indian idol

యువతకి ఆదర్శం... ఈ రేవంత్‌

ఎల్‌.వి. రేవంత్‌... నిన్నటి దాకా ఈ పేరు వినని వారు కూడా ‘ఎవరా ఈ కుర్రవాడు’ అంటూ గూగుల్‌ చేస్తున్న పేరు. దేశంలోని ప్రతి పత్రికలోనూ ఇప్పుడు రేవంత్ ఒక న్యూస్‌ ఐటం. ఎందుకంటే తెలుగువారికి దుర్బేధ్యం అనుకునే ఇండియన్‌ ఐడిల్‌ కోటను తన పాటతో బద్దలుకొట్టిన విజేత రేవంత్‌. కేవలం తెలుగువాడన్న కారణంగా రేవంత్‌ను మనం అభిమానించడం లేదు.... అందుకు చాలా కారణాలే ఉన్నాయి.   ఊహించని నేపథ్యం హీరో కడుపులో ఉండగానే తండ్రి చనిపోతాడు. మేనమామల ఆసరాతో అతను పెరుగుతాడు. ఎవరి మీదా ఆధారపకుండా విజయాలను సాధిస్తాడు. ఇదీ మనం తరచూ వినే సినిమా కథ. కానీ రేవంత్‌ జీవితంలో ఆ సినిమా కష్టాలే నిజమయ్యాయి! కాకపోతే అతని ఉమ్మడి కుటుంబం రక్షగా ఉండటం ఓ అనుకోని అదృష్టం.   ఎంతటి శ్రమకైనా సిద్ధం రేవంత్‌కి చిన్నప్పటి నుంచే పాటలంటే ఇష్టం. పాటలపోటీల్లో పాల్గొని తనని తాను మెరుగుపర్చుకోవాలనీ, తనేమిటో నిరూపించుకోవాలనీ తపించేవాడు. కానీ అందుకోసం డబ్బులు ఖర్చవుతాయిగా! ఆ డబ్బుల కోసం రేవంత్‌ పగలు పేపర్‌బాయ్‌లా పనిచేశాడు, సాయంత్రం హోటల్‌ సర్వర్‌గా ఒళ్లు వంచాడు. అలా తన కాళ్ల మీద తనే పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.   అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు రేవంత్‌ కోరుకున్నట్లుగా పాటల పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చిన ప్రతిసారీ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. మాటీవీ ‘సూపర్‌ సింగర్స్’, ఈటీవీ ‘సప్తస్వరాలు’ లాంటి ప్రతి కార్యక్రమంలోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే మర్యాదరామన్న సినిమాలో తొలిసారిగా పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇక తిరిగి చూసుకోలేదు. చేతికి అంది వస్తున్న ఒకో సినిమాతోనూ గాయకుడిగా స్థిరమైన స్థానం సాధించాడు. బాహుబలిలో పాడిన ‘మనోహరీ’ పాటతో ప్రేక్షకులని దాసోహం చేసుకున్నాడు.   ప్చ్‌ తృప్తి లేదు! రేవంత్‌కు పాటంటే ఎంత ఇష్టమో... పాటల పోటీలంటే అంతే ఇష్టం. వాటిలో సోనీ టీవీ నిర్వహించే ‘ఇండియన్‌ ఐడిల్’ గురించి చెప్పేదేముంది! మన దేశంలోనే అది అత్యున్నత పోటీ. కొడితే ఆ కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడు రేవంత్‌. అందుకోసం ముంబైకి మకాం మార్చాలి. ఇప్పుడిప్పుడే వస్తున్న అవకాశాలని కొన్నాళ్లు వదులుకోవాలి. కానీ తన కలను నెరవేర్చుకునేందుకు రేవంత్‌ ఎంతటి రిస్క్‌ అయినా తీసుకునేందుకు సిద్ధపడిపోయాడు.   బలహీనతలు ఉంటాయి, కానీ... ఒకో మనిషికీ ఒకో బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఉంది కదా అని అసలు ప్రయత్నమే విరమించుకుంటే ఇక విజయం దక్కే అవకాశం ఏముంటుంది? రేవంత్‌కి హిందీ పెద్దగా రాదు. ఆ కారణంగానే ఇండియన్ ఐడిల్స్ పోటీలో తోటి అభ్యర్థుల అతణ్ని హేళన చేసేవారు. కానీ రేవంత్ వెనక్కి తగ్గలేదు. తనకు హిందీ రాదని నిజాయితీగా ఒప్పుకొంటూనే... సంగీతమే తన శ్వాస, భాష అని చెప్పుకొచ్చాడు. రేవంత్‌లోని ఆ నిజాయితీ న్యాయనిర్ణేతలని సైతం మెప్పించింది. చిట్టి చివరికి సింహాసనాన్ని దక్కించింది!!   రేవంత్‌కు అహం తక్కువని అతని స్నేహితులు చెబుతుంటారు. నిరంతరం శ్రమించే తత్వం ఎక్కువని అతని సన్నిహితులు పేర్కొంటారు. మొత్తానికి రేవంత్‌ పాటలకే కాదు యువతకు కూడా ఒక ఐడల్‌గా (ఆదర్శం) చెప్పుకోవచ్చన్నమాట!   - నిర్జర.

April Fools Day 2017

ఏప్రిల్‌ ఫూల్స్‌ డే రోజు సందడే!

  ఏప్రిల్‌ 1వ తేదీ వచ్చిందంటే ఏప్రిల్‌ ఫూల్స్‌ డేనే గుర్తుకువస్తుంది. ఏదో ఆడతూ పాడుతూ అవతలివారిని ఏడిపించే ఈ రోజు వెనక బోలెడు కథ ఉంది. వేర్వేరు దేశాలలో ఆ వేడుకలని జరుపుకొనే తీరులోనూ వైవిధ్యం కనిపిస్తుంది.   పసలేని వాదన ఒకప్పుడు ఆంగ్ల సంవత్సరం మార్చి 25న మొదలయ్యేది. ఆ సంవత్సర వేడుకలు వారం పాటు, అంటే ఏప్రిల్‌ 1 వరకూ జరిగేవి. కానీ 1582లో గ్రెగోరియన్‌ కేలెండర్‌ అమలులోకి రావడంతో కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ మార్పుని అనుసరించకుండా ఏప్రిల్‌ 1న కొత్త సంవత్సరాన్ని ఆచరించేవారిని ఏప్రిల్‌ ఫూల్‌ అని పిలుస్తారనేది చాలా పాత వాదన. కానీ 15వ శతాబ్దానికి ముందే ఇలాంటి ఆచారాలు ఉండేవని తెలుస్తోంది. 13వ శతాబ్దంలో వచ్చిన పుస్తకాలలో కూడా ఏప్రిల్‌ ఫూల్‌ ప్రస్తావన కనిపిస్తుంది. కాబట్టి ఇది అనాదిగా వస్తున్న ఆచారమే అనుకోవచ్చు.   ఒకో దేశంలో ఒకోలా ఏప్రిల్‌ ఫూల్‌ రోజున అవతలివారిని ఏదో ఒక విషయంలో దారిమళ్లించి వెధవాయిలని చేయడం సహజమే! కాకపోతే కొన్ని దేశాలలో ఇదే ఆచారాన్ని కాస్త విభిన్నంగా పాటిస్తారు.   - ఫ్రాన్స్‌లో చేప ఆకారంలో ఉన్న ఒక కాగితాన్ని అవతలివారికి తెలియకుండా వీపు మీద అంటిస్తారు. దీనిని ఏప్రిల్‌ ఫిష్‌ అంటారు. - పోర్చుగల్‌ దేశంలో ఒకరి మీద ఒకరు పిండి చల్లుకుంటారు. - డెన్మార్కులో ఏప్రిల్‌ 1వతో పాటు మే 1న కూడా అవతలివారిని వెర్రివెంగళాయిలను చేసే ప్రయత్నం చేస్తారు. - ఐర్లాండులో ‘ఏప్రిల్‌ ఫూల్‌’ కోసం అనే ఉత్తరాన్ని కవరులో ఉంచి ఒకరి నుంచి వేరొకరికి అందిస్తూ ఉంటారు. - ఇంగ్లండులో ఏప్రిల్‌ 1 మధ్యాహ్నం వరకే ఫూల్‌ చేయవచ్చు. ఆ తరువాత ఎవరినన్నా ఫూల్‌ చేయాలని ప్రయత్నిస్తే మనల్నే ఫూల్స్‌గా జమకడతారు.   మీడియా హడావుడి:  ఏప్రిల్‌ ఫూల్‌ రోజున జరిగే సందడిని జనాలకి చేరవేడమే కాదు.... ఆ రోజు తామే స్వయంగా జనాల్ని ఏప్రిల్‌ ఫూల్‌ చేసే ప్రయత్నం చేస్తుంటాయి కొన్ని మీడియా సంస్థలు. లేని వార్తను ఉన్నట్లుగా, జరగనిదానిని జరిగినట్లుగా ప్రచురించి జనాల్ని ఫూల్స్ చేస్తుంటాయి. ఇవి ఒకోసారి వివాదాస్పదం అవుతుంటాయి కూడా! ఉదాహరణకి 1957లో బీబీసీ టీవీ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పూల తీగలను పెంచినట్లే తినే నూడిల్స్‌ (spaghetti) కాసే చెట్లని కూడా పెంచవచ్చని ఆ కథనంలోని సారాంశం. అప్పట్లో నూడిల్స్ తయారీ గురించి అంతగా అవగాహన లేని బ్రిటన్‌వాసులు ఈ వార్త నిజమేనని నమ్మి... సదరు చెట్లను ఎలా పెంచాలా అని పరిశోధన మొదలుపెట్టేశారు. మీడియా ద్వారా అతి పెద్ద ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ అని ఇప్పటికీ ఆ ఘటనను తల్చుకుంటారు.   ఇవీ ఏప్రిల్‌ ఫూల్స్ విశేషాలు! ఏప్రిల్‌ ఫూల్‌ హద్దులో ఉంటే ఆరోగ్యకరమైన హాస్యానికి దారితీస్తుందనీ, హద్దులు దాటితే అవతలివారి మనోభావాలని దెబ్బతీస్తుందనీ పెద్దలు చెబుతున్నారు. ఆ హద్దులేవో పాటిస్తే పోలా! - నిర్జర.

 Padma Shri kiran martin

5 లక్షల తలరాతలు మార్చేసిన మహిళ

  డా॥ కిరణ్ మార్టిన్ పిల్లల వైద్యురాలు. ఓసారి ఆమె దక్షిణ దిల్లీలోని ఓ మురికివాడలోకి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందు ఎప్పుడూ ఆమె మురికివాడల్లోకీ, అందులోని పూరిగుడిసెలలోకీ అడుగుపెట్టనే లేదు. దాంతో అక్కడ తనకి కనిపించిన దృశ్యానికి కిరణ్కు మతిపోయినంత పనయ్యింది. మురికివాడల్లోని పిల్లలు ఎక్కడ పడితే అక్కడ మలవిసర్జన చేస్తున్నారు. గుడిసెలలో ఇంతెత్తున చెత్త పేరుకుపోయి ఉంది. ఆ చెత్తలోనే పసిపిల్లలు ఆడుకుంటున్నారు. వారు తాగే నీరు పరమ మురికిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం సంగతి చెప్పేదేముంది? వాడవాడంతా కలరాతో బాధపడుతోంది. ఆ మహమ్మారిని తప్పించుకునే పరిస్థితి కానీ, కలరా సోకిన తరువాత వైద్యం చేయించుకునే స్తోమత కానీ వారికి లేవు.     మురికివాడలో పరిస్థితిని చూసి కిరణ్ చలించిపోయారు. తను వారికి ఉచితంగా వైద్యం చేయాలని అనుకున్నారు. వెంటనే ఓ చెట్టు కింద కలరా రోగులకు ఉచితంగా వైద్యం చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఒకరిద్దరి సహకారంతో ఆ మురికివాడలోనే ఒక చిన్న ఇంట్లో క్లినిక్ను తెరిచారు. మరో అడుగు ముందుకు వేసి ఆ మురికివాడలోని జీవితాలను బాగుచేసేందుకు ‘ఆశా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఇదంతా 1990 నాటి పరిస్థితి. ఆ తరువాత ‘ఆశా’ దిల్లీ మురికివాడల తీరునే మార్చివేసింది. అదంతా మరో కథ!       ఆశా ప్రారంభంలోనే డా॥ కిరణ్ మురికివాడల్లోని ఆడవారిని భాగస్వాములుగా చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటివరకూ ఎంతోమంది తియ్యటి మాటలు విని మోసపోయిన వారు... ఆమెను అంతగా నమ్మలేదు. క్రమేపీ కిరణ్ అంకితభావం, నిస్వార్థంగా వైద్యం చేస్తున్న విధానం చూసి దగ్గరయ్యారు. తాగే నీరు అన్న మాటే ఎరగని ఆ వాడలో కిరణ్ మంచినీటిని ఏర్పాటు చేయడంతో ఆమెకు అనుసరించేంత నమ్మకం ఏర్పడింది. ఆడవారి సంగతి అలా ఉంచితే మగవారు మాత్రం కిరణ్కు సహకరించలేదు సరికదా... ఆమెను వేధించే ప్రయత్నం చేశారు. కిరణ్ వారిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోయేవారు. పైగా మగవారిలోని అభద్రతా భావాన్ని తొలగించేందుకు,  ‘ఆశా’ సమావేశాలకి వారిని కూడా ఆహ్వానించేవారు. అలాంటి వ్యక్తిత్వానికి లొంగనివారుంటారా! ఇప్పుడు దిల్లీలోని మురికివాడల్లో ‘ఆశా’ గురించి తెలియనివారు ఉండరు. ఆశాలో శిక్షణ పొందిన కార్యకర్తలు సాధారణ అనారోగ్యాలన్నింటికీ చికిత్స చేసేందుకు సన్నద్ధంగా ఉంటారు. వాడవాడలా క్వాలిఫైడ్ వైద్యులు, నర్సులతో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆశా కేవలం దక్షిణ దిల్లీలోని ఒక మురికివాడకే పరిమితమైన సంస్థ కాదు! దిల్లీ అంతటా 60 మురికివాడల్లో ఉన్న ఐదు లక్షలమంది జనాలని ప్రభావితం చేసే ఓ ఉద్యమం. అందుకే ఆశా ఆవిర్భవించిన తరువాత దిల్లీ మురికివాడల్లో శిశు మరణాలు, అంటువ్యాధులు, పోషకాహార లోపాలు వంటి సవాలక్ష ఆరోగ్య సమస్యలు గణనీయంగా తగ్గిపోయాయి.     ఆశా కేవలం పేదల అనారోగ్యాన్ని దూరం చేసేందుకే ప్రయత్నించదు. ఆ అనారోగ్యానికి కారణమైన నిరక్షరాస్యత, పేదరికాలను కూడా రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. సేవింగ్స్ ఖాతాలను ఎలా తెరవాలి? బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఎలా? వ్యాపారం కోసం ఎలాంటి రణాలు లభిస్తాయి? లాంటి విషయాల మీద అవగాహన కల్పించడం ద్వారా కొందరి ఆదాయం అమాంతం పదిరెట్లు పెరిగిపోయిందట! ఇక మురికివాడల్లోని తెలివైన కుర్రకారుకి ఉన్నత విద్యావకాశాలు కల్పించడం మరో ఎత్తు. ఇలా దాదాపు 1200 మంది మురికివాడ విద్యార్థులు దిల్లీ యూనివర్శిటీ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలలో అడుగుపెట్టగలిగారు. ఇదీ కిరణ్ కథ! ‘నేను ఒక్కదాన్ని. ఆడమనిషిని. మురికవాడల్లో అంతా మొరటుజనాలు, మురికి మనుషులు.’ అని కిరణ్ అనుకొని ఉంటే..... - నిర్జర.

Ugadi Celebrations

ఉగాది పండుగే ఒక జీవితపాఠం!

  మన పండుగలని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి- పూజలు, పిండివంటలతో హడావుడిగా సాగే భౌతికమైన ఆచారం, రెండు- ఆ పండుగ ద్వారా పెద్దలు మనకి చెప్పదలచిన జీవితసారం. మొదటి సందర్భాన్ని మనం పాటించినా పాటించకపోయినా రెండో సందర్భాన్ని మాత్రం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా ఉగాది నుంచి కూడా ఏమైనా మంచి విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తే, ఉగాది అణువణువూ ఏదో ఒక జీవితపాఠం కనిపిస్తూనే ఉంటుంది.   తైలాభ్యంగనం – ఉగాది రోజున లేవగానే నువ్వులనూనెతో స్నానం చేయాలని చెబుతారు పెద్దలు. ఒంటికి నువ్వులనూనెని పట్టించి, ఆపై సున్నిపిండితో నలుగుపెట్టుకుని స్నానం చేయడం వల్ల ప్రతి స్వేదరంథ్రమూ శుభ్రపడుతుంది. ఏ పండుగలో చేసినా చేయకున్నా ఉగాదినాడు మాత్రం ఈ ఆచారం పాటించితీరాలంటారు. ఉగాది మన సంవత్సరపు ఆరంభం కాబట్టి, ఆ రోజుని శుచిగా మొదలుపెట్టాలన్నది ఈ నియమం వెనుక సూచన కావచ్చు. శరీరం క్షణభంగురమే కావచ్చు! కానీ ఉన్న ఆ కాస్త కాలమూ దానిని ఆరోగ్యంగా, శుచిగా కాపాడుకోవాల్సిందే! మనసుని పరిశుద్ధంగా, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందే!   కాలమే దైవం – హిందువులకు ముక్కోటి దేవతలు ఉన్నారు. కానీ ఉగాది రోజున కాలమే దైవం. కొన్ని సందర్భాలలో కాలాన్ని కేవలం ‘సమయం’గా కాకుండా ఈ ప్రకృతిలోని సమన్వయాన్ని నెలకొల్పే శక్తిగా (రుతం) వేదాంతులు భావిస్తూ ఉంటారు. అంత లోతుల్లోకి వెళ్లకున్నా... జీవితంలో కాలం విలువని తెలియచేసే సందర్భంగా, కాలాన్ని విభజించే లెక్కగా ఉగాదిని చూడవచ్చు.   తీపిచేదుల కలయిక – జీవితమంటే కష్టసుఖాల కలయిక. వీటితో పాటు సంతోషం, కోపం, బాధ, వైరాగ్యం, గర్వం, వినయం... వంటి సవాలక్ష భావాలన్నీ మనిషిని పలకరిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ అదుపులో ఉంచుకోవాలని, ఎటువంటి ఒడిదొడుకులనైనా ఎదుర్కోవాలనీ సూచించేదే ఉగాది పచ్చడి. అందుకే పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అనే ఆరురుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినందే పండుగకి అర్థం లేదంటారు పెద్దలు.   పంచాంగ శ్రవణం – మన ప్రాచీనుల ఖగోళశాస్త్రానికి కాస్త నమ్మకాన్ని జోడిస్తే అదే పంచాంగం. రాబోయే సంవత్సరంలో రాజకీయం, వ్యవసాయం, వాతావరణం వంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న అంచనా ఎలాగూ ఉంటుంది! ఇక వ్యక్తిగతంగా ఆదాయవ్యయాలు, అవమానం రాజపూజ్యం వంటి వివరాలూ కనిపిస్తాయి. వీటిపట్ల నమ్మకం ఉన్నా లేకున్నా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలనీ, ఏ సందర్భంలోనూ వినయాన్ని కోల్పోకూడదనీ పెద్దల సూచనగా భావించవచ్చు.   పరోపకారం – ఉగాది రోజున చలివేంద్ర పెడితే బోలెడు పుణ్యమని చెబుతారు. అలా కుదరకున్నా కనీసం నీటితో నిండిన కుండని దానం చేయమన్నారు. ఇక ఉగాదినాడు చెప్పులు, గొడుగు దానం చేసినా విశేష ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఎండాకాలంలో తోటివారికి నీరు, చెప్పులు, గొడుగులు అందించడాన్ని మించిన సాయం ఏముటుంది! మన స్తోమతను అనుసరించి కాలానుగుణంగా తోటివారికి సాయపడేందుకు సిద్ధపడాలన్న ఆశయం ఈ ఆచారంలో కనిపిస్తుంది.     - నిర్జర.

World wildlife fund

వెలుగుల భవిష్యత్తు కోసం గంటసేపు చీకటి - EARTH HOUR

  ప్రపంచం విద్యుత్తు మీద విపరీతంగా ఆధారపడుతోందనీ, ఆ విద్యుత్తుని ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనూ, విద్యుత్ పరికరాల వల్లా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోందని పరిశోధనలు రుజువు చేస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయమై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 2004లో World wildlife fund (WWF) ఏదన్నా కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంది. కానీ ఏం చేస్తే తాము చెప్పదల్చుకున్న విషయం ప్రజల్లోకి వెళ్తుందో ఆ సంస్థకి తెలియలేదు. చివరికి 2007లో ‘EARTH HOUR’ అనే ప్రచారం చేపట్టింది. ఒక గంటపాటు విద్యుత్ వాడకం లేకుండా చేయడమే ఈ ఎర్త్ అవర్ లక్ష్యం.   ఇలా 2007 మార్చి 31న సిడ్నీలో (ఆస్ట్రేలియా) సాగిన ఎర్త్ అవర్ కార్యక్రమం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి ఈ ప్రయోగానికి తిరుగులేకుండా పోయింది. 2008లో ఈ కార్యక్రమంలో 35 దేశాలలోని 400 నగరాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయంటే ఈ ఆలోచన ఎంత విజయవంతమైందో తెలిసిపోతుంది. అది మొదలు ఏటా ఎర్త్ అవర్కు ప్రచారం, ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నాయి. నేషనల్ జాగ్రఫిక్, గూగుల్ వంటి సంస్థలు ఒకొక్కటిగా ఎర్త్ అవర్ను ప్రచారం చేసేందుకు సిద్ధపడుతున్నాయి.     ఎర్త్ అవర్ వల్ల ఓ గంట పాటు విద్యుత్తు వాడకం తగ్గుతుంది. దీని వల్ల కొన్ని టన్నుల కొద్దీ కార్బన్ డై ఆక్సైడ్ గాల్లోకి చేరకుండా ఆపినవారవుతాం. అంతేకాదు! ఎర్త్ అవర్ని పాటించడం వల్ల ప్రజల్లో పర్యావరణం పట్ల స్పృహ పెరుగుతోందని తేలింది. ఒక అంచనా ప్రకారం ఎర్త్ అవర్ తర్వాత, ప్రజల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాలనే తపన ఓ నాలుగు శాతం పెరిగిందట. చాలా సంస్థలు విద్యుత్తు పొదుపుని ఎర్త్ అవర్కే పరిమితం చేయకుండా... దీర్ఘకాలికంగా విద్యుత్తుని పొదుపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయట.   ఒక గంటసేపు విద్యుత్తు వాడకాన్ని తగ్గిస్తే ఏం ఒరుగుతుంది అని పెదవి విరిచేవారూ లేకపోలేదు. ఎర్త్ అవర్కు వ్యతిరేకంగా వీరు వినిపించే వాదనలూ లేకపోలేవు. ఎర్త్ అవర్ సమయంలో లైట్ల బదులు కొవ్వొత్తులను వెలిగించడం వల్ల వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ సంగతి ఏంటి అని వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచాన్ని చీకటిలో మగ్గించే ఎర్త్ అవర్ సమయంలో నేరాలు, ప్రమాదాలు ఎక్కువయే ప్రమాదం ఉందని ఎత్తి చూపుతున్నారు.     ఎన్ని విమర్శలు ఎదురైనా ఎర్త్ అవర్ వెనుక ఉన్న ఉద్దేశం ఉన్నతమైనదే అని చాలామంది అభిప్రాయం. అందుకే ప్రభుత్వాలు సైతం ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈఫిల్ టవర్, బకింగ్హామ్ ప్యాలెస్, ఒపెరా హౌస్ వంటి ప్రముఖ పర్యటక స్థలాలన్నీ ఎర్త్ అవర్లో పాలు పంచుకుంటున్నాయి. మన దేశంలోనూ ఎర్త్ అవర్కు ఏటా ప్రాచుర్యం పెరుగుతూ వస్తోంది. గత ఏడాది రాష్ట్రపతి భవన్లో సైతం ఎర్త్ అవర్ను పాటించారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ను మార్చి 25 రాత్రి 8:30 నుంచి 9:30 వరకూ జరుపుకోవాలని WWF పిలుపునిస్తోంది. మరి ఈ పిలుపుని అందుకునేదెవరో. ఎవరో దాకా ఎందుకు! మనమే ఓ గంటపాటు ఇంట్లో వీలైనన్ని విద్యుత్ పరికరాలను నిలిపివేస్తే సరి! - నిర్జర.      

Why should children play outside

పర్యావరణం కాపాడాలా? పిల్లల్ని బయట ఆడుకోనివ్వండి...

  పర్యావరణం నాశనం అయిపోతోంది! చెట్లని అనవసరంగా నరికేస్తున్నాము! మనిషి ప్రకృతిని కాపాడుకోలేక పోతున్నాడు! ఇలాంటి మాటలని మనం ప్రతి రోజూ వింటూనే ఉన్నాము. కానీ దీనికి విరుగుడు ఏమిన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన జవాబులు లభించడం లేదు. జనంలో చిత్తశుద్ధి లేకపోతే ఎవరు ఎంత మోగినా కూడా ప్రయోజనం ఉండదు కదా! కానీ ఇందుకో ఉపాయం ఉందంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు.   కెనడాలోని Okanagan విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పర్యావరణానికీ, బాల్యానికీ మధ్య సంబంధం ఉందేమో అని కనుగొనే ప్రయత్నం చేశారు. దీని కోసం వారు 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యూనివర్సిటీ విద్యార్థులని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో చిన్నప్పుడు ఆరుబయట ఆడుకున్నవారిలో 87 శాతం తాము ఇప్పటికీ ప్రకృతిని ప్రేమిస్తున్నమని చెప్పుకొచ్చారు. ఇక వీరిలో ఒక 84 శాతం మంది తాము ప్రకృతిని రక్షించుకునేందుకే ప్రయత్నిస్తామని వెల్లడించారు. అనవసరంగా చెట్లని కొట్టేయక పోవడం, చిన్న చిన్న దూరాలకి వాహనాలను వాడకపోవడం, రీసైకిల్డ్‌ వస్తువులను వాడటం, విద్యుత్తును వృధా చేయకపోవడం వంటి చర్యల ద్వారా తాము ఎప్పుడూ ప్రకృతికి చేటు చేయకుండా జీవించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.   ఇంతకుముందు పిల్లలు ఆరుబయట ఆడుకునేందుకు పెద్దలు అంగీకరించేవారు. బడిలో కూడా విశాలమైన ఆటస్థలాలు ఉండేవి. పైగా స్కౌటింగ్‌, ఎన్‌సీసీ, సమ్మర్‌ క్యాంప్స్‌ వంటి కార్యక్రమాల ద్వారా పిల్లలను బయట తిప్పేవారు. కానీ ఇప్పటి ఆటలు, చదువు అన్నీ ఇంటికే పరిమితం అయిపోతున్నాయి. ఇవి పిల్లల మానసిక, శారీరిక వికాసాన్ని దెబ్బతీస్తాయని ఇంతకుముందే అనేక పరిశోధనలు వెల్లడించాయి. పర్యావరణం పట్ల కూడా వారికి ప్రేమ లేకుండా పోతుందని తాజా పరిశోధన తేల్చి చెబుతోంది. కాబట్టి... పిల్లలని కనుక ఆరుబయట ఆడుకోనిస్తే వారిలో పర్యావరణం పట్ల సృహ ఏర్పడుతుందనీ, అది వారి ఆలోచనా విధానం మీద ప్రభావం చూపుతుందనీ చెబుతున్నారు.   - నిర్జర.

kids sleeping

పిల్లలు హాయిగా పడుకోవాలంటే!

  పిల్లలు సరిగ్గా నిద్రపోకపోవడం అనేది కనిపించని వేదన. దాని వల్ల అటు పిల్లలూ ఇబ్బంది పడతారు, వారితో పాటుగా పెద్దలూ బాధపడతారు. పిల్లలలో నిద్రలేమి, భవిష్యత్తులో కూడా వారిలో అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు పరిష్కారంగా Stephanie Zandieh అనే నిపుణుడు కొన్ని సలహాలను అందిస్తున్నారు. ముఖ్యంగా 1- 5 ఏళ్లలోపు పిల్లలకి ఈ సలహాలు దివ్యంగా పనిచేస్తాయంటున్నారు.   - పిల్లలు నిద్రపోయేందుకు ఓ సమయాన్ని అలవాటు చేయాలి. అంతేకానీ నిద్రపోతే వారే అలసిపోయి పడుకుంటారులే అనుకోవద్దు. నిజానికి అలసిపోయి పడుకునే పిల్లలు నిద్ర మధ్యలో లేచే సందర్భాలు ఎక్కువగా ఉంటాయట!!!   - పిల్లలు నిద్రపోయేటప్పుడు తమ పక్కన ఏదన్నా బొమ్మనో, బొంతనో ఉంచుకోవడాన్ని గమనించవచ్చు. ఇది మంచి అలవాటే అంటున్నారు నిపుణులు. ఇలా ఏదో ఒక వస్తువుతో వారి అనుబంధం వల్ల, పిల్లలు ఒక సురక్షితమైన భావనలో ఉంటారట. తద్వారా ప్రశాంతంగా నిద్రపోతారు.   - పిల్లవాడు ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేలా ఒకే తరహా వాతావరణాన్ని కొనసాగించండి. నిద్రపోయే ముందర స్నానం చేయించడమో, కథలు చదివి వినిపించడమో, జోలపాటలు పాడటమో చేస్తూ ఉండటం వల్ల.... పిల్లవాడు నిద్రలోకి జారుకుటాడు.   - పిల్లవాడి పక్కని కానీ, అతను పడుకునే ప్రదేశాన్ని కానీ, అక్కడి వెలుతురిని కానీ తరచూ మార్చడం అంత మంచిది కాదు.   - పిల్లవాడు తనంతట తానుగా నిద్రలోకి జారుకునేలా అలవాటు చేయడం మంచిది. దానివల్ల రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచిన తరువాత తనంతట తానుగా మళ్లీ నిద్రపోగలడు. లేకపోతే మీరు అతణ్ని గమనించుకుని మళ్లీ నిద్రపుచ్చేదాకా ఇబ్బందిపడుతూనే ఉంటాడు.   - పిల్లలు వేరే గదిలో పడుకుంటే, వారిని రాత్రి మధ్యలో అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండటం మంచిది. పిల్లలు ఉలిక్కిపడి లేచినట్లు అనిపిస్తే, బద్ధకించకుండా లేచి వారి దగ్గరకి వెళ్లాల్సిందే! అవసరం వచ్చినప్పుడు మీరు వారి పక్కనే ఉంటారనే భద్రతా భావం వారికి ప్రశాంతతని కలిగిస్తుంది.   - పిల్లలని వేరే గదిలో ఉంచడం అన్న మార్పుని ఒక్కసారిగా చేయడం మంచిది కాదు. ముందు పిల్లవాడు తనంతట తానుగా పడుకునే అలవాటు చేయాలి. ఆ తరువాత మీరు అతని కనుచూపు మేరలో ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించాలి. అవసరం అయినప్పుడు మీరు తన పక్కనే ఉంటారన్న భద్రతని అందించాలి. అప్పుడు మాత్రమే అతణ్ని వేరే చోట పడుకోపెట్టే ప్రయత్నం చేయాలి. అలా కాకపోతే అతని నిద్ర దెబ్బతినడం సంగతి అటుంచితే తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య లేనిపోని దూరాలు ఏర్పడతాయి. - నిర్జర.    

naga naresh karutura

నరేష్‌ని చూసి నేర్చుకోవాల్సిందే!

కష్టాలు ఒకోమనిషిని ఒకో తీరులో పలకరిస్తాయి. కొంతమంది ఆ కష్టాలకి కుంగిపోయి వాటినే నెమరేసుకుంటూ నిలబడిపోతారు. మరికొందరు మాత్రం అవి జీవితంలో మరో మార్గాన్ని చూపిస్తున్నాయన్న సూచనను అందుకుంటారు. అందుకనే వాళ్లు విజేతలుగా నిలిచిపోతారు. అలాంటి ఓ జీవితమే ‘నాగ నరేష్ కరుటుర’ అనే కుర్రవాడిది.   నాగనరేష్‌ది పశ్చిమగోదావరి జిల్లాలోని తీపర్రు అనే పల్లెటూరు. నరేష్‌ అందరిలాంటి కుర్రాడే. ఇంకామాట్లాడితే స్తోమతలో అందరికంటే చిన్నవాడు. అతని తండ్రి ఓ సాధారణ లారీ డ్రైవరు, తల్లి గృహిణి. చదువులో నరేష్ ఎప్పుడూ ముందే ఉండేవాడు. తీపర్రులో అలా ఆడుతూపాడుతూ చదువుతున్న నరేష్‌ ఓసారి అనుకోని ప్రమాదానికి లోనయ్యాడు. సంక్రాంతి పండగని ఊరికి వెళ్లే ప్రయత్నంలో, నరేష్‌ ఓ లారీ మీద నుంచి కిందపడిపోయాడు.   ప్రమాదం జరిగిన మాట వాస్తవమే కానీ... అదేమీ ప్రాణాంతకం కాదు! కానీ వైద్యుల నిర్లక్ష్యం మాత్రం అతనికి ప్రాణాంతకంగా మారింది. ప్రమాదంలో గాయపడిన నరేష్‌కు ఓ చిన్న బ్యాండేజీ కట్టి పంపేశారు వైద్యులు. ఆ గాయం లోలోపలే కుళ్లిపోయి చివరికి అతని రెండు కాళ్లనీ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్క పేదరికం, మరో పక్క వైకల్యం. ఇంకరైతే ఈ పరిస్థితికి క్రుంగిపోయేవారేమో! కానీ నరేష్‌ మాత్రం తనకి కాళ్లు లేవన్న కారణంతో వెనక్కి తగ్గకూడదని అనుకున్నాడు. దానికి తోడు నరేష్‌కు తగిన వైద్యం కోసమని తండ్రి తణుకు పట్నానికి మకాం మార్చాడు. తీపర్రులోనే ఉంటే నరేష్ చదువు పదోతరగతితోనే ఆగిపోయేది. కానీ తనకి కాళ్లు పోవడం వల్లే తణుకులోని మిషనరీ స్కూల్లో చదివే అవకాశం వచ్చిందంటాడు నరేష్‌.   తణుకులో చదువుకునే సమయంలోనే నరేష్‌కి ఉన్నత చదువులకి అవకాశం ఇచ్చే JEE పరీక్ష గురించి తెలిసింది. అంతే! తన దృష్టినంతా JEE ఎంట్రెన్స్‌ పరీక్షల మీద కేంద్రీకరించాడు. ఆ పరీక్షలలో జాతీయస్థాయిలోనే వికలాంగుల కోటాలో నాలుగో ర్యాంకుని సంపాదించాడు. దాంతోపాటే మద్రాసు ఐఐటీలో సీటునీ సంపాదించాడు. నరేష్‌ గురించి విన్న జయపూర్‌ హాస్పిటల్‌వాళ్లు అతని చదువుకి అయ్యే ఫీజులని భరించేందుకు సిద్ధపడ్డారు. మద్రాసు ఐఐటీలోని అతని సహవిద్యార్థులు నరేష్‌ కోసం ఓ బ్యాటరీ కుర్చీని కొనిపెట్టారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయలేదు నరేష్. ఐఐటీ కోర్సుని సమర్థంగా పూర్తిచేశాడు. గూగుల్‌ బెంగళూరు క్యాంపస్‌లో ఉద్యోగాన్ని సాధించాడు.   ఏం జరిగినా అంతా మన మంచికే అనీ, తన చుట్టూ ఉన్న మనుషులంతా మంచివారేననీ నరేష్‌ నమ్మకం. పరిస్థితులన్నీ అతని నమ్మకాన్ని బలపరిచేలాగానే సాగాయి. రైళ్లో అతనితో పాటు ప్రయాణించినవారు కూడా నరేష్ పట్టుదలని చూసి సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజమే మరి! మన దృక్పథం ఎలా ఉంటుందో... ప్రపంచం కూడా దానికి అనుగుణంగానే కనిపిస్తుందన్నది పెద్దల మాట కదా. సాధించలేను అనుకుంటే ఎన్ని సులువులు చేతికందినా ముందుకు వెళ్లలేము. సాధించి తీరాలి అనుకుంటే ప్రతి అడుగూ అవకాశం దిశగానే పడుతుంది.   - నిర్జర.

marriage expenditure

పెళ్లి సందడి కోసం... ఎంత అప్పుకైనా సిద్ధం

టాటా కేపిటల్, ఖాతాదారులకు రుణాలను అందించే సంస్థ. చదువులు, ఇల్లు కట్టుకోవడం వంటి అవసరాలతో పాటుగా పెళ్లి కూడా జేబులని గుల్లచేసే సందర్భమే అని ఈ సంస్థ గ్రహించింది. మన దేశంలో పెళ్లి ఖర్చుల పేరుతో దాదాపు 700 కోట్ల రూపాయల వరకూ వ్యాపారం జరుగుతోందట. ఇక అనధికారికంగా సాగే ఖర్చులు, కట్నాల గురించి చెప్పేదేముంది. అందుకే పెళ్లిళ్లకి కూడా అప్పులు ఇస్తాం అంటూ టాటా కేపిటల్‌, బజాజ్ ఫిన్‌సర్వ వంటి సంస్థలు ముందుకువస్తున్నాయి. పెళ్లి కోసం 25 లక్షల వరకూ అప్పులు ఇస్తున్నాయి.   ఈ నేపథ్యంలోనే టాటా కేపిటల్‌ సంస్థ పెళ్లి ఖర్చుల గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 2,500 మంది పాల్గొన్న ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.   - నూటికి 74 శాతం మంది పెళ్లి ఖర్చుల బడ్జట్ పది లక్షల వరకూ పెట్టవచ్చన్న అంచనాలో ఉన్నారు.  - 27 శాతం మంది పెళ్లి కోసం అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చుపెట్టామన్న పశ్చాత్తాపంలో ఉన్నారు. - ఒకప్పుడు పెళ్లంటే బంధువులకి మర్యాదలు చేయడం, బాజాభజంత్రీలు, హనీమూన్‌కి వెళ్లడం వంటి ఖర్చులకే అధిక ప్రాధాన్యతని ఇచ్చేవారు. కానీ ఇప్పటి తరంలో దాదాపు 66 శాతం మంది వివాహ దుస్తులు, ఆభరణాలు, మేకప్‌ వంటి ఆడంబరాలకే అధిక ప్రాధాన్యత అని చెప్పేశారు. - టాటా కేపిటల్‌వారి గుండెల అదిరిపోయేలా 44 శాతం మంది అసలు పెళ్లిళ్లకి అప్పులు ఇస్తారన్న విషయమే తమకు తెలియదని చెప్పారు. అయితే పెళ్లి ఖర్చుల కోసం ఒకవేళ రుణం దొరుకుతుంటే... దానిని అందిపుచ్చుకునేందుకు 58 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. - 30 ఏళ్లలోపు వారు ఆర్భాటంగా పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. 30 ఏళ్లు పైబడినవారు మాత్రం ఏదో నామమాత్రంగా పెళ్లిసాగిపోతే చాలు అనుకుంటున్నారట. - 50 శాతం మంది మగవారు ఓ ఐదు లక్షల రూపాయలలోపు ఖర్చుతో పెళ్లి ముగించేయాలని అనుకుంటున్నారు. కానీ ఆడవారిలో 32 శాతం మాత్రమే ఇలా తక్కువ ఖర్చులో పెళ్లి జరిగేందుకు ఇష్టపడుతున్నారు. - తమ పెళ్లి ధూంధాంగా 30 లక్షల వరకూ ఖర్చుతో సాగాలని ఒ 22 శాతం మంది మగవారు కోరుకుంటున్నారు. ఆడవారిలోనేమో ఆర్భాటంగా పెళ్లి జరగాలని కోరుకునేవారి సంఖ్య 36 శాతంగా ఉంది. - తీరా పెళ్లి చేసుకుని పద్దులన్నీ చూసుకున్నాక, జరిగిన ఖర్చులని చూసి లబోదిబోమంటున్నారు కుర్రకారు. కనీసం మూడోవంతు మంది యువతులు, తమ పెళ్లి ఖర్చులు అనుకున్నదానికన్నా పదిలక్షలు ఎక్కువగా తేలాయని బాధపడ్డారట.   - నిర్జర.

suchi mukherjee

ఈ మహిళల విజయంతో కళ్లు చెదిరిపోవాల్సిందే!

  కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ, షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ... అంటూ మంచి భార్యకి ఉండాల్సిన లక్షణాలు చెబుతాయి ధార్మిక గ్రంథాలు. కానీ స్త్రీ అంటే కేవలం భార్యేనా? కుటుంబాన్ని చక్కదిద్దడంలోనే ఆమె జీవితానికి సార్థకత దక్కుతుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఆరుగురు విజయగాథలను గర్వంగా చెప్పుకుందాం...   సుచీ ముఖర్జీ - ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. బయటకు వెళ్లే ఓపిక లేకనో, ధరలు తక్కువనో.. కారణం ఏదైతేనేం! అంతా ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలా గుర్గావ్కి చెందిన ‘సుచీ ముఖర్జీ’ కూడా ఆన్లైన్ ద్వారా తనకి నచ్చిన బట్టలు కొనాలనుకున్నారు. ప్చ్!! ఎన్ని దుస్తులు చూసినా ఆమెకి నచ్చలేదు. అందరికీ నచ్చేలా కేవలం దుస్తుల కోసమే ఒక ఆన్లైన్ షాపింగ్ సైట్ ఉంటే బాగుండు అనుకున్నారు. ఎవరో దాకా ఎందుకు... తనే limeroad.com పేరుతో ఒక వెబ్సైట్ ప్రారంభించారు. ఈ ఆలోచన ఏమేమరకు ఫలితాన్ని ఇచ్చిందో అనుకుంటున్నారా! ఒక్కసారి limeroad.comలోకి వెళ్లి చూడండి. కళ్లు చెదిరిపోతాయి.   మిథాలీ టండన్ - నగర జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పగలంతా సమస్యలతో నలిగేవారు సాయంవేళకి కాస్తోకూస్తో మందుపుచ్చుకోవడం అలవాటైపోయింది. ఇక శనాదివారాలు వస్తే చాలు.... వీకెండ్ పార్టీలలో పాల్గొని తీరాల్సిన పరిస్థితి. కానీ పొద్దున్నే లేచి ఆఫిసులకి పరుగులు తీసేదెలా! మద్యం మత్తులో నిస్సత్తువగా, తలనొప్పిగా ఉండే శరీరాన్ని ఉరుకెత్తించేదెలా! ఈ సమస్యకు పరిష్కారం కనుగొని దాన్ని ఓ వ్యాపారచిట్కాగా మార్చేశారు ‘మిథాలీ టండన్’. Morning Fresh పేరుతో హ్యాంగోవర్ తగ్గించే డ్రింక్ను ఉత్పత్తి చేస్తూ... మందుబాబులకు పరిష్కారాన్నీ, తనకి విజయాన్నీ సాధించారు. కావాలంటే drinkmorningfresh.com చూడండి.   రష్మీ దాగా - IIM అహ్మదాబాద్లో చదువుకున్న రష్మీ దాగా, బెంగళూరులో కళ్లు చెదిరే జీతంతో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగపు ఒత్తిడిలో పడి అప్పుడప్పుడూ రష్మీ బయటనుంచి భోజనం ఆర్డరు చేసేవారు. ఆ భోజనంతో ఆమెకి ఆకలి తీరేదేమో కానీ తృప్తి మాత్రం కలిగేది కాదు. ఎప్పుడూ ఒకటేరకం కూరలు, ఏదో అమ్ముకోవడం కోసం వండినట్లుగా యాంత్రికంగా తోచే రుచి... దీంతో ఇంటి భోజనంలా ఎప్పడికప్పుడు రుచికరంగా, వైవిధ్యంగా ఉండే ఆహారాన్ని అందచేస్తే ఎంత బాగుండో అనిపించింది. వెంటనే తన ఆలోచనను అమలుచేసేశారు. ఫలితం ఆమె స్థాపించిన హోం డెలివరీ ఆహారం ఇప్పుడు నాలుగు నగరాలలో దొరుకుతోంది. (freshmenu.com)   కోమల్ అగర్వాల్ - సెల్ఫోన్ లేని నరమానవుడు కనిపించడం అరుదు. మరి అలాంటి సెల్ఫోనుకి అవసరమయ్యే సదుపాయాలని కొనుక్కోవాలంటే ఒకోటీ ఒకో కంపెనీది కనిపిస్తుంది. దీనికి విరుగుడుగా పవర్బ్యాంక్ల దగ్గర నుంచీ చార్జర్ల వరకూ ఒకే చోట అందిస్తే ఎలా ఉంటుంది అనిపించింది కోమల్ అగర్వాల్ అనే అమ్మాయికి. ఫలితం ‘పెబుల్స్’ బ్రాండ్ ఆవిర్భావం. ఇప్పుడు పెబుల్స్ ఓ వంద కోట్ల సంస్థ.   రిచా కౌర్ - ఆడవారి లోదుస్తులు అనగానే అదేదో అసభ్యమైన పదంలా తోస్తుంది. ఆరోగ్యం కోసమో, సౌకర్యం కోసమో మంచి లోదుస్తులు తీసుకోవాలంటే దేశీయంగా ఉత్త పనికిమాలిన సరుకు లభిస్తుంది. ఈ పరిమితులను దాటాలనుకున్నారు ‘రిచా కౌర్’. మన దేశంలోనే మహిళలకు ఆంతర్జాతీయ స్థాయి లోదుస్తులకు ఓ బ్రాండ్ రూపొందించే ప్రయత్నం చేశారు. అదే Zivme. ఆ బ్రాండ్ ఎంత విజయవంతం అయ్యిందో చూడాలంటే zivame.com/లోకి వెళ్లాల్సిందే!   సైరీ చాహల్ ¬- సైరీ చాహల్ అవకాశాలను అందిపుచ్చుకునే ఓ వ్యాపారవేత్త. అందుకనే ఇంటర్నెట్ మొదలైన రోజుల్లోనే ఓ వెబ్సైటుని ప్రారంభించి లాభాలను సాధించారు. తన సంగతి సరే! కానీ ప్రతిభ ఉన్నా ఇంటిపనులలో సతమతం అయిపోయే స్త్రీల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది సైరీకి. అంతే! SHEROS పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ప్రతిభకు తగిన ఉపాధిని కల్పించడంలో వేలాదిమంది స్త్రీలకు SHEROS సంస్థ ఓ మాధ్యమంగా నిలుస్తోంది (sheros.in). (బిజినెస్ ఇన్సైడర్ సౌజన్యంతో) - నిర్జర.    

women's power

ఆకతాయిల పనిపట్టే – 1090

  2012లో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మహిళలలో ఓ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ అమ్మాయి తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చెబుతూ భోరున ఏడ్చేసింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటే బాగుండు అని అనిపించింది అఖిలేష్కి. వెంటనే నవనీత్ సకేరా అనే ఒక పోలీసు ఉన్నతాధికారిని పిలిపించి పరిస్థితిని వివరించారు. అలా వారిద్దరి మధ్యా పుట్టిన ఆలోచనే – 1090.   ఉత్తర్ప్రదేశ్లో ఆడపిల్లలని ఫోన్లో వేధించే సందర్భాలు చాలా ఎక్కువ. సాధారణంగా అమ్మాయిలు రీచార్జి కోసం ఏదన్నా దుకాణానికి వెళ్లినప్పుడు అక్కడ వారి నెంబర్లను నోట్ చేస్తారు కదా! అలా నోట్ చేసిన నెంబర్లను దుకాణదారులు ఆకతాయిలకు అమ్ముతారట. అమ్మాయి బాగా అందంగా ఉంటే ఆ నెంబరుకి 500 రూపాయల వరకూ చార్జ్ చేస్తారు. ఇలా ‘కొనుక్కున్న’ నెంబర్లకి ఏదో రాంగ్ కాల్ అన్నంత అమాయకంగా ఫోన్ చేయడంతో వేధింపు మొదలవుతుంది. అది క్రమేపీ స్త్రీలను ఉచ్చులోకి దింపేందుకో, వారిని లైంగికంగా వేధించడానికో దారి తీస్తుంది. ఇలా నెంబర్లని ‘కొనుక్కునే’ స్తోమత లేని ఆకతాయిలు మరో విధంగా ఆడవారి నెంబర్లను సేకరించే ప్రయత్నం చేస్తారు. దీనికోసం వరుసగా నెంబర్లకి డయల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తమకి ఓ ఆడగొంతు వినిపించిందో... ఇక అప్పటి నుంచీ ఆ నెంబరుని వేటాడటం మొదలుపెడతారు.     తమని ఫోన్లో ఆకతాయిలు వేధిస్తుంటే ఏం చేయాలో ఉత్తర్ప్రదేశ్ ఆడవారికి తోచేది కాదు. పోనీ పోలీస్ కంప్లయింట్ ఇద్దామంటే... అది ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం, నేరస్తులకు శిక్ష పడుతుందా అన్న అనుమానం వారిని వేధించేవి. కానీ ఇప్పుడు 1090కి ఫోన్ చేస్తే చాలు, వారి సమస్యని ఓ కాల్ సెంటరులోని వ్యక్తులు నమోదు చేసుకుంటారు. తరువాత ఏ నెంబరు నుంచైతే వారు వేధింపులను ఎదుర్కొంటున్నారో, ఆ నెంబరుకి ఫోన్ చేస్తారు. ‘మీ నుంచి వేధింపు కాల్స్ వస్తున్నట్లుగా మాకు ఫిర్యాదు అందింది. తీరు మార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది,’ అంటూ హెచ్చరిస్తారు.   వేధింపులని ఆపమంటూ పోలీసుల నుంచి ఫోన్ రాగానే రకరకాల స్పందనలు వినిపిస్తాయి. తమకేమీ తెలియదని కొందరు బుకాయిస్తారు, ఆ అమ్మాయంటే తమకి ఇష్టమని మరికొందరు వాదిస్తారు, తప్పయిపోయింది క్షమించమంటూ ఇంకొందరు వేడుకుంటారు. మొత్తానికి చాలా సందర్భాలలో 1090 నుంచి వచ్చే హెచ్చరికతో వేధింపులు ఆగిపోతాయి. అలా కాకుండా ఇంకా వేధింపులు కొనసాగితే మాత్రం సదరు ఆకతాయిలను వారి కుటుంబసభ్యులతో సహా పిలిపించి కౌన్సిలింగ్ను నిర్వహిస్తారు. ఇకమీదట వేధింపులకు పాల్పడనని భగవద్గీత మీద ప్రమాణం చేయించుకుంటారు. మరికొందరు ముదర్లు ఉంటారు. ఈ కౌన్సిలింగ్ స్థాయి దాటిన తరువాత కూడా వేధింపులను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన సందర్భాలలో వారి మీద కేసు నమోదు చేసి ‘మామగారింటికి’ పంపిస్తారు.     1090 హెల్ప్లైన్ ఏదో కంటితుడుపు చర్యగా మొదలుపెట్టిన వ్యవస్థ కాదు. దీని కోసం బోలెడంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ప్రత్యేకమైన కార్యాలయం ఉంది. ఇంతేకాకుండా 1090 గురించి వాడవాడలా తెలిసేందుకు బోలెడు ప్రచారమూ చేస్తుంటారు. ఫలితం! 2012 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకూ 6.81 లక్షల ఫిర్యాదులు అందాయి. వీటిలో ఆకతాయిలు వేధిస్తున్నారంటూ వచ్చే ఆరోపణల దగ్గర్నుంచీ సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపుకి గురవుతున్నాం అని వచ్చే ఫిర్యాదుల వరకూ ఉన్నాయి. వీటిలో దాదాపు 98% ఫిర్యాదులను పరిష్కరించడం విశేషం! ప్రస్తుతానికి ఉత్తర్ప్రదేశ్లోని ఆడవారు తమకి ఏదన్నా ఇబ్బంది ఎదురైతే ‘దస్ నబ్బే’ (1090)కి ఫోన్ చేస్తే సరి అని ధీమాగా ఉన్నారు. అంతకంటే మరేం కావాలి!!! - నిర్జర.    

amitabh bachchan property

అమితాబ్లాంటి భర్తే కావాలి

  జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఘట్టం పెళ్లి. పెళ్లిలో దక్కిన జీవితభాగస్వామి కనుక సరైనవాడైతే జీవితం పల్లకీలో సాగిపోతుంది. లేకపోతే తల్లకిందులైపోతుంది. అందుకే తమతో కలిసి నడవబోయేవారు ఎలా ఉండాలనే విషయం మీద ప్రతి ఒక్కరికీ బోలేడు ఆశల ఉంటాయి. భారత్ మేట్రిమోనీ సంస్థ ఈ ఆశలు ఏ తీరుగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది.   - ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా సాగిన ఈ సర్వేలో 1500 మంది పాల్గొన్నారట. వీరిలో 37 శాతం మగవారు కాగా 63 శాతం స్త్రీలు కావడం గమనార్హం. పైగా తమకి ఎలాంటి వధువు/ వరుడు కావాలో ఎవరన్నా హీరోతోనో హీరోయిన్తోనో పోలుస్తూ చెప్పమంది ఈ సంస్థ. ఆ సర్వేలో తేలిన విషయాలు ఏమిటంటే...   - ఓ పదిహేనేళ్ల క్రితం దుమారంలా దూసుకువచ్చిన హృతిక రోషన్ ప్రస్తుతం ఫ్లాప్లతో సతమతం అవుతూ ఉండవచ్చుగాక. భార్య సుసాన్ నుంచి దూరం కావడం, మాజీ ప్రేయసి కంగనాతో గొడవలు పడటంలాంటి సమస్యలు సరేసరి! అయినా తమకు కాబోయే భర్త హృతిక్లాగా అందంగా ఉండాలంటూ ఏకంగా 70 శాతం మంది స్త్రీలు కోరుకున్నారట.   - జీవితభాగస్వామి అందంగా ఉంటే సరిపోదు కదా! నిజాయితీగా కూడా ఉండాలిగా! అందుకే 55 శాతం మంది స్త్రీలు తమకు కాబోయే భర్త షారుక్ ఖాన్ అంత నిజాయితీగా ఉండాలని కోరుకున్నారట. షారూక్ నటించిన పాత్రలు చూసే ఈ మాట అన్నారో లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్నే గమనించారో కానీ... ఆడవారిలో అధికశాతం ఆయనకే ఓటు వేశారు. నిజాయితీలో షారుక్ తరువాత స్థానాలని అజయ్ దేవగన్ (30 శాతం), ఎం.ఎస్.ధోనీ (15 శాతం) అందుకున్నారు.   - నిజాయితీ సంగతి అలా ఉంచితే మీకు ఎవరిలా కష్టపడే వ్యక్తి భర్తగా రావాలి అన్న ప్రశ్నకు విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్లాగా కష్టపడే భర్త కావాలని కోరుకుంటున్నారట. ఈ రంగంలో వీరిద్దరికీ చెరో 25 శాతం ఓట్లు దక్కాయి.   - ఇక 70వ ఒడిలో పడినా బాలీవుడ్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నా అమితాబ్ ఈ జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు. అది కూడా రెండు సందర్భాలలో! ఇతరులను గౌరవంగా చూడటంలో ఎలాంటి భర్తని కావాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు 50 శాతం మంది అమితాబ్కే ఓటు వేశారు. అంతేకాదండోయ్... ఇతరులను అర్థం చేసుకోవడంలో ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారని అడిగినప్పుడూ ఇదే పరిస్థితి.   - స్త్రీల సంగతి అలా ఉంచితే.... యువకులు మాత్రం తమకు కావల్సిన స్త్రీ అచ్చు ‘ద్రష్టీ ధమీ’లా ఉండాలని కోరుకున్నారట. ఈ ద్రష్టీ ధమీ ఎవరో తెలుగువారికి అంతగా తెలియకపోవచ్చు. కానీ హిందీ నుంచి డబ్బింగ్ చేయబడిన మధుబాల సీరియల్లో హీరోయిన్గా ద్రష్టీ ధమీ తెలుగు తెరలకి పరిచయమే!   అదీ విషయం! మీ భర్తలో ఎలాంటి గుణాలు కావాలో ఎవరో ఒక తారతో పోల్చి చూపించండి అని అడిగినప్పుడు బయటపడిన నిజాలివి. మిగతా సర్వేలకు విభిన్నంగా ఉంది కాబట్టే దీనిని దాదాపు రెండుకోట్ల మంది వీక్షించారని భారత్ మాట్రిమోనీ సంస్థ చెప్పుకొస్తోంది.     - నిర్జర.      

adoption

CONNECTING THE DOTS

  It started before I was born. My biological mother was a young, unwed college graduate student, and she decided to put me up for adoption. She felt very strongly that I should be adopted by college graduates, so everything was all set for me to be adopted at birth by a lawyer and his wife. Except that when I popped out they decided at the last minute that they really wanted a girl. So my parents, who were on a waiting list, got a call in the middle of the night asking: "We have an unexpected baby boy; do you want him?" They said: "Of course." My biological mother later found out that my mother had never graduated from college and that my father had never graduated from high school. She refused to sign the final adoption papers. She only relented a few months later when my parents promised that I would someday go to college.   And 17 years later I did go to college. But I naively chose a college that was almost as expensive as Stanford, and all of my working-class parents' savings were being spent on my college tuition. After six months, I couldn't see the value in it. I had no idea what I wanted to do with my life and no idea how college was going to help me figure it out. And here I was spending all of the money my parents had saved their entire life. So I decided to drop out and trust that it would all work out OK. It was pretty scary at the time, but looking back it was one of the best decisions I ever made. The minute I dropped out I could stop taking the required classes that didn't interest me, and begin dropping in on the ones that looked interesting.   It wasn't all romantic. I didn't have a dorm room, so I slept on the floor in friends' rooms, I returned coke bottles for the 5¢ deposits to buy food with, and I would walk the 7 miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple. I loved it. And much of what I stumbled into by following my curiosity and intuition turned out to be priceless later on. Let me give you one example:   Reed College at that time offered perhaps the best calligraphy instruction in the country. Through out the campus every poster, every label on every drawer, was beautifully hand calligraphed. Because I had dropped out and didn't have to take the normal classes, I decided to take a calligraphy class to learn how to do this. I learned about serif and san serif typefaces, about varying the amount of space between different letter combinations, about what makes great typography great. It was beautiful, historical, artistically subtle in a way that science can't capture, and I found it fascinating.   None of this had even a hope of any practical application in my life. But ten years later, when we were designing the first Macintosh computer, it all came back to me. And we designed it all into the Mac. It was the first computer with beautiful typography. If I had never dropped in on that single course in college, the Mac would have never had multiple typefaces or proportionally spaced fonts. And since Windows just copied the Mac, it's likely that no personal computer would have them. If I had never dropped out, I would have never dropped in on this calligraphy class, and personal computers might not have the wonderful typography that they do. Of course it was impossible to connect the dots looking forward when I was in college. But it was very, very clear looking backwards ten years later.   Again, you can't connect the dots looking forward; you can only connect them looking backwards. So you have to trust that the dots will somehow connect in your future. You have to trust in something — your gut, destiny, life, karma, whatever. This approach has never let me down, and it has made all the difference in my life.   (This is an extract from the speech delivered by Steve Jobs in Stanford University. Steve Jobs is a famous inventor and co- founder of Apple Inc. He was diagnosed with Cancer in 2003 and succumbed to it in 2011. Steve continues to inspire generations with his life and attitude.)

forgetting names

ఫొటో చూస్తే పేరు చెప్పేయవచ్చు

  మీకు ఎప్పుడైనా ఓ మనిషిని చూడగానే ఇతని పేరు బహుశా ఫలానా అయి ఉంటుందని తోచిందా! ఇలా స్ఫురించడం కేవలం సిక్స్త్ సెన్స్ వల్ల కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మనిషి పేరుకీ అతని రూపానికీ మధ్య తగినన్ని పోలికలు ఉండవచ్చని చెబుతున్నారు. 40 శాతం ఖచ్చితంగా అపరిచిత వ్యక్తులకి సంబంధించిన పేర్లని మనం ఏమేరకు గుర్తుపట్టగలం అనే విషయాన్ని తేల్చేందుకు హిబ్రూ యూనివర్శిటీవారు ఓ పరిశోధన చేశారు. ఇందుకోసం కొంతమందికి... వారికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల ఫొటోలను చూపించారు. వాటితో పాటుగా ఓ నాలుగైదు పేర్లని చెప్పి, ఆ ఫొటోకి ఏ పేరు నప్పుతుందో ఊహించమని అడిగారు. ఆశ్చర్యంగా దాదాపు 40 శాతం సందర్భాలలో ఫొటోకి తగిన పేరుని సూచించారట అభ్యర్థులు. కేవలం ఊహామాత్రంగా కనుక ఇలాంటి విషయాల్ని అంచనా వేయగలిగితే అది 25 శాతానికి మించి నిజమయ్యే అవకాశం ఉండకూడదు! ఈ పరిశోదనలో తేలిన మరో విషయం ఏమిటంటే ఏ దేశంవారు, తమ దేశపౌరుల పేర్లనే ఖచ్చితంగా ఊహించగలగడం. ఉదాహరణకి పరిశోధనలో పాల్గొన్న ఫ్రెంచి పౌరులు తమ దేశానికి చెందినవారి పేర్లని మరింత సులువుగా గుర్తించారు. అలాగే ఇజ్రాయేల్ వాసులు, హిబ్రూ జాతివారి పేర్లని త్వరగా పసిగట్టారు. కారణం ఉంది లోకంలో ప్రతి జాతికీ ఓ సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతికి అనుగుణంగానే మనం పేర్లు పెట్టుకుంటాము. వందల ఏళ్లతరబడి అలాంటి పేర్లకి అలవాటుపడటంతో... మనకి తెలియకుండానే ఆ పేర్లకి అనుబంధంగా కొన్ని లక్షణాలను ఊహించుకుంటాము. ఉదాహరణకు రాముడు అన్న పేరు ఉన్న వ్యక్తి కాస్త శాంతంగా కనిపిస్తాడనీ, లక్షణ్ అన్న పేరు వెనుక వినయం ఉట్టిపడుతుందనీ, శివ అన్న పేరు కలిగినవాడు కాస్త కోపంగా కనిపిస్తాడనీ.... రకరకాల అంచనాలు మనకి తెలియకుండానే మెదడులో తిష్టవేసుకుని ఉండిపోతాయి. చిత్రం ఏమిటంటే మనకి ఎలాగైతే ఫలానా పేరుని వినగానే ఓ రూపం గుర్తుకువస్తుందో... ఆ పేరు ఉన్న మనిషి మీద కూడా అలాంటి ప్రభావమే ఉంటుందట. ఆ ప్రభావానికి అనుగుణంగా, తనకి తెలియకుండానే కట్టుబొట్టులలో మార్పు చేసుకుంటాడట. ఇలా తలదువ్వుకునే తీరులోనూ, చూసే చూపులోనూ, కట్టుబొట్టులోనూ అతను చేసుకునే చిన్నచిన్న మార్పులు సైతం తను కనిపించే తీరు మీద ప్రభావం చూపుతాయి. రాముడు అన్న వ్యక్తి బుద్ధిగా నూనెరాసుకుని, పక్క పాపిడి తీసుకుని, బొట్టు పెట్టుకున్నాడే అనుకోండి... నిజంగా అతను రాముడే అనిపిస్తాడు. అదీ విషయం! ఊహ తెలిసినప్పటి నుంచీ మనం పెరిగే సంస్కృతి, మన చుట్టుపక్కల వాతావరణం, చదివే చదువు, స్నేహితులు, ఎదురయ్యే సమస్యలు... లాంటివన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయని ఇంతవరకూ అనుకునేవారం. కానీ ఎవరో పెట్టే పేరు కూడా మన మనస్తత్వం మీద ముద్రవేస్తుందనీ, దానికి అనుగుణంగానే మనం మారిపోతామనీ ఈ పరిశోధన రుజువుచేస్తోంది. కాబట్టి ఇక మీదట పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలండోయ్! - నిర్జర.      

child care

చైల్డ్ కేర్ సెంటర్లతో పిల్లలు డీలా

    ఒకప్పుడు చైల్డ్కేర్ సెంటర్ అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ వాటి గురించి విన్నా... అదేదో పాశ్చాత్య దేశాలకి మాత్రమే చెందిన సంస్కృతి అనుకునేవారు. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు చైల్డ్ కేర్ కేంద్రాలు మన దేశంలోనూ కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్లే సందర్భాలలో ఈ కేంద్రంలో పిల్లలను వదిలి వెళ్లవచ్చన్న భరోసా పెరిగిపోయింది. కానీ తప్పనిసరి అయితే కానీ పిల్లలను ఈ కేంద్రాలలో.... అది కూడా ఎక్కువసేపు ఉంచవద్దని అనేక పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.   నార్వేకి చెందిన కొందరు పరిశోధకులు చైల్డ్ కేర్ సెంటర్లకీ పిల్లలలో ఒత్తిడికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అని పరిశీలించారు. దీనికోసం వారు 85 చైల్డ్ కేర్ సెంటర్లలో 112 మంది పిల్లలను గమనించారు. వీరిలో 8 నుంచి 9 గంటల పాటు చైల్డ్ కేర్ సెంటర్లో గడుపుతున్న పిల్లలలో కార్టిసాల్ అనే రసాయనం చాలా ఎక్కువగా కనిపించింది. మన శరీరంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కార్టిసాల్ ఉత్పత్తి జరుగుతుంది. పిల్లలు ఎంత ఎక్కువసేపు చైల్డ్ కేర్ సెంటర్లో గడిపితే అంత ఎక్కువగా ఈ కార్టిసాల్ పరిమాణం కనిపించింది.   చైల్డ్ కేర్ సెంటరులో ఉండే పిల్లల్లో ఇలా ఒత్తిడి పెరిగిపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు బదులిచ్చే ప్రయత్నం చేశారు పరిశోధకులు. చైల్డ్ కేర్ అయినంత మాత్రాన పిల్లలు సంతోషంగా ఉంటారన్న భరోసా ఏమీ లేదట. అక్కడ ఉండే సవాళ్లు అక్కడా ఉంటాయి. సెంటర్లోని ఇతర పిల్లలతో మెలగడం, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం, గుంపులో గోవిందలా బిక్కుబిక్కుమని గడపడం... లాంటి సమస్యలన్నీ వారి మనసుని క్రుంగదీస్తాయట! పసివయసు పిల్లలకి వారి కుటుంబసభ్యుల సాహచర్యం, స్పర్శ, సాంత్వన చాలా అవసరం అని ఇప్పటికే అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం వింటున్న పరిశోధన ఇదే రుజువుచేస్తోంది.   చైల్డ్ కేర్ సెంటర్లలో పిల్లల అభద్రతా భావం గురించి ఇదివరకు చాలా పరిశోధనలే జరిగాయి. పిల్లల ఉద్వేగ స్థాయి ఇంట్లో స్థిరంగానే ఉంటోందని, చైల్డ్ కేర్ సెంటర్లలో అదుపు తప్పుతోందనీ ఆయా పరిశోధనలు రుజువు చేసే ప్రయత్నం చేశాయి. చైల్డ్ కేర్ సెంటర్లలో పిల్లలను బలవంతంగా పడుకోపెట్టే పద్ధతి కూడా ఏమంత మంచిది కాదని ఈమధ్యే ఓ పరిశోధన తేల్చింది. దీని వల్ల రాత్రిపూట వారు సరిగా నిద్రపోలేకపోతున్నారనీ... తద్వారా ఎదుగుదలకి సంబంధించి అనేక సమస్యలకు లోనవుతున్నారనీ ఆస్ట్రేలియాకు చెందిన ఈ పరిశోధన నిరూపించింది.   మొత్తానికీ ఒత్తిడికీ, చైల్డ్ కేర్ సెంటర్లకీ మధ్య ఉన్న లంకెని నిరూపించిన తాజా పరిశోధనతో నార్వే తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే నార్వేలో రెండేళ్లలోపు పిల్లలు చాలామంది వారానికి 40 గంటల పాటు చైల్డ్ కేర్ సెంటర్లలోనే గడుపుతున్నారట. అయితే ఈ సమస్య కేవలం నార్వేది మాత్రమే అనుకోవడానికి లేదు. మన దగ్గర కూడా ఈ సంస్కృతి మొదలైంది కాబట్టి... మనమూ భుజాలు తడుముకోవాల్సిందే! మన దగ్గర ఉమ్మడి కుటుంబ సంస్కృతి ఉంది కాబట్టి, పిల్లల్ని చైల్డ్ కేర్ సెంటర్లో కాకుండా అమ్మమ్మల ఒడిలో పెంచే అవకాశం ఉందేమో ఆలోచించుకుంటే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి సెంటర్లో చేర్పించినా... ఓ ఆరేడు గంటలకు మించి వారు అందులో మగ్గిపోకుండా చూసుకోవాలి. - నిర్జర.    

ఆడవారికి గులాబీ రంగంటే ఇష్టమా!

ఆడవారి కోసం రూపొందించే వస్తువులు, దుస్తులలో తప్పకుండా లేతగులాబీ రంగు (పింక్) కనిపించి తీరుతుంది. వాళ్లకి ప్రేమలేఖ రాయాలన్నా, కానుకని అందించాలన్నా కూడా అది పింక్ రంగులో ఉంటే... వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని మన నమ్మకం. దానికి అనుగుణంగానే స్త్రీలు కూడా పింక్ రంగంటే ఇష్టపడటాన్ని గమనిస్తూ ఉంటాము. ఇంతకీ ఈ నమ్మకంలో నిజం ఎంత?   ఆడవారికి గుర్తుగా పింక్ రంగునీ, మగవారికి గుర్తుగా నీలం రంగునీ ఫ్యాషన్ ప్రపంచం గుర్తిస్తోంది. ఈ ఇష్టాల వెనుక శాస్త్రీయ కారణాన్ని తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి కూడా! ఉదాహరణకు ఇంగ్లండులోని  న్యూకేస్టిల్ విశ్వవిద్యాలయం వారు 2007లో ఓ ప్రయోగం చేశారు. ఇందుకోసం ఓ వేయిమంది జంటలకి కంప్యూటర్లో వేర్వేరు రంగులను చూపించారు. వీటిలో ఆడవారు ఎక్కువగా గులాబీని తలపించే ఎరుపుని ఇష్టపడుతున్నారని తేలింది. మగవారేమో నీలం రంగుని ఎంచుకుంటున్నట్లు గమనించారు.   స్త్రీలు పింక్ రంగునీ, మగవారు నీలం రంగునీ ఎంచుకోవడం వెనుక మన కుటుంబవ్యవస్థ ఏర్పడిన తీరే కారణం అని విశ్లేషించారు సదరు శాస్త్రవేత్తలు. ఒకప్పుడు ఆడవారు పండ్లని కోసుకురావడం, పిల్లల బాగోగులను గమనించుకోవడం వంటి పనులలో నిమగ్నమయ్యేవారు. మగవారేమో పొలం పనులు, వేట వంటి పనులు చేస్తుండేవారు. పండ్లని కోసేటప్పుడు బాగా ఎర్రగా పండిన పండ్ల మీదకి దృష్టి మళ్లడం సహజం. ఇక పిల్లల బాగోగులను గమనించుకునేటప్పుడు కూడా వారి మొహంలో ఎరుపుదనం మరీ ఎక్కువైనా, తక్కువైనా అది అనారోగ్యానికి చిహ్నంగా భావించి.... వారి చర్మపు రంగుని గమనించుకోవడమూ సహజమే! ఇక మగవారేమో పొలం పనులు చేసేటప్పుడూ, వేటాడేటప్పుడూ ముదురు రంగులే వారి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అలా కుటుంబంలోని శ్రమవిభజన వల్ల ఆడవారికీ పింక్ రంగు, మగవారికి నీలం రంగు మనసులో ఉండిపోయింది.   పింక్ రంగు, నీలం రంగు అనే తేడాలు కేవలం మనం సృష్టించుకునేవే అన్న వాదనలూ లేకపోలేదు. 19వ శతాబ్దంలో ఫలానా రంగు ఆడవారికీ, ఫలానా రంగు మగవారికీ అన్న తేడాలు ఉండేవి కావట. ప్రపంచీకరణ మొదలైన కొద్దీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు, ఇలాంటి చిట్కాలను ప్రయోగిస్తున్నారని కొందరి భావన. ఈ విషయాన్ని నిరూపించేందుకు 2011లో ఓ పరిశోధన జరిగింది. ఇందులో-  రెండేళ్లలోపు పిల్లలు గులాబీ లేదా నీలం రంగుని ఎంచుకోవడంలో పెద్దగా పట్టింపులు చూపలేదు. కానీ రెండేళ్లు దాటిన పిల్లలు ఆడపిల్లలైతే గులాబీ రంగునీ, మగపిల్లలైతే నీలం రంగునీ ఎంచుకోవడం మొదలుపెట్టారు. పిల్లలకి ఊహ తెలుస్తున్న కొద్దీ సమాజం వారిలో గులాబీ ఆడవారికీ, నీలం మగవారికీ అని రకరకాలుగా నూరిపోయడమే దీనికి కారణం అని తేల్చారు.   ఏతావాతా తేలేదేమిటంటే- రంగుల ఎంపికలో ఆడామగా తేడా ఉండే అవకాశం ఉన్నా... మన చుట్టూ ఉన్న వ్యాపారవ్యవస్థ దానిని పెంచి పోషించింది. ఈ విషయాన్ని నిరూపించేందుకు మార్కో అనే సామాజికవేత్త గూగుల్లో లభించే కొన్ని లక్షల పుస్తకాలను స్కాన్ చేసి చూశారు. ఇందులో 1880కి ముందు ఉన్న పుస్తకాలలో గులాబీ రంగు ఆడవారికి ఇష్టమైన రంగు అన్న మాట చాలా తక్కువగా కనిపించింది. కానీ కాలం గడిచేకొద్దీ ఈ తరహా వాక్యాలు తరచూ చోటు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ పరిస్థితి కనుక మరీ హద్దు మీరితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. గులాబీ రంగు ఆడవారిది, గులాబీ రంగు స్త్రీత్వానికి సూచన... అంటూ మోత మోగించేస్తే కొన్నాళ్లకి ఆ రంగంటేనే విరక్తి పుట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.   - నిర్జర

తెలుగు కోసం తెలుగు వన్

  మాతృభాషని నెగ్గించుకోవడం ప్రభుత్వానికో, అకాడెమీలకో పరిమితమైన లక్ష్యం కాదు. మేథావులకి చేతికి వదిలి చూస్తుండిపోయే విషయమూ కాదు! అమ్మభాషని కాపాడుకోవాలి అని ప్రతి ఒక్క వ్యక్తీ, సంస్థా తన బాధ్యతగా గుర్తించి చేరుకోవాల్సిన గమ్యం. ఆ వాస్తవం గ్రహించింది కాబట్టే తెలుగువన్ ప్రారంభం నుంచీ కూడా తెలుగుభాష పట్ల నిబద్ధతతో వ్యవహరించింది. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా తన వంతుగా, తెలుగు కోసం ముందుకు నడిచే ప్రయత్నం చేసింది. ఆ దిశగా కొన్ని మైలురాళ్లు ఇవీ...   తెలుగువన్ సాహిత్యం   Sahityam   ఈ డిజిటల్ యుగంలో సాహిత్యాన్ని చదివేది ఎవరు? అన్న సందిగ్థంలో సాహిత్యాన్నే డిజిటల్ రూపంలో అందించే ప్రయత్నం చేసింది తెలుగువన్. కథలు, కవితలు, బాలసాహిత్యం, బ్లాగ్స్ వంటి అక్షరసంపదను నిరంతరాయంగా అందిస్తూ వస్తోంది. ఇవే కాకుండా గ్రంథాలయం పేరుతో తెలుగు సాహిత్యంలని అరుదైన గ్రంథాలను కంప్యూటర్లోనే చదువుకునే అవకాశం కల్పిస్తోంది. నాటి మేటి రచనలను, రచయితలను నిరంతరాయంగా పరిచయం చేసే ప్రయత్నమూ చేస్తోంది. ఇక ‘తెలుగు సాహిత్యంలో హాస్యం’ అంటూ గరికపాటి ప్రేక్షకులను అలరించినా, ‘చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు’, ‘కాశీయాత్ర,’ వంటి భక్తి ధారావాహికలను అందించినా... తెలుగు అక్షరం ఉన్నంతవరకూ సాహిత్యం నిలిచి ఉంటుందని నిరూపించే ప్రయత్నం చేస్తోంది.   కిడ్స్ వన్  kidsone   ఇప్పటి పిల్లలు పట్టుమని పది కాదు కదా నాలుగు వాక్యాలు కూడా తెలుగులో చెప్పలేని పరిస్థితి. పంటికింది రాయిలాగా పదాల మధ్య ఆంగ్లం లేకుండా మాట్లాడలేని దుస్థితి. దీనికి ఎవరినో నిందించి ఉపయోగం లేదు. ప్రపంచీకరణ ఫలాలను అందుకోవాలనే అత్యాశలో మనమే ఏర్పరుచుకున్న వాతావరణం ఇది. ఇలాంటి పిల్లలకు సులువుగా, స్పష్టంగా తెలుగు తెలిసిరావాలంటే వారి దారిలోనే నడవాలని గుర్తించింది తెలుగువన్. అందుకోసం కిడ్స్వన్ పేరుతో ఓ అనుబంధ వెబ్సైటుకి రూపకల్పన చేసింది. ఇందులో కంప్యూటర్ ద్వారానే పెద్దబాలశిక్షని నేర్చుకునే సదుపాయం కల్పించింది. తెలుగు అక్షరాలను ఆటల రూపంలో అందించింది. తెలుగు పట్ల మక్కువ ఏర్పడేలా వందలాది కథలూ, పద్యాలకు దృశ్యరూపాన్ని ఇచ్చింది. తెలుగు సంస్కృతినీ, శతకసాహిత్యాన్ని కూడా పిల్లలకు అందించేలా వీడియోలను రూపొందించింది. తరం తరువాత తరానికి తెలుగుని పరిచయం చేసే ఏ ప్రయత్నాన్నీ కిడ్స్వన్ వదులుకోలేదు.   టోరీ  TeluguOne Radio TORi   రెండు వందల దేశాలు. ఎనిమిదికోట్లకు పైగా తెలుగువారు. వీరందరి మధ్యా ఆత్మీయవారధిగా నిలిచే ప్రయత్నం తెలుగువన్ రేడియోది (TORI). తెలుగు భాష పట్ల అనురక్తి తగ్గిపోవడంతో... వారి నట్టింటి నెట్లోనే నిత్యం తెలుగుని వినిపించేందుకు మొదలైన మాధ్యమం ఇది. సాధారణ ఎఫ్.ఎమ్ రేడియోలకి భిన్నంగా స్వచ్ఛమైన తెలుగులో స్వరాలు వినిపించే ప్రయత్నం టోరీది. సాహిత్యం దగ్గర నుంచీ సైనికుల భావాల వరకూ ప్రతి ఒక్క రంగాన్నీ స్పృశించే యత్నం టోరీది. అందుకనే భారతదేశంలోనే తొలి పది ఇంటర్నెట్ రేడియోలలో ఒకటిగా టోరీ నిలుస్తోంది. ఏ దేశమేగినా తెలుగు పదం వినిపించే అవకాశం కల్పిస్తోంది.                     - నిర్జర.  

మంచాన్ని వెచ్చగా ఉంచడమే ఆమె పని

  మంచులా చల్లబడిపోయిన దుప్పటి మీద నడుం వాల్చాలంటే చిరాకే! మనకే ఇలా ఉంటే రక్తం గడ్డకట్టేంత చలి ఉండే పాశ్చత్య దేశాల పరిస్థితి చెప్పేదేముంది. అందుకనే వాళ్లు తమ మంచాలను వెచ్చగా ఉంచేందుకు రకరకాల bed warming పరికరాలను వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఓ యువతి మీ మంచాన్ని నేను వెచ్చగా ఉంచుతానంటూ విభిన్నమైన సేవను అందచేస్తోంది. రష్యాకు చెందిన ‘విక్టోరియా ఇవాచ్యోవా’ ప్రపంచంలోనే తొలి ‘human bed warmer’గా పేరు తెచ్చుకొంది. ఎవరన్నా క్లైంట్లు తమ మంచాన్ని వెచ్చపరచమంటూ విక్టోరియాను సంప్రదించగానే... ఆమె నిర్దిష్ట సమయానికి అక్కడికి చేరుకుటుంది. పైజమా వేసుకుని ఓ గంటసేపు క్లైంట్ మంచం మీద పడుకొని, పక్క వెచ్చబడేలా చేస్తుంది. ఆ గంటసేపూ కావాలంటే క్లైంట్ కూడా ఆమె దగ్గరే కూర్చుని ఏమన్నా కబుర్లు చెప్పవచ్చు. తమ బాధలు పంచుకోవచ్చు. కానీ ఆ సంభాషణ శృతి మించకుండా ఉండేలా విక్టోరియా జాగ్రత్తపడుతుంది. క్లైంట్ ఏదన్నా హద్దుమీరి ప్రవర్తిస్తే బయటపడేందుకు ఆమె తన దగ్గర ఓ అలారంను కూడా సిద్ధంగా ఉంచుకుంటుంది.   వినడానికి విచిత్రంగా ఉన్నా విక్టోరియా సేవల కోసం ఎగబడేవారి సంఖ్యలో ఏమాత్రం లోటు లేదు. అందుకు ఆమె వసూలు చేసే ఫీజూ తక్కువేమీ కాదు. ఒక గంటసేపు మంచం మీద పడుకునేందుకు ఆమె అక్షరాలా 5 వేల రూపాయలు చార్జ్ చేస్తుంది. ఇక రోజుకి గంటపాటు, నెలంతా సేవలు అందించాలంటే లక్షరూపాయలకు పైమాటే వసూలు చేస్తుంది. విక్టోరియా ఫీజులు చూసి కూడా క్లైంట్లు వెనక్కి తగ్గకపోవడం ఆశ్చర్యకరం. పైగా చాలారోజుల తరువాత సుఖంగా నిద్రపోయానని ఒకరంటే, పొద్దున నిద్ర లేచిన తరువాత జీవితం మీద కొత్త ఆశలు మొదలయ్యాయి అని మరొకరు మురిసిపోయారు. ఇలా తన సేవల కోసం తపించిపోయేవారి కోసం విక్టోరియా www.she-is-generator.ru/ పేరుతో ఒక వెబ్సైటుని కూడా ప్రారంభించి, ఆన్లైన్ సేవలను అందిస్తోంది.     విక్టోరియా చేస్తున్న పని మనకు వింతగా కనిపించవచ్చు. కానీ తను విజయం అయితే సాధించింది కదా! ఎవరూ ఊహించని రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఓ బాట వేసుకుంది కదా! ఇలా Human bed warmingను ఓ వ్యాపారంలా మార్చేందుకు తను చదివిన ఓ పుస్తకమే ప్రేరణగా నిలిచిందని చెబుతోంది విక్టోరియా. ఆ పుస్తకంలో ఓ రచయిత వద్ద పనిచేసే టైపిస్టు, తన యజమానికి త్వరగా నిద్రపట్టేందుకు తను కాసేపు అతని మంచం మీద పడుకునేదట. నవల్లో ఉన్న ఆ విషయాన్ని నిజం చేయాలనుకుంది విక్టోరియా! పైగా తను మంచం మీద పడుకోవడం వల్ల తనలోని సానుకూలమైన విద్యుత్ తరంగాలు మంచానికి బదిలీ అవుతాయని చెబుతోంది. అన్నింటికీ మించి... సదరు మంచం మీద ఒరిగిన వెంటనే క్లైంట్లు ఆ వెచ్చదనానికి గాఢంగా నిద్రపోతారని హామీ ఇస్తోంది. - నిర్జర.    

టీనేజర్స్ గదులు ఎలా ఉండాలంటే...?

  టీనేజ్‌లోకి వచ్చిన వెంటనే తమకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. అందువల్ల వీలైనంతవరకు వారికి ఒక ప్రత్యేక గదిని కేటాయించితే మంచిది. తమ గది అనే ఆలోచన కలగగానే వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. అందువల్ల వారి అభిరుచులను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా గది ఏ రంగులో ఉంటే ఇష్టమో ఆ విధంగా ఉండేలా చూసుకోవాలి.   రంగులను క్రియేటివ్‌గా వేస్తే బావుంటుంది. బాక్‌గ్రౌండ్ అంతా ఒకే కలర్‌లో ఉండనవసరం లేదు. గ్రే, గ్రీన్, బ్లూ కలర్స్‌లో బాగా లైట్‌గా ఉండే షేడ్‌ని ఎంచుకుంటే బాగుంటుంది. ఆ రంగుల వల్ల గోడలు ప్లెజంట్‌గా అనిపిస్తాయి. అవి వారి మనస్తత్వానికి అనువుగా ఉండటం వల్ల వారు హ్యాపీగా ఉండగలుగుతారు. అంతే కాకుండా వారు కూడా కొత్తగా ఫీల్ అవుతారు.     టీనేజర్స్ గదిలో ఉండే మంచం కొద్దిగా పెద్దదిగా ఉండాలి. అలాగే ఆ గదిలో వార్డ్‌రోబ్స్ ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఒక వార్డ్‌రోబ్‌కి అద్దం బిగించితే మంచిది. తెలుపు, మెరైన్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, గ్రే రంగులైతే ఫర్నిచర్‌కి కూడా సూట్ అవుతాయి. షెల్వ్స్‌కి ఉండే స్టాండ్‌లు లేతరంగులలో, మంచి ఆకృతిలో ఉంటే, పుస్తకాలు ఉంచడానికి అనువుగా ఉంటాయి. అలాగే చదువుకి సంబంధించినవాటిని ఉంచుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. కంప్యూటర్ తప్పనిసరి కనుక, అనువుగా ఉండేలా అమర్చుకోవాలి.   రూం లో కర్టేన్స్, వాల్ పోస్టర్స్, డిజైన్స్ వంటివి ఏమైనా కూడా వారికి నచ్చే విధంగా డెకరేట్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా చేయటం వల్ల టీనేజర్స్ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. వారి మనస్తత్వం కూడా సరిగా ఉంటూ, ఎప్పుడూ చలాకీగా ఉంటారు.