఉదయం లేచి చూస్తే ఏముంది? తీరమంతా చెత్తాచెదారంతో నిండిపోయి కనిపించింది. సముద్రంలో ఎక్కడెక్కడో కలిపే చెత్తతో పాటుగా, తీరం వెంబడి ఉండేవారంతా తమ చెత్తని అక్కడ నిర్మొహమాటంగా వదిలేయడం కనిపిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే వెర్సోవా తీరం ఓ అనధికారిక డంపింగ్ యార్డుగా మారిపోయింది.     మిగతావారిలాగా అఫ్రోజ్ తనకెందుకులే అని చూసీచూడనట్లు ముక్కుమూసుకుని ఉండిపోలేదు. తన పొరుగింటాయనతో మాట్లాడి తమ వంతుగా ఆ చెత్తని శుభ్రం చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్లాస్టిక్ బాటిల్స్, గాజు ముక్కలు, పాత చెప్పులు, ఇనుప సామాను... ఇలా నానా చెత్తనంతా తీయవలసి వచ్చేది. మొదట్లో జనం ఆ ఇద్దరూ చేస్తున్న పనిని చూసి తమ దారిన తాము పోయేవారు. నిదానంగా ఒకో మనిషీ వచ్చి ఒకో చేయీ వేయడం మొదలుపెట్టారు. యాత్రికులు, దారినపోయేవారు, చేపలుపట్టేవారు, స్థానికులు మొదలుకొని అఫ్రోజ్ గురించి విన్న బాలీవుడ్ హీరోల వరకూ అంతా అఫ్రోజ్ బృందంలో కలిసి చెత్తని వెలికితీసే ప్రయత్నంలో భాగస్వాములు అయ్యారు.   వారం వారం అఫ్రోజ్ చేస్తున్న ఈ పని క్రమేపీ ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండిపోయిన వెర్సోవా తీరం ఇప్పుడు తళతళ్లాడిపోతోంది. అఫ్రోజ్ చేస్తున్న పనిని ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛతా కార్యక్రమంగా దీన్ని పేర్కొంది. అఫ్రోజ్కు ‘Champion of the Earth’ అనే బిరుదుని కట్టబెట్టింది. అంతేకాదు అఫ్రోజ్ స్ఫూర్తితో, దుర్గంధంతో నిండిపోయిన ఇండోనేషియా సముద్రతీరాన్ని కూడా శుభ్రపరిచే కార్యక్రమం మొదలుపెట్టింది.     వెర్సోవా తీరం ప్రస్తుతానికి ఓ కొలిక్కి వచ్చినమాట నిజమే! కానీ తమ బాధ్యత ఇక్కడితో ముగిసిపోలేదంటున్నారు అఫ్రోజ్. ఎక్కడెక్కడో సముద్రంలో కలిసే చెత్తంతా తీరానికి రాక తప్పదు కాబట్టి.... వారం వారం తాము ఆ చెత్తని శుభ్రం చేస్తూనే ఉంటామని హామీ ఇస్తున్నారు. మరోపక్క సముద్రతీరాలు కోతకు గురికావడం, సునామీబారిన పడటం వంటి ఉపద్రవాల నుంచి రక్షించే మడఅడవులని తిరిగి పెంచే కర్తవ్యాన్ని కూడా తలకెత్తుకున్నారు.   అందరిలా మనకెందుకులే అని అఫ్రోజ్ అనుకుంటే ఈ రోజున వెర్సోవా తీరంలో ఏ మార్పూ కనిపించేది కాదు. నేనొక్కడినే కదా అని వెనకడుగు వేస్తే ఆ మార్పు ప్రపంచాన్ని ఆకర్షించేదీ కాదు. అందుకే నిస్వార్థమైన నాయకత్వానికీ, సమాజం పట్ల బాధ్యతకీ అఫ్రోజ్ ఒక ఆదర్శంగా నిలుస్తాడని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సైతం కితాబునిచ్చారు.     సముద్రతీరంలో చెత్తని పారేయడం మనకి చాలా సాధరణమైన దృశ్యంగా కనిపించవచ్చు. కానీ ఒకపట్టాన నేలలో కలవని గాజు, ప్లాస్టిక్ వంటి పదార్థాల వల్ల తనే ఎలాగూ పాడవుతుంది. పైగా సముద్రంలోకి చేరి అక్కడ నివసించే చేపలు వంటి జీవరాశుల ప్రాణాలు తోడేస్తాయి. సముద్ర పక్షలకి కూడా ప్రాణాంతకంగా మారిపోతాయి. ఈ కాస్త విషయమూ అర్థమైతే అఫ్రోజ్ వేసిన ముందడుగు ఎంత అవసరమో తేలిపోతుంది. (ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా) - నిర్జర.    

సంతోషంగా ఉండేందుకు ఓ బౌద్ధ భిక్షువు చిట్కాలు...!

  ఫ్రాన్స్‌కు చెందిన మాథ్యూ రికార్‌ (Matthieu Ricard) అందరిలాగే బుద్ధిగా చదువుకునేవాడు. ‘మాలిక్యులర్‌ జెనెటిక్స్‌’లో పీహెచ్‌డీ సైతం సాధించాడు. కానీ విజ్ఞానశాస్త్రం లోతులు చూస్తున్న కొద్దీ, తన మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలనిపించింది మాథ్యూకి.   అందుకోసం ఫ్రెంచ్‌ తత్వవేత్తలు రాసిన పుస్తకాలన్నింటినీ చదవడం మొదలుపెట్టాడు. చివరికి భారతదేశమే తనలోని ఆధ్మాత్మిక జిజ్ఞాసకు దారిచూపగలదని నిశ్చయించుకున్నాడు. అలా ఇండియాకు చేరుకున్న మాథ్యూ బౌద్ధమతాన్ని పుచ్చుకొని నేపాల్‌లో స్థిరపడిపోయాడు.   మాథ్యూ గురించి విన్న కొందరు పరిశోధకులు మెదడు మీద ధ్యానం కలిగించే ప్రభావాన్ని అంచనా వేసేందుకు, అతన్ని ఎంచుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 12 సంవత్సరాల పాటు దఫదఫాలుగా ఆయనని పరిశీలించి చూశారు. మాథ్యూ మెదడుకి 256 సెన్సర్లు అమర్చి, ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన మెదడు ఎలా పనిచేస్తోందో గ్రహించే ప్రయత్నం చేశారు.   మాథ్యూ ధ్యానం చేస్తున్నప్పుడు, అతని మెదడులో ఏర్పడుతున్న తరంగాల స్థాయిని చూసి పరిశోధకులే ఆశ్చర్యపోయారు. ఆ స్థాయిలో ఇదివరకు ఎప్పుడూ తరంగాలు నమోదవలేదని తేల్చారు. ఎంతో ప్రశాంతంగా ఉంటే తప్ప మెదడులో అలాంటి చర్య సాధ్యం కాదని గ్రహించారు.   ఈ పరిశోధన బయటకు రావడంతో మీడియా అంతా ఆయనని "happiest person in the world" అంటూ ఆకాశానికి ఎత్తేసింది. కానీ తనకు అలాంటి బిరుదులేవీ వద్దని, తనని మించిన ఆధ్యాత్మికవేత్తలు ఎందరో ఉన్నారని మాథ్యూ చెబుతూ ఉంటారు.   ఇంతకీ మాథ్యూ మనసు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగితే... ఆయన చెప్పే సమాధానాలు వినండి. బహుశా అవి మనకు కూడా ఉపయోగపడతాయేమో!   - ఎప్పుడూ ‘నేను, నేను, నేను’ అంటూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటే ప్రపంచం మొత్తం నీకు శత్రువులాగానే కనిపిస్తుంది. దాంతో మనశ్శాంతి కరువవుతుంది. జాలి, కరుణ, పరోపకారం లాంటి భావనలు చోటు చేసుకున్నప్పుడు మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. - ఎంతసేపూ సుఖాన్ని అందించే అనుభవాల కోసం వెంపర్లాడుతూ ఉంటే... సంతోషం ఎప్పటికీ దక్కదు. అలాంటి వెంపర్లాటతో అలసట తప్ప మేరమీ మిగలదు.   - సంతోషం ఒక మానసిక స్థితి. జీవితంలోని ఒడిదొడుకులను ఎదుర్కొనేందుకు కావల్సిన శక్తిని అది అందిస్తుంది. - సహనం చాలా ముఖ్యం. ఓర్పు ఫలం ఎప్పుడూ తియ్యగా ఉంటుంది. ఓర్పుతో ఉన్నప్పుడు, అద్భతమైన వ్యక్తిత్వం ఏర్పడేందుకు అవసరమయ్యే సుగుణాలన్నీ మనలో ఏర్పడతాయి.   - జీవితం నిరాశాజనకంగా ఉందని ఎప్పుడూ డీలా పడిపోవద్దు. అలాంటి సమయంలో కాస్త ఓర్పుగా ఉంటే అనుకోని మార్పులు సంభవిస్తాయి. - రోజుకి కనీసం 10-15 నిమిషాల పాటు మనసుని సంతోషకరమైన ఆలోచనలతో నిలిపి ఉంచే ప్రయత్నం చేస్తే జీవితమే మారిపోవడాన్ని గమనించవచ్చు.   - జీవితంలో ఎలాగైతే కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ మన మెదడుకి శిక్షణ ఇస్తూ ఉంటామో... అలాగే జాలి, పరోపకారం, కరుణ లాంటి మంచి లక్షణాలను కూడా మెదడుకి అలవాటు చేయడం సాధ్యమే!   - ఒకేసారి గంటల తరబడి ధ్యానంలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా కొద్ది నిమిషాల సేపైనా చేసే ధ్యానం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. క్రమం తప్పకుండా నడిచేవాడు ఒలింపిక్స్‌కి వెళ్లి పతకం సాధించలేకపోవచ్చు.... కానీ అలసట లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేసే నైపుణ్యాన్ని సాధిస్తాడు కదా! - నిర్జర.

HOW TO GET RID OF GUILT

As humans, we are bound to make mistakes. And those mistakes would certainly cling to our consciousness. Guilt is a baggage which keeps reminding us of our mistake. To some extent, guilt can bear positive consequences. But most of the times, it can be a constant pain which doesn’t let us live in peace. These are some of the ways to get rid of unnecessary guilt... Forgive yourself Guilt is an act where we punish ourselves constantly. So let’s accept that we are bound to make mistake and let’s accept that there is no good in carrying the mistake forward forever. Let’s forgive ourselves and free ourselves from guilt. Make amendments We may not live our life again to unwind the mistake. But we might try to compensate our mistake. A sorry might save a shattered relation, an explanation might heal someone’s ego.... so let’s recognise the reason for guilt and take a chance for makeup. Turn it into a possibility We have made some horrible mistake and that mistake might have changed the course of our life. Why not take it as an opportunity to build a new way to lead our life. Why not take it as a chance to review our personality. Create a List It might look funny.... but try to list out various situations of guilt that keeps lingering in your mind. Such a focus would enable you to evaluate and dissolve trifle reasons forever. Accept It is never possible to attain perfection. In the course of living our lives... we tend to make mistakes and keep learning from them. Our live mostly runs in a trial and error basis. Moreover, guilt belongs to a past situation where we might not have enough maturity to deal with the situation. Get stronger The more we get matured, the more we attain inner strength... we start taking control over our lives. And that’s certainly a situation where memories of unnecessary guilt get dissolved. Share with someone else We often feel ashamed of our guilt and try to bury deep in our heart. But sharing our moments of guilt with someone close to use could ease the burden of guilt on our mind. We might even get solace or suggestion from those with whom we have shared our guilt.   - Nirjara.

ఈ ప్రశ్నకి బదులేది!

  అది ఒక మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి మంత్రిగా ఉన్న వ్యక్తి వయసు పైబడుతోంది. దాంతో తన తర్వాత వారసుడిగా ఉండేందుకు ఎవరు తగినవారా అని నిర్ణయించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఉండగా ఓ రోజు ఎక్కడి నుంచో ఒక యువకుడు రాజాస్థానానికి వచ్చాడు. పేరు గాంచిన విశ్వవిద్యాలయాలలోనూ, ప్రసిద్ధి చెందిన గురువుల దగ్గరా  ఆ యువకుడు సకల శాస్త్రాలూ నేర్చుకున్నాడు. మహామేధావిగా పేరుగాంచాడు. అలాంటి యువకుడి ప్రతిభను విన్న రాజుగారు అతనే రాజ్యానికి కాబోయే మంత్రి అని నిర్ణయించేశారు.   రాజుగారి నిర్ణయం విన్న మంత్రి మాత్రం కాస్త డీలా పడ్డాడు. ‘రాజా! మంత్రి పదవి కేవలం పుస్తకజ్ఞానంతోనూ, పైపై మెరుగులుతోనూ, జ్ఞాపకశక్తితోనూ సాగించేది కాదు. ఇంతటి రాజ్యాన్ని నిత్యం ఏదో ఒక క్లిష్ట సమస్య వేధిస్తూనే ఉంటుంది. కాబట్టి నిజజీవితంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించే తర్కమే మంత్రికి ఉండాల్సిన తొలి లక్షణం. ఆ తర్కం ఇతనిలో ఉందో లేదో నేను పరీక్షించదల్చుకున్నాను. అప్పటివరకూ మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి,’ అంటూ ప్రాధేయపడ్డాడు.   యువకుడు ఎలాంటి తర్కానికైనా సమాధానం చెప్పగలడని రాజుగారి నమ్మకం. అందుకే వెనువెంటనే ఆ యువకుడిని ఆస్థానానికి పిలిపించారు. ‘నేను నీకో ప్రశ్న వేస్తాను. ప్రశ్న చాలా చిన్నదే కానీ జవాబు మాత్రం ఆలోచించి చెప్పాలి సుమా! అంతేకాదు! ఒకటే ప్రశ్నని మూడుసార్లు వేస్తాను. మూడుసార్లూ నువ్వు జవాబు చెప్పలేని పక్షంలో బుద్ధిని మరింతగా పదునుపెట్టేందుకు మరి కొద్ది సంవత్సరాలు గడపాల్సి ఉంటుంది,’ అని చెప్పారు మంత్రిగారు.   ‘ఓస్ అదెంతటి పరీక్ష. మహామహా తర్కాలనే తట్టుకుని నిలబడ్డాను. మీ ప్రశ్న నాకు కేవలమాత్రం,’ అని దర్పంగా వదరాడు యువకుడు.   ‘మంచిది. అయితే నా ప్రశ్నని విను. ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి పొగగొట్టంలోంచి కిందకి దిగారు. వారిలో ఒకరి ముఖానికి మసి అంటింది. వేరొకరి ముఖం శుభ్రంగానే ఉంది. ఇద్దరిలో ఎవరు మొహం కడుక్కుంటారు?’ అని అడిగాడు.   ‘ఛీ ఇదీ ఓ ప్రశ్నేనా! మసి అంటుకున్న వ్యక్తి ముఖం కడుక్కుంటాడు,’ అని బదులిచ్చాడు యువకుడు.   ‘తప్పు! శుభ్రంగా ఉన్న మనిషిని చూసి మసి అంటుకున్న వ్యక్తి తాను కూడా శుభ్రంగా ఉన్నానని అనుకుంటాడు. కానీ మసి అంటుకున్న మనిషిని చూసి, శుభ్రంగా ఉన్న మనిషి తనకి కూడా మసి అంటుకుందేమో అనుకుని మొహం కడుక్కుంటాడు. ఇప్పుడు మళ్లీ చెప్పు! ఇద్దరిలో ఎవరు మొహం కడుక్కుంటాడు,’ అని అడిగాడు మంత్రి.   ‘మీరే చెప్పారుగా. శుభ్రంగా ఉన్న మనిషి మొహం కడుక్కుంటారని,’ అని చిరాకుపడ్డాడు యువకుడు.   ‘కాకపోవచ్చు. ఇద్దరూ మొహం కడుక్కోవచ్చు. ఇందాక చెప్పాను కదా! శుభ్రంగా ఉన్న మనిషి మురికిగా ఉన్న వ్యక్తిని చూసి తనకి కూడా మసి అంటుకుందని భావిస్తాడనీ.. ఆ భ్రమలో తన మొహం కూడా కడుక్కుంటాడనీ. అవతలి వ్యక్తి చేష్టని చూసి మసి అంటుకున్న వ్యక్తి తనలో ఏదో లోపం ఉందని గుర్తించే అవకాశం ఉంది. దాంతో అతను కూడా మొహం కడుక్కుంటాడు. ఇప్పుడు మరోసారి ఇదే ప్రశ్నకి జవాబు చెప్పు,’ అని అడిగాడు మంత్రి.   రెండోసారి కూడా తన జవాబు తేలిపోయేసరికి యువకుడి అహం దెబ్బతిన్నది. రోషం పొడుచుకువచ్చింది. ‘మీరే చెప్పారు కదా! ఇద్దరూ మొహం కడుక్కుంటారని. ఇంతకు మించి మరో జవాబు నాకు కనిపించడం లేదు,’ అని చిరాకుపడ్డాడు.   ‘తప్పు! దీనికి మరో జవాబు కూడా ఉంది. ఇద్దరూ మొహం కడుక్కోకుండా ఉండిపోవచ్చు. మసి అంటుకున్న వ్యక్తి శుభ్రంగా ఉన్న వ్యక్తిని చూసి, తను కూడా శుభ్రంగా ఉన్నానని అనుకుని ఊరుకుంటాడు. మసి అంటుకున్న వ్యక్తి ప్రతిస్పందనని బట్టి తన మొహం శుభ్రంగా ఉందేమో అని గ్రహించి అవతలి వ్యక్తి కూడా ఊరుకుండిపోతాడు. ఇప్పుడు ఇదే ప్రశ్నని మరోసారి అడుగుతున్నాను. కనీసం ఈసారన్నా కొత్తగా జవాబు చెప్పేందుకు ప్రయత్నించు,’ అన్నాడు మంత్రి.   ‘ఏడ్చినట్లు ఉంది. మూడు జవాబులకి మించి ఇంకే ఆస్కారం ఉంటుంది. ఈసారి కూడా మీరు మరో జవాబు చెబితే నేను మళ్లీ ఈ ఆస్థానంలోకి రాను. నాకు తెలిసిన విద్య అంతా పుస్తకజ్ఞానమే అని ఒప్పుకొని నిజమైన జ్ఞానం కోసం, ఆ జ్ఞానాన్ని అందించే అనుభవాల కోసం దేశాటనకు వెళ్లిపోతాను,’ అన్నడు కుర్రవాడు.   ‘బాబూ! నీ దగ్గరకు ఎవరన్నా ఏదన్నా సమస్యతో వచ్చారే అనుకో! అసలు ముందు ఆ సమస్య సంభవించే అవకాశం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి కదా! అసలు ఒక చిన్న పొగగొట్టంలోంచి ఇద్దరు వ్యక్తులు కిందకి రావడం ఎలా సాధ్యం. అందులో ఒకరికి మసి అంటుకుని మరొకరికి అంటుకోకపోవడం ఎలా కుదురుతుంది. ఇంతా జరిగిందే అనుకో! పొగగొట్టంలోంచి కలిసి దిగిన ఇద్దరు వ్యక్తులు అద్దం చూసుకోకుండా ఉంటారా? ఒకవేళ అక్కడ అద్దం లేకపోయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారా? కాబట్టి నా ప్రశ్నలోనే లోపం ఉందని నువ్వెందుకు చెప్పలేకపోయావు. విషయం లేకుండా వాదన ఎలా సాధ్యమవుతుంది?’ అంటూ కుర్రవాడని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు మంత్రి.   ఆ ప్రశ్నలకి బదులివ్వలేక కుర్రవాడు రాజుగారి ముందు నుంచి నిష్క్రమించాడు. మంత్రిపదవి కోసం మళ్లీ వెతుకులాట మొదలైంది.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర